కృత్రిమ మేధ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ కేంద్ర బ్యాంకుల విధాన నిర్ణయాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్లో బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) నివేదికను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర బ్యాంకుల విధాన నిర్ణయాలను ఏఐ ప్రభావితం చేస్తోందని కియోసాకి పేర్కొన్నారు. జూలై 28న BIS విడుదల చేసిన విశ్లేషణలో.. ఏఐ ఒకేసారి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, సరఫరా రెండింటినీ ప్రభావితం చేయడం వల్ల సాధారణ ఆర్థిక సంకేతాలు స్పష్టత కోల్పోతున్నాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నట్లు ఆయన వివరించారు. దీంతో ఆర్థిక వ్యవస్థలో అసలు పరిస్థితులను అంచనా వేయడం, దానికి అనుగుణంగా ద్రవ్య విధానాన్ని నిర్ణయించడం కేంద్ర బ్యాంకులకు కష్టతరమవుతోందని తెలిపారు.
దీన్ని కియోసాకి తనదైన శైలిలో విశ్లేషించారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినా, తగ్గించినా వాటి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కనిపించడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. అయితే ఏఐ వేగవంతమైన మార్పుల కారణంగా ఈ ‘లాగ్’ తగ్గిపోతోందని పేర్కొన్నారు. కేంద్ర బ్యాంకులు నిర్ణయం తీసుకునేలోపే ఏఐ కారణంగా మార్కెట్లు, వ్యాపార కార్యకలాపాలు వేగంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు.
డేటా సెంటర్లు, చిప్లపై భారీ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థలో వేడి పెరుగుతోందన్న సంకేతాలుగా కనిపించవచ్చని, అయితే అవి భవిష్యత్ ఉత్పాదకతను పెంచే దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా కావచ్చని కియోసాకి వివరించారు. అదే సమయంలో ఏఐ ద్వారా ఉత్పాదకత పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఉన్న డిమాండ్ ఒత్తిళ్లు బయటకు కనిపించకుండా పోయే అవకాశం ఉందన్నారు. ఫలితంగా ద్రవ్యోల్బణ పరిస్థితులను అంచనా వేయడం మరింత కష్టమవుతుందని పేర్కొన్నారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావాన్ని కూడా ఏఐ కొంతమేర సమతుల్యం చేస్తోందని కియోసాకి అన్నారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగినప్పటికీ, ఏఐ ఆధారిత పెట్టుబడులు, ఉత్పాదకత వంటి అంశాలు ఆ ప్రభావాన్ని కొంతమేర ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
‘పాలసీ మిస్క్యాలిబ్రేషన్’ అంటే విధాన నిర్ణయాలు తప్పుగా ఉండే ప్రమాదం పెరగడమేనని కియోసాకి వ్యాఖ్యానించారు. కేంద్ర బ్యాంకులు ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు ఉపయోగించే కాలవ్యవధి, ఆలస్యం వంటి అంశాలపై ఏఐ ప్రభావం చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
తన ‘రిచ్ డాడ్’ చెప్పిన మాటలను కూడా కియోసాకి ఈ సందర్భంగా గుర్తుచేశారు. డబ్బును నియంత్రించే వ్యక్తులకే అది ఎలా పనిచేస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడినప్పుడే అత్యంత ప్రమాదకరమైన ఆర్థిక సమయం మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం అలాంటి దశలోనే ఉందేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు.


