ఆర్థిక పరిస్థితులు ఉన్నత విద్యను అందుకోవడానికి అడ్డంకి కావని ఎందరో నిరూపిస్తున్నారు. అది కూడా అసామాన్య పరిస్థితి నుంచి విదేశీ యూనివర్సిటీల్లో చదివే అవకాశం పొందే రేంజ్కి వెళ్తుండటం విశేషం. అచ్చం అలాంటి నేపథ్యం నుంచి వచ్చి ఈ వక్తి ఏకంగా సింగపూర్లోని ప్రతిష్టాత్మక కాలేజ్లో పీహెచ్డీ చేసే స్థాయికి చేరుకున్నాడు. పైగా పరిస్థితులు మన ఆశయాలను అడియాశలు చేసేవి కావు, సదా చదువుపై ఫోకస్ పెట్టేలా చేసే ఆయుధాలని అంటుండటం విశేషం.
అతడే ఆంధ్రప్రదేశ్లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన రామ్తుల్లా షేక్(Ramthulla Shaikh). అతడు తన విద్యా ప్రస్థానం, సాధించిన విజయాల గురించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాను ఒకప్పుడు రోజు కూలీగా రూ. 300లు సంపాదిస్తుండే వాడినని చెప్పుకొచ్చారు. తన ప్రాథమిక విద్యనంత జిల్లా పరిషిత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత శశికాంత రెడ్డి జూనియర్ కాలేజీలో ఎంపీసీ పూర్తి చేసినట్లు వెల్లడించాడు. అయితే తన విద్యా ప్రయాణంలో చాలా ఆర్థిక సమస్యలు ఎదురయ్యేవని, అందుకోసం సెలవుల్లో కూలీ పనులకు వెళ్లి డబ్బుని కూడబెట్టి చదువుకుంటుండే వాడినని తెలిపారు.
ఆ తర్వాత 2021లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో BTech పూర్తి చేసి, మల్టీనేషనల్ కంపెనీలో సిస్టమ్ ఇంజనీర్గా పనిచేయడం ప్రారంభించినట్లు తెలిపారు. అయితే ఆ సమయంలోనూ రామ్తుల్లా తన చదువుని ఆపలేదు. పూర్తికాలం పనిచేస్తూనే గేట్కి సన్నద్ధమైనట్లు తెలిపారు. అతడి కృషి పలితంగా 2024లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 809వ ఆల్ ఇండియా ర్యాంకు సాధించాడు. దాని ఫలితంగా ప్రతిష్టాత్మక బెంగళూరూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎం.టెక్ చేసే అవకాశం దక్కింది.
జూన్ 2026కల్లా ఎంటెక్ పూర్తి చేసి ప్రభుత్వ రంగ కంపెనీల్లో వార్షిక వేతనం రూ. 15 లక్షలు అందించే ఆఫర్లు వచ్చినా..పరిశోధన చేసేందుకు మొగ్గు చూపి.. ఆగష్టు 2026లో, తాను నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్లో పవర్ ఎలక్ట్రానిక్స్లో పీహెచ్డీ చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే తాను తన విజయాలను ప్రదర్శించడం కోసం ఇలా సోషల్మీడియాలో పోస్ట్ చేయలేదన్నారు. ఇది కేవలం మీ నేపథ్యం, ప్రారంభస్థానం మన గమ్యాన్ని ఎన్నటికీ నిర్దేశించదని చెప్పడానికి తన విద్యా విజయాల గురించి వివరించినట్లు తెలిపాడు.
ఓర్పు, నిలకడ, నిరంత కృషితో మారుమూల గ్రామ నేపథ్యం నుంచి వచ్చిన తానే సాధించినప్పుడూ..మీరెందుకు సాధించలేరంటూ ఆలోచింపచేస్తున్నాడు. తనలాగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు తమపై తాము నమ్మకం ఉంచి ముందుగకు సాగాలని ప్రోత్సహించేందుకే తన విద్యా ప్రస్థానాన్ని షేర్ చేస్తున్నట్లు వెల్లడించాడు. చివరగా ఆయన క్రమశిక్షణకు పట్టుదల తోడైతే సాధించలేని పెద్ద కల అంటూ ఉండదు అని లింక్డ్ఇన్ పోస్ట్లో రాసుకొచ్చారు రామ్తుల్లా.
(చదవండి: ఒకప్పుడు బాలీవుడ్ పనిచేసేదామె..సడెన్గా 29 ఏళ్లకే రిటైర్మెంట్! ఎందుకో తెలుసా..)


