బీజింగ్: గ్రహాంతరవాసులు (ఏలియన్స్) ఎవరినైనా సంప్రదిస్తే స్పందించవద్దని చైనా ప్రభుత్వం తన పౌరులకు అధికారిక హెచ్చరికలు జారీ చేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త ప్రచారమవుతోంది. అనుమతి లేకుండా ఏలియన్స్కు బదులివ్వవద్దని, ఏదైనా సంకేతం అందితే వెంటనే ఐక్యరాజ్యసమితికి సమాచారం అందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు పలు పోస్టులు, నకిలీ ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అంతర్జాతీయ వ్యోమగామ సంస్థ (ఐఏఏ) సూచనల పేరిట కూడా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఇవన్నీ పూర్తిగా నిరాధారమైన వదంతులని స్పష్టమైంది. చైనా ప్రభుత్వం గానీ, సంబంధిత సంస్థలు గానీ అటువంటి ఆదేశాలు ఏవీ ఇవ్వలేదు.
అసలు కథ ఏమిటి?
ఈ విచిత్ర ప్రచారానికి చైనాకు చెందిన ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత లియు సిక్సిన్ రాసిన ‘ది త్రీ-బాడీ ప్రాబ్లమ్’ నవల మూలమని తెలుస్తోంది. ఆ కథలో గ్రహాంతరవాసుల నుంచి భూమిని కాపాడుకోవడానికి ‘ఎట్టి పరిస్థితుల్లోనూ బదులివ్వవద్దు’ అనే హెచ్చరిక ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో వ్యూస్, ఫాలోవర్లను పెంచుకోవడమే లక్ష్యంగా కొందరు కంటెంట్ క్రియేటర్లు ఈ కల్పిత కథాంశాన్ని నిజమైన ప్రభుత్వ ప్రకటనగా మార్చి ప్రచారం చేస్తున్నారు. గతంలో కూడా 2026 ఆగస్టు 12న భూమిపై గురుత్వాకర్షణ శక్తి కొద్ది సెకన్ల పాటు నశిస్తుందంటూ ఇలాంటి అసత్య ప్రచారమే జరిగింది. డిజిటల్ మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని గుడ్డిగా నమ్మి ఇతరులకు షేర్ చేయవద్దని, నిజానిజాలు పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మళ్లీ జైలు బయటకు రామ్ రహీమ్..


