మిస్ యూనివర్స్ అందాల పోటీల ఫైనల్స్ జైపూర్లో విజయవంతంగా పూర్తైన సంగతి తెలిసిందే. ఈవేడుకలో మిస్ యూనివర్స్గా కేరళ అమ్మాయి కజియా లిజ్ మెజో కిరిటాన్ని గెలుచుకుంది కూడా. అయితే ఈ వేడుకలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన వారిలో ఒకరైన బాలీవుడ్ బ్యూటీ, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్పై ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. ఆమె తీరుపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆమె ఆ కార్యక్రమంలో ఫస్ట్ రన్నరప్ మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2026 వైష్ణవి గణేష్కు అనుకూలంగా వ్యవహరించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుస్మితా మిస్ ఇండియా టైటిల్ని గెలిచిన కజియాని ఎలా విస్తరిస్తున్నావ్ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆగస్టు 24న 'మెజెస్టిక్ మూమెంట్స్' అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ఒక వీడియోను షేర్ చేసింది. ఆ నేపథ్యంలోనే నెటిజన్లు ఆగ్రహావేశాలు వెల్లగక్కుతున్నారు. ఆ వీడియోలో సుస్మిత కొత్తగా కిరీటం గెలుచుకున్న కజియాని అభినందిస్తున్నప్పటికీ..ఆమె నేరుగా వైష్ణవి వైపుకి నడుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
అంతేగాదు విన్నర్ కజియాకి ఏదో మొక్కబడిగా కంగ్రాట్స్ చెబుతున్నట్లుగా క్లియర్గా కనిపిస్తుంది. ఆ తర్వాత సుస్మిత వైష్ణవిని ఓదారుస్తూ..తలపై ఉన్న మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2026 కిరీటాన్ని సరిచేస్తూ కనిపిస్తుంది. అదే సమయంలో సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలాతో సహా ఇతరులు కూడా అక్కడున్న అందగత్తెలందర్నీ అభినందిస్తున్నారు. కానీ సుస్మిత మరోసారి కజియాని దాటి వెళ్లిపోవడం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో నెటిజన్లు ఒక్కసారిగా మండిపడ్డారు.
విజేత వద్దకు వెళ్లి రన్నరప్ వద్దకు వెళ్లి ఉంటే బాగుండేదని, అది వేదిక మర్యాద అంటూ విమర్శల వర్షం కురిపించారు. ఒక మాజీ మిస్ యూనివర్స్ ఇలా ప్రవర్తించాలా అంటూ ఆమె వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. అంతేగాదు సుస్మిత మీలాంటి వాళ్లు న్యాయనిర్ణేతగా ఉండకూడదు అంటూ తింటిపోస్తూ పోస్టులు పెట్టారు. ఇదిలా ఉండగా, ఈ వేడుకలో ఊర్వశి రౌతేలా తన దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షించింది.
త్రివర్ణ పతాక స్ఫూర్తితో మెరిసింది..
భారత జాతీయ జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల స్ఫూర్తితో రూపొందించిన గౌన్ను ఆమె ధరించింది. ఈ కార్యక్రమానికి తాను ఈ గౌనులో రావడానికి గల రీజన్ కూడా వెల్లడించారు. ఈ ఏడాది జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వద్ద ఒక మీడియా సంస్థ తన గురించి ప్రశ్నించినప్పుడు..సగర్వంగా భారతీయురాలిని అని చెప్పానన్నారు. కానీ ఈ రోజు అంతకుమించి ప్రత్యేకమైన రోజు అని అందుకే ఇలా ఈ త్రివర్ణ పతాక రంగుల గౌనులో వచ్చానని చెప్పారు.
#WATCH | Jaipur, Rajasthan | Grand Finale of Miss Universe India 2026 | Former Miss Universe India and Actress Urvashi Rautela says, “One should never consider failure as a failure. There is always scope to learn and to move further. I really want to wish all of them all the very… pic.twitter.com/MMK7g4WhgU
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 24, 2026
దీన్ని అంతర్జాతీయ డిజైనర్ 'దాషా' రూపొందించారని, డిజైన్ చేయడానికే మూడునెలల సమయం పట్టిందని అన్నారు. ఇలా'మిస్ యూనివర్స్ ఇండియా' ఫినాలేలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఈ గౌన్ ధరించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. పైగా ఇలా న్యాయనిర్ణేతగా వ్యవహరించడం తనకు నాల్గోసారని చెప్పారు. కాగా, ఈ వేడుకలో న్యాయనిర్ణేతలుగా బాలీవుడ్నటి, మాజీ మిస్ యూనివర్స సుస్మితా సేన్, మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతేలా, మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా, పర్యావరణవేత్త, చిత్ర నిర్మాత ప్రజ్ఞా కపూర్, మాజీ మిస్ యూనివర్స్ రన్నరప్ సెలీనా జైట్లీ తదితరులు వ్యవహరించారు.
(చదవండి: ఆమెకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని వరించేలా చేసిన ప్రశ్న ఇదే..!)


