సియోల్: దక్షిణ కొరియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన జెజు ద్వీపంలో మూడు రోజుల వ్యవధిలోనే నలుగురు వ్యక్తులు శవాలుగా తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో పది మందికి పైగా అదృశ్యం కావడం, అనుమానాస్పద స్థితిలో మృతదేహాలు లభ్యమవుతుండటంతో అక్కడ సీరియల్ కిల్లర్ సంచరిస్తున్నాడనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా సాగుతోంది. ఈ క్రమంలో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో దేశ అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ స్పందించి ప్రజలకు ధైర్యాన్ని అందించే ప్రయత్నం చేశారు.
మే 12న అదృశ్యమైన 37 ఏళ్ల జాంగ్ మి-రాన్ అనే మహిళ మృతదేహం సోమవారం (ఆగస్టు 24) హల్లిమ్-యుప్లోని ఓ తాటి తోటలో కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. శవపరీక్ష ద్వారా ఆమె గుర్తింపును నిర్ధారించారు. ప్రాథమికంగా ఉరి వేసుకున్నట్లు అనుమానిస్తున్నప్పటికీ, మరణానికి గల కచ్చితమైన కారణాలపై విచారణ కొనసాగుతోంది. అయితే, ఇక్కడ సీరియల్ కిల్లర్ ఉన్నాడనే వాదనలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు అదృశ్యం కేసుల దర్యాప్తులో పోలీసుల అలసత్వం బయటపడింది. సుమారు 17 నెలల్లో 298 మిస్సింగ్ కేసులను పర్యవేక్షించిన ఓ అధికారి తీవ్ర అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు మాట్లాడిందని తప్పుడు సమాచారం ఇచ్చి, ఆధారాలు లేకుండానే జాంగ్ మి రాన్ కేసును మూసివేసి, రికార్డులను తొలగించినట్లు తేలింది. ఆగస్టు 22న శవమై తేలిన 60 ఏళ్ల వృద్ధుడి కేసును కూడా ఇదే అధికారి నిబంధనలకు విరుద్ధంగా క్లోజ్ చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై జెజు సియోబు పోలీస్ స్టేషన్కు చెందిన నలుగురు ఉన్నతాధికారులను నేషనల్ పోలీస్ ఏజెన్సీ (ఎన్పీఏ) సెలవుపై పంపింది. హత్యలు, అక్రమ రవాణా కోణాలపై ఇంకా నిర్ధారణ కానప్పటికీ, కేసుల విచారణపై సమగ్ర దర్యాప్తు జరపాలని, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తేవాలని అధ్యక్షుడు లీ ఆదేశించారు.
ఇది కూడా చదవండి: చేపల మార్కెట్కు మోదీ పేరు.. రచ్చరచ్చ!


