హైదరాబాద్ నగరాన్ని కళలకు మరో కొత్త వేదికగా మార్చేందుకు ముందుకొచ్చింది ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ. పెయిటింగ్, శిల్పకళ, సెరామిక్స్, ఇన్స్టాలేషన్స్, ఫొటోగ్రఫీ, మిక్స్డ్ మీడియా, వివిధ కళారూపాల సమ్మేళంతో పాటు విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ కొత్త గ్యాలరీ పెద్ద పీట వేయనున్నట్లు ఆర్టిస్ట్, క్యురేటర్ ఏక్చిత్ర స్థాపకురాలు అన్నపూర్ణ మడిపడిగ తెలిపారు. వీటన్నింటికీ అనుగుణంగా విస్తృత స్థలం, ఇతర సౌకర్యాలు ఈ గ్యాలరీలో అందుబాటులో ఉన్నాయి. వర్ధమాన కళాకారులతోపాటు ప్రఖ్యాత కళాకారులకూ అనువైన వేదికగా ఈ ఏక్చిత్ర గ్యాలరీని రూపొందించినట్లు అన్నపూర్ణ తెలిపారు.
ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆర్ట్ కలెక్టర్ అంజూ పొద్దార్, ప్రముఖ రచయిత, దర్శకుడు దేవకట్టా, రావు బహదూర్ ఫేమ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా, యాదగిరిగుట్ట ప్రధాన ఆలయ శిల్పి, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సీనియర్ కళాకారులు బీఏ రెడ్డి, శంకర్ పామర్తి హాజరై అన్నపూర్ణ, ఏక్చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఏక్చిత్ర కొత్త ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి ఎంఎస్ఎస్ రియాల్టీ, రెస్టారెంట్ అనగనగా తెలుగు కలినరీ టేల్స్ భాగస్వామ్యులుగా మారి మద్దతునిచ్చాయి.
పర్మనెంట్ ప్రింట్ మేకింగ్ స్టూడియో:
ఈ ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీలో పర్మనెంట్ ప్రింట్ మేకింగ్ స్టూడియో కూడా ఏర్పాటు చేశారు. ప్రింట్ మేకింగ్ను ఒక ప్రత్యేక కళారూపంగా మార్చడం, దాన్ని ప్రోత్సహించడంలో ఈ గ్యాలరీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అలాగే కళాకారులను ఈ మాధ్యమంతో అనుసంధానించడం కూడా ముఖ్య ఉద్దేశ్యంగా పని చేస్తుంది. అంతేకాదు.. శిక్షణ, ప్రయోగాలు, వర్క్ షాప్స్, స్క్రీనింగ్స్, డిబేట్స్, ఆర్ట్ ఎక్స్చేంజ్ మొదలైన అంశాల్లో కూడా కళాకారులకు ఈ గ్యాలరీ ఒక వేదికగా ఉపయోగపడుతుంది.
ఈ సందర్భంగా ఆర్టిస్ట్, ఏక్చిత్ర వ్యవస్థాపకురాలు అన్నపూర్ణ మాట్లాడుతూ.. 'ఈ ఏక్చిత్ర గ్యాలరీ ప్రదర్శనలు, భాగస్వామ్యాలు, సంభాషణలతో పాటు కళాకారులు, ప్రేక్షకుల మధ్య ఏర్పడిన సంబంధాల వల్లే అభివృద్ధి చెందింది. ఎగ్జిబిషన్లకు వేదికగా మాత్రమే కాకుండా కళాకారులు, కళల మధ్య అనుబంధాలను పెంచుతూ.. సంభాషణలు, వర్క్ షాపులు వంటి సరికొత్త కార్యక్రమాలకు వేదిక కావాలన్నదే మా ముఖ్య ఉధ్దేశ్యం. వీటన్నింటికీ మా ఆర్ట్ గ్యాలరీ ఉపయోగపడాలని, దాన్నొక అవసరంగా మేము భావించాం' అని తెలిపారు. ఈ కొత్త గ్యాలరీ కళకారులు, డిజైనర్లు, ఆర్కిటెక్ట్స్, పరిశోధకులు, సాంస్కృతిక రంగానికి చెందిన వ్యక్తులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు భవిష్యత్తులో పలు అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు అన్నపూర్ణ వెల్లడించారు.
ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన దర్శకుడు వెంకటేశ్ మహా మాట్లాడుతూ, 'కళతో మమేకమయ్యే ఇంటరాక్టివ్ ఆర్ట్ స్పేస్ లను నేను యూరప్ పర్యటనలో చాలా చూశాను. అలాంటి చోట నాకు టైమ్ స్పెండ్ చేయడం చాలా ఇష్టం. అవకాశం ఉన్నప్పుడు అక్కడి వర్క్ షాపుల్లో పాల్గొనేవాడిని. ఇప్పుడు ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ అలాంటి స్పేస్గా ముందుకురావడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో నేను పాల్గొనేందుకు ఎదురుచూస్తుంటాను' అని చెప్పారు.
దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ, 'ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ కళ, సృజనాత్మకతకు ఒక ప్రత్యేక గుర్తింపుగా మారాలని కోరుకుంటున్నాను. కళాకారులు, కళాభిమానులకు ఇది గొప్ప కమ్యూనిటీని ఏర్పర్చాలని ఆశిస్తుస్తున్నాను' అని తెలిపారు.

మొదటి ప్రదర్శన : ట్రాన్సిషన్
ఏక్చిత్ర న్యూ గ్యాలరీ.. ‘ట్రాన్సిషన్: ఎ కంటిన్యుటీ టు చేంజ్ - యాన్ ఓడ్ టు ఐడెంటిటీస్ ఇన్ ఫ్లక్స్’ అనే ఎగ్జిబిషన్ తో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు ఇందులో పాల్గొంటారు. శిల్పకళ, పెయింటింగ్, సెరామిక్స్, ప్రింట్ మేకింగ్ మొదలైన విభిన్న కళారూపాలకు చెందిన కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తారు. కళారూపాలతో వీళ్లంతా మన దేశ వారసత్వ సంపదలను ప్రపంచానికి చాటనున్నారు. ఈ కొత్త గ్యాలరీ గతంలో వేర్వేరుగా భాగాలుగా మారిన ఫైన్ ఆర్ట్స్, క్రాఫ్ట్, డెకరేటివ్ ఆర్ట్స్ ల మధ్య సంబంధాన్ని గుర్తుచేయనుంది.
ఫౌండర్ కమ్ క్యురేటర్ అన్నపూర్ణ..
ఆర్టిస్ట్, క్యురేటర్ అన్నపూర్ణ మడిపడిగ ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకురాలు. ఆమె హైదరాబాద్ కేంద్రంగా కళ, కథనం, జ్ఞాపకం, సంస్కృతి, ప్రాంతీయతలను ఒకచోటకు చేర్చే క్యురేటోరియర్ ప్లాట్ఫామ్ గా ఈ ఏక్ చిత్ర ను స్థాపించింది. హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ వంటి నగరాల్లో ఆమె ఇప్పటివరకు 25కు పైగా ప్రధాన ప్రదర్శనలకు క్యురేటర్ గా వ్యవహరించింది. తెలుగు రాష్ట్రాల కళా చరిత్ర, జీవన సంప్రదాయాలతో ఏక్చిత్రకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆర్కిటెక్చర్, సాహిత్యం, చిత్రకళ , సంగీతం, హస్తకళలు, దేవాలయ సంప్రదాయాలు, దక్కనీ ప్రభావాలు, జానపద కళారూపాలు వంటి అంశాలపై కూడా ఆమె దృష్టి సారిస్తోంది.
ఏక్చిత్ర భవిష్యత్ ప్రణాళికలు:
లివింగ్ టెంపుల్ నుంచి బావ్లీ ఆర్ట్ సంగం
ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ తమ కార్యకలాపాలపై పక్కా ప్రణాళికలు రూపొందించింది.
- లివింగ్ టెంపుల్ - ఎడిషన్-2:
ఈ కార్యక్రమం ద్వారా వారసత్వ ప్రదేశాలను సాంస్కృతిక వేదికలుగా మార్చడం. కళ, ఆర్కిటెక్చర్, సంప్రదాయ వ్యక్తీకరణ, ప్రజల భాగస్వామ్యం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం.
- కీర్తనం:
ఈ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల కళా చరిత్రకు అంకితం చేసే విధంగా రూపొందించనున్నారు. కళా చరిత్రలు, సాంస్కృతిక కథనాలకు అధిక ప్రాధాన్యం అందించడం.
- బావ్లీ ఆర్ట్ సంగం:
దీనిద్వారా హైదరాబాద్ లోని చారిత్రక మెట్ల బావులను కళా వేదికలుగా మార్చే ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడం. మెట్ల బావులను కేంద్రంగా చేసుకుని, ప్రదర్శనలు, వర్క్ షాపులు, హెరిటేజ్ వాక్స్, టాక్స్ వంటి వాటిని ప్రోత్సహించడం. వారసత్వం, నీరు, ఆర్కిటెక్చర్ లకు సమకాలీన కళను అనుసంధానం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం.
ఇటువంటి విభిన్న, అద్భుత ప్రాజెక్టులతో ఈ కొత్త ఏక్చిత్ర ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్ కళారంగానికి మరో చిరునామాగా మారనుంది. ప్రదర్శన, అభ్యాసం, భాగస్వామ్యం ద్వారా కళను కళాభిమానులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఏక్చిత్ర ముందుకొచ్చింది.


