తిరువనంతపురం: కేరళలో ఓణం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని మతాల ప్రజలు ఇందులో భాగస్వాములవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఓణం హిందూ పండుగ కాదని, అది కేవలం మలయాళ సంస్కృతి, పంటల పండుగ మాత్రమేనని ప్రచారం జరుగుతోంది. ఈద్, క్రిస్మస్ పండుగలకు స్పష్టమైన మతపరమైన గుర్తింపు ఉన్నప్పుడు, మహాబలి-వామన పురాణ గాథతో ముడిపడిన ఓణం నుంచి దాని మత గుర్తింపును ఎందుకు వేరు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ఓణం మూలాలు భాగవత, వామన పురాణాల్లోని మహాబలి-వామనుల కథతో ముడిపడి ఉన్నాయి. మహాబలి త్యాగం, వామనుడి పూజలతో పాటు తిరువోణం నక్షత్రం, త్రిక్కాకర ఆలయ సంప్రదాయాలు, ఓణత్తప్పన్ ఆరాధన, పూల రంగోలి (పూకలం) వంటివన్నీ హిందూ ఆచారాలే. అయితే, ప్రస్తుతం దీనిని లౌకిక, లెఫ్ట్-లిబరల్ దృక్పథంతో ద్రావిడ-ఆర్య, అసుర-దేవతల కుల వివక్ష పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఓణం మాత్రమే కాకుండా పొంగల్, బైసాఖి వంటి పలు ప్రాంతీయ హిందూ పండుగలను సైతం కేవలం సంస్కృతి, పంటల పండుగలుగా మార్చి వాటి మూలాలను తొలగించే ధోరణి కనిపిస్తోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు, ఓణం హిందూ సంప్రదాయాలతో కూడుకున్నందున ముస్లింలు దూరంగా ఉండాలని పలువురు మౌలానాలు సూచించగా, సిరో-మలబార్ చర్చి మాత్రం దీనిని సాంస్కృతిక వేడుకగా భావించవచ్చని పేర్కొంది. అందరూ కలిసి వేడుకలు జరుపుకోవడం మంచిదే అయినప్పటికీ, లౌకికవాదం పేరుతో ఒక పండుగకున్న చారిత్రక మూలాలను చెరిపివేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: ఏలియన్స్తో మాట్లాడొద్దు.. హెచ్చరించిన చైనా!


