ప్రపంచాన్ని భయపెడుతున్న పర్యావరణ సమస్యలలో...మైక్రోప్లాస్టిక్ ఒకటి. ఇవాన్ బుడ్జ్ అనే పదహారేళ్ల కెనడియన్ మైక్రోప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడే ఏఐ ఆధారిత రోబో తాబేలును తయారుచేశాడు....
ఒకరోజు...
కుటుంబంతో కలిసి క్యాంపింగ్కు వెళ్లిన ఇవాన్ ఒక తాబేలు ఈత చూసి ‘వావ్’ అనుకున్నాడు. ఆ తాబేలు స్ఫూర్తితో నీటి అడుగున పని చేసే 3డీ హోలోగ్రాఫిక్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన రోబోటిక్ తాబేలు తయారు చేయాలనుకున్నాడు. ఎన్నో నెలల పాటు కష్టపడ్డాడు. ఎట్టకేలకు తన కలను నిజం చేసుకున్నాడు.
ఈ రోబో తాబేలు నీటిలోనే మైక్రోప్లాస్టిక్లను 94 శాతం కచ్చితత్వంతో గుర్తించగలదు. ఈ ఆవిష్కరణకు ఇవాన్కు రీజెనెరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్(ఐఎస్ఇఫ్)లో ప్రతిష్ఠాతకమైన గోర్డాన్ ఇ.మూర్ అవార్డ్ వరించింది.
బాధను వదిలి...ఆవిష్కరణ బాటలో...
చిన్నప్పటి నుంచి ఇవాన్కు పర్యావరణ సంబంధిత విషయాలు, ఇంజినీంగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇష్టం. తల్లిదండ్రులతో పాటు యాత్రలకు వెళుతుండడం వల్ల ఎన్నో సరస్సులు, అడవులను చూశాడు. ప్రకృతిపై, స్వచ్ఛమైన జలాశయాలపై ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ కాలుష్యంపై ఇవాన్లో ఆందోళన పెరిగింది.
‘ఇలా బాధపడడం కంటే ఏదో ఒకటి చేయాలి’ అని గట్టిగా అనుకున్నాడు. అండర్ వాటర్ డ్రోన్ను రూపొందించడానికి బదులుగా, తాబేలుకు ఉండే సహజమైన ఈత సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తాబేలు మోడల్ రోబోను తయారుచేశాడు. సాధారణంగా తాబేళ్లు తక్కువ శక్తిని ఉపయోగించి ఎక్కువ దూరం ప్రయాణించగలవు.
(చదవండి: స్టిక్కీ నోట్తో గిన్నిస్ రికార్డు)


