అందర్నీ ఎదిరించి ప్రేమను విజయవంతంగా పెళ్లిపీటల వరుక తెచ్చుకున్నారు. ఆనందంగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంతా హాయిగా సాగిపోతుందన్న తరుణంలో విధికే కన్ను కుట్టిందో, పరీక్షే పెట్టాలనుకుందో..ఒక్క క్షణంలో వాళ్ల జీవితాలు అగాథంలో పడేలా భయానక యాక్సిడెంట్ ఒక్క కుదుపు కుదిపేసింది. నిజానికి మరొకరేవరైనా ఆ సమయంలో ఎవరి జీవితం వారు అనుకునేవారేమో..కానీ ఆమె అనలేదు. ఎవ్వరేమి చెప్పినా..అతడే తన సర్వస్వం అంటూ చూపిన తెగువకు చేతులెత్తి నమస్కరించాల్సిందే.
అసలేం జరిగిందంటే..గుజరాత్కి సంబంధించిన దీప్తి, జయ్లు చదువుకునే రోజుల నుంచే మంచి స్నేహితులు. సాధారణ స్నేహంగా మొదలైన వారి బంధం..కాస్త ప్రేమగా మారింది. చదువులు పెరుగుతూ వస్తున్నా.. వారి మధ్య దూరం, సంభాషణలు తగ్గలేదు. చివరికి పెద్దయ్యాక కూడా కలిసే ఉండాలనే ఉద్దేశ్యంతో పెళ్లితో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించకున్నారు.
కానీ ఇరు కుటుంబసభ్యులు వారి పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. ఏళ్ల తరబడి నిరీక్షించినా..ఫలితం కనిపించక..చేసేదిలేక..జయ్ పేరెంట్స్ని కాదని దీప్తిని పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపాడు. అలా వారి పెళ్లిలో దీప్తి తరుఫు పెద్దవాళ్లున్న, జయ్ తరుఫున ఎవ్వరూ లేరు. అలా 2024లో ఇద్దరు పెళ్లిచేసుకున్నారు. ఇక నుంచి తమ జీవితాలు ఆనందంగా సాగిపోతాయి అని భావించారు ఇరువురు.
అంతలోనే తమ జీవితాలు తలకిందులైపోతాయని అస్సలు ఊహించలేదు. ఎప్పటిలానే ఆఫీస్కి వెళ్లిన జయ్ ఆరోజు ఇంటికి రాలేదు..అతడి ఆఫీసు ఇన్ఛార్జ్ రావడంతో దీప్తిలో కంగారు, ఆందోళన మొదలయ్యాయి. అతడు వచ్చి జయ్కు చిన్న యాక్సిడెంట అయ్యిందనగానే చిన్న గాయాలే అనుకుని ధైర్యంగా బయలుదేరబోతుండగా..ఇద్దరి బట్టలు తెచ్చుకోవాల్సిందిగా చెప్పడంతో విస్తుపోతుంది.
అయోమయంగా ..కంగారు కంగారుగా ఆస్పత్రికి వెళ్లిన దీప్తికి అక్కడ జయ్ని చూశాకగానీ అర్థం కాలేదు..అతడకి అయ్యింది భారీ యాక్సిడెంట్ని. పైభాగం తప్పించి మొత్తం కింద భాగం 40% మేర కాలిపోయింది, అస్సలు స్పృహలో లేడు జయ్. ఆ దృశ్యాలను చూసి తట్టుకోలేక దీప్తి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. ఆ పరిస్థతిని అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టిందామెకు. ఒక పక్క వైద్యులు ప్రాణాంతకమని చెప్పి.. హుటాహుటినా అహ్మదాబాద్కు తరలించారు.
ఏడు గంటల ప్రయాణం తర్వాత అతనికి చికిత్స మొదలైంది. ఇందులో నాలుగు ప్లాస్టిక్ సర్జరీలు, చర్మ మార్పిడి తదితరాలు ఉన్నాయి. ఇక్కడ దీప్తికి ఆస్ప్రతి భయం, ఆర్థిక భయం వెంటాడుతూనే ఉన్నాయి. కానీ జయ్ని బతికించుకోవాలంటే తాను ధైర్యంగా ఉండాల్సిందే. అంతటి పరిస్థితిని ఒక్కత్తే చక్కబెట్టుకుంటూ..తన వద్ద ఉన్న సొమ్ము, బంగారు తాకట్టు పెట్టి కొంత, స్నేహితుల వద్ద అప్పుగా కొంత ఇలా వచ్చిన సొమ్ముతో అతడికి విజయవంతంగా చికిత్స అందేలా చేసింది.
అయితే ఆ ప్రమాదం జయ్ని శారీరకం, మానసికంగా చాలా బలహీనంగా మార్చేసింది. అతడిలో ఇదివరకటి వ్యక్తిలాంటి చురుకుదనం కోసం మళ్లీ చాలా గట్టిగా పోరాడాల్సి వచ్చింది. తన ముఖంలో నవ్వులు విరబూసిలే తను చేయగలిగిందంతా చేసి, మాములు మనిషిగా చేసింది. జయ్ రోజువారీ పనుల చేసుకోలేకపోయినా..ప్రాణాలతో మాత్రం దక్కించుకుంది. అయితే చుట్టు పక్కల వాళ్లు వయసు చిన్నదే కదా..అతడితో ఎందుకు మరో పెళ్లిచేసుకోమని చెబుతుండేవారు.

పెళ్లి రెండేళ్ల కిందటే అయ్యిందేమో..మాది 14 ఏళ్లప్రేమ బంధం అని, అతడి చేతిని ఎన్ని కష్టాలు ఎదురైనా వదిలేది లేదని తెగేసి చెప్పింది దీప్తి. మరికొందరు జయ్ పరిస్థితికి దీప్తినే కారణమని నిందించేవారు కూడా. అయినా అవేమి లెక్కచేయక అతడిని ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంటూ అసలైన దాంపత్యానికి నిలువెత్తు అర్థంలా మారిందామె. అంతేగాదు ఈ ప్రమాదం తర్వాతే తాము జీవించడం గురించి నేర్చుకున్నామని చెబుతోంది దీప్తి.
ఇంతకముందు తామిద్దరం భవిష్యత్తు గురించి తపన పడి సంపాదన వైపు పరుగులు తీస్తే..ప్రస్తుతం తమ ఆర్థిక పరిస్థితి ఈ రోజు గురించి ఆలోచించలే చేసిందని చెబుతోంది. అంతేగాదు రేపే ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి చిన్న చిన్న ఆనందాలను సెలబ్రేట్ చేసుకోవడం ఎలాగో తెలిసింది, అలాగే తమకు బతుకు విలువ నేర్పిందని అంటోంది దీప్తి.
నిజానికి అంతటి కష్టపరిస్థితుల్లో ఒకరికొకరుగా తోడుగా నిలిచి, ఆలుమగల బంధానికి అసలైన అర్థం ఏంటో చాటిచెప్పారు. కనీసం ఈ దంపతుల అన్యోన్యతకైనా ..ఆ విధి కరిగి మళ్లీ వాళ్ల జీవితాల్లో ఆనందం విరబూసేలా చేయాలని మనసారా కోరుకుందామా.!.
(చదవండి: తొలి అడుగుల నుంచి.. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వరకు..! కుమార్తె భావోద్వేగ పోస్ట్)


