కాట్మాండు: టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. పలు గ్రామాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రదేశాలు వరద నీటిలో కొట్టుకుపోగా, 28 మంది భద్రతా సిబ్బంది గల్లంతయ్యారు. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
రసువా పర్వత జిల్లా పరిధిలోని శ్యాప్రు బేసి, తిమురే ప్రాంతాలు వరద ధాటికి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భోటే కోశి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గ్రామాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కొట్టుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం ఉందని, నష్టం తీవ్రతపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని జిల్లా అధికారి నరేంద్ర పరియార్ పేర్కొన్నారు.
ఈ విపత్తుపై ప్రధాని బాలేంద్ర షా స్పందిస్తూ.. సహాయక చర్యల్లో పోలీస్, సైనిక బలగాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కాగా, గల్లంతైన 28 మంది భద్రతా సిబ్బందిలో 19 మంది నేపాల్ పోలీస్ విభాగానికి, తొమ్మిది మంది ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (ఏపీఎఫ్)కు చెందినవారు ఉన్నారు. రసువాగఢీ పోలీస్ పోస్టులోని 22 మందిలో 13 మంది ఆచూకీ లభించలేదు. శ్యాబ్రూబేసి ప్రాంతంలో ఆరుగురు పోలీసులు, తిమురే సరిహద్దు అవుట్పోస్ట్లోని 9 మంది ఏపీఎఫ్ జవాన్లు ఇంకా సంప్రదింపులకు అందలేదు. టిబెట్ నుంచి ఉద్భవించే భోటే కోశి నది నేపాల్లోని త్రిశూలి నదిలో కలిసి, అనంతరం భారత్లోకి గండక్ నదిగా ప్రవహిస్తుంది. సరిహద్దుల్లో వరద ఉధృతి నేపథ్యంలో అధికార యంత్రాంగం రక్షణ చర్యలను ముమ్మరం చేసింది.
ఇది కూడా చదవండి: ‘వాళ్లు బెస్ట్ సీఎంలా?’.. సీజేపీ చీఫ్పై పూనావాలా ఆగ్రహం


