న్యూఢిల్లీ: దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రులుగా ఎంకే స్టాలిన్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్ల పేర్లను ప్రతిపాదించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై షెహజాద్ పూనావాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ సంస్థను ‘మోసగాళ్ల ముఠా’ (ఫ్రాడియాస్) అని అభివర్ణించిన ఆయన, దీప్కే పేర్కొన్న ముఖ్యమంత్రులను సంబంధిత రాష్ట్రాల ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని అన్నారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన పూనావాలా, సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో విడుదల చేసిన ఒక వీడియోలో మాట్లాడుతూ.. ప్రజలు తిరస్కరించిన నేతలంటేనే సీజేపీకి ఇష్టమని ఎద్దేవా చేశారు.
‘ఈ ముగ్గురు నేతలను వారి రాష్ట్రాల ప్రజలు తిరస్కరించారు. సీజేపీకి ఇలాంటి వారంటేనే ప్రీతి. ప్రజలు మరో నిర్ణయం తీసుకున్నందున ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నుంచి ‘జనతా’ అనే పదాన్ని తొలగించి, కేవలం ‘కాక్రోచ్ పార్టీ’ అని మాత్రమే పిలవాలి’ అని ఆయన పేర్కొన్నారు. తన వాదనకు మద్దతుగా స్టాలిన్ హయాంలో తమిళనాడు పబ్లిక్ డెట్ (ప్రజా రుణం) పెరగడం, విజయన్ పాలనలో కేరళలో నమోదైన కొవిడ్ మరణాలు, కేజ్రీవాల్ హయాంలో ఢిల్లీలోని మద్యం దుకాణాల అంశాలను పూనావాలా ప్రస్తావించారు.
ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్న అభిజీత్ దీప్కే, దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రులు ఎవరు అన్న ప్రశ్నకు స్పందిస్తూ పలువురు నేతలు మంచి పనితీరు కనబరిచారని చెప్పారు. తమిళనాడు ఆర్థిక వ్యవస్థను స్టాలిన్ మెరుగుపరిచారని, కేరళ ఆరోగ్య రంగంలో విజయన్ చక్కటి సేవలందించారని, ఢిల్లీలో పాఠశాలలు, విద్యారంగ అభివృద్ధికి కేజ్రీవాల్ కృషి చేశారని దీప్కే పేర్కొన్నారు. కాగా గత మే నెలలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలవడంతో సీ జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధికారాన్ని చేపట్టింది. ఈ ఎన్నికల్లో స్టాలిన్ తన సొంత స్థానంలోనూ ఓటమి చవిచూశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పదేళ్ల తర్వాత ఘనవిజయం సాధించగా, వీడీ సతీశన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం సాధించడంతో రేఖా గుప్తా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.
ఇది కూడా చదవండి: తిరుగుబాటు టీఎంసీ ఎంపీలకు లోక్సభ స్పీకర్ నోటీసులు


