రక్షాబంధన్ ప్రకటనలో బాలీవుడ్ నటి కృతి సనన్ లుక్ నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. పండుగ సంప్రదాయాన్ని అపహాస్యం చేశారంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేయగా, శునకానికి రాఖీ కట్టే సన్నివేశంపైనా నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకపై ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘గివా’ రూపొందించిన సరికొత్త ప్రకటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ యాడ్లో కృతి సనన్ ధరించిన దుస్తులు, ప్రదర్శించిన సన్నివేశాల కాన్సెప్ట్పై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారతీయ పండుగను ఆధునిక కోణంలో చూపించే ప్రయత్నమే ఇదని మరికొందరు పేర్కొంటున్నారు. ఈ ప్రకటనలో కృతి సనన్ ఆఫ్-వైట్ రంగు బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్ ధరించి కనిపించారు. సంప్రదాయ పండుగ వేళ ఇలాంటి ఆధునిక వస్త్రధారణ ఎంపిక చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, పెంపుడు శునకాన్ని కుటుంబ సభ్యుడిగా చూపిస్తూ, మొరుగుతున్న శునకానికి కృతి రాఖీ కట్టే సన్నివేశం కూడా విమర్శలకు దారితీసింది. పండుగ నేపథ్యాన్ని ఆవిష్కరించేందుకు ఇతర మార్గాలున్నాయని పలువురు విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా పలువురు స్పందిస్తూ, హిందూ పండుగల సమయంలోనే ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొందరు దీనిని కేవలం ఒక క్రియేటివ్ క్యాంపెయిన్ మాత్రమేనని అనగా, వివాదం చేయాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై ఇప్పటివరకు అటు కృతి సనన్ గానీ, ఇటు ప్రకటన సంస్థ గానీ ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కృతి సనన్ ఇటీవల ‘కాక్టెయిల్ 2’ చిత్రంలో షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి కనిపించగా, గతంలో ధనుష్తో ‘తేరే ఇష్క్ మే’ చిత్రంలో నటించారు.
ఇది కూడా చదవండి: గణేశ్ ఆగమన యాత్రలో గుడ్లతో దాడి


