ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. ఏఐ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే భారీగా డబ్బు సంపాదించవచ్చని చాలామంది పెట్టుబడిదారులు నమ్ముతున్నారు. అయితే.. ఈ ఉత్సాహాన్ని చూసి రాబర్ట్ కియోసాకి 1999 నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నారు.
అప్పట్లో ఇంటర్నెట్ కంపెనీలపై కూడా ఇలాగే భారీ అంచనాలు ఉండేవి. ఏఓఎల్, నెట్స్కేప్, పెట్స్ డాట్ కామ్ వంటి సంస్థలను భవిష్యత్తు కంపెనీలుగా భావించారు. కానీ.. కొంతకాలానికే డాట్కామ్ బబుల్ పేలడంతో అనేక కంపెనీల విలువలు కుప్పకూలాయి. పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారు.
జిమ్ రికార్డ్స్ ఏమంటున్నారు?
ఆర్థిక విశ్లేషకుడు, రచయిత జిమ్ రికార్డ్స్ ప్రకారం.. ఏఐ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు, అధిక వాల్యుయేషన్లు ఏర్పడ్డాయని, ఇవి ఒక దశలో తీవ్రమైన దిద్దుబాటుకు దారితీయవచ్చని హెచ్చరించారు. ఏఐ రంగంలో సుమారు 1.4 ట్రిలియన్ డాలర్ల విలువకు ప్రమాదం ఉందని, పరిస్థితి తీవ్రంగా మారితే స్టాక్ మార్కెట్లో భారీ పతనం సంభవించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
ఎన్విడియాపైనా జాగ్రత్త అంటున్నారా?
ఏఐ రంగంలో ప్రస్తుతం ఎన్విడియా వంటి కంపెనీలు అత్యంత కీలకంగా మారాయి. ఏఐ మోడళ్లకు అవసరమైన చిప్లకు భారీ డిమాండ్ ఉండటంతో కంపెనీపై పెట్టుబడిదారుల ఆసక్తి కూడా పెరిగింది. అయితే.. జిమ్ రికార్డ్స్ మాత్రం ఇలాంటి అధిక అంచనాలున్న కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఏఐ రంగంలో బబుల్ ఏర్పడితే కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అన్నారు. అందుకే మార్కెట్ పడిపోయినా.. తట్టుకోగల పెట్టుబడులపై దృష్టి పెట్టాలని సూచిస్తోంది.
1999తో పోలిక ఎందుకు?
ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఏఐ నిజంగా ఉపయోగపడే టెక్నాలజీనా? అనే ప్రశ్న కాదు. అది ఇప్పటికే అనేక రంగాల్లో ఉపయోగపడుతోంది. కానీ ఆ టెక్నాలజీపై ఉన్న అంచనాలు, కంపెనీల షేర్ ధరలు వాటి వాస్తవ వ్యాపార ఫలితాల కంటే చాలా ముందుకు వెళ్లాయా? అన్నదే ప్రశ్న. 1999లో కూడా ఇంటర్నెట్ నిజమైన భవిష్యత్తే. కానీ ఆ పేరుతో వచ్చిన ప్రతి కంపెనీ విజయవంతం కాలేదు. చివరికి బబుల్ పేలినప్పుడు మంచి కంపెనీలు కూడా మార్కెట్ పతనానికి గురయ్యాయి. ఏఐ విషయంలోనూ ఇదే పరిస్థితి వస్తుందేమోనన్న భయమే ఇప్పుడు కొందరు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడిదారులు ఏం చేయాలి?
మార్కెట్ 80 శాతం పడిపోతుంది, 1.4 ట్రిలియన్ డాలర్లు ఆవిరవుతాయి వంటి అంచనాలను ఖచ్చితంగా జరగబోయే విషయాలుగా చూడాల్సిన అవసరం లేదు. ఇవి ఊహించి చేస్తున్న హెచ్చరికలు మాత్రమే. ఏఐ రంగం భవిష్యత్తులో మరింత పెద్దదయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఏ కంపెనీ షేరు ఎంత విలువకు ట్రేడవుతోంది, ఆ కంపెనీకి నిజంగా ఎంత ఆదాయం వస్తోంది, లాభాలు ఎలా ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి వంటి విషయాలను పరిశీలించడం ముఖ్యం.
ఇదీ చదవండి: చాణక్య నీతి: ఈ 5 విషయాల కోసం ఖర్చు చేస్తే.. ఆర్థిక కష్టాలు తప్పవు!


