సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది. ఈనెల 3న జరిగిన మంత్రివర్గ విస్తరణపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళా ప్రాతినిధ్యం లేకుండా మంత్రివర్గ విస్తరణ చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. 20 మంది అనుకుని, చివరి నిమిషంలో 19 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గ బలం 33కు చేరింది. రాజ్యాంగం ప్రకారం కర్ణాటకలో 34 మంది మంత్రులకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానంపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఆ ఒక్క పదవి ఎవరిని వరిస్తుందోననే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.
సీనియర్లకు మొండి చేయి..
మొన్నటి మంత్రివర్గ విస్తరణలో చాలా మంది సీనియర్లకు మొండిచేయి చూపారు. విజయనగర ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప, ఆయన కుమారుడు గోవిందరాజనగర ఎమ్మెల్యే ప్రియకృష్ణ, శిరా ఎమ్మెల్యే టీబీ జయచంద్ర తదితర నేతలంతా విమర్శలు గుప్పించారు. అలాగే తొలి జాబితాలో ఉన్న ఎమ్మెల్సీ గాయత్రీ శాంతేగౌడ పేరు మలి జాబితాలో కనిపించలేదు. లక్ష్మి హెబ్బాళ్కర్, ఖనీజ్ ఫాతిమా, నయనా మోటమ్మ, అన్నపూర్ణ తుకారాం తదితరులకూ నిరాశే మిగిలింది. ఆ ఒక్క మంత్రి పదవిని మహిళలకు కేటాయించాలనే డిమాండ్ ఉంది.
ముఖ్యమంత్రి మరోసారి ఢిల్లీకి...
అసెంబ్లీ సమావేశాలు సోమవారంతో ముగిశాయి. కేబినెట్ మార్పులతో పాటు ఖాళీ అయిన నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, బోర్డులు, కార్పొరేషన్ల నియామకాలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు, రాష్ట్రవ్యాప్తంగా 100 కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల శంకుస్థాపన తదితర విషయాలపై చర్చించేందుకు సీఎం డీకే ఢిల్లీ వెళుతున్నారు. మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ జరిగితే ముగ్గురు నుంచి ఐదుగురు వరకు కొత్త మంత్రులకు ఉద్వాసన తప్పదని చర్చలు జరుగుతున్నాయి. తొలిగించిన నేతల స్థానంలో అసంతృప్తులకు చోటు కలి్పంచే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
చదవండి: కర్ణాటక కేబినెట్.. రాజీనామాకు మంత్రి నాగేంద్ర రెడీ!


