సీతాపూర్: ఉత్తర్ప్రదేశ్లోని సీతాపూర్ జిల్లా పరిధిలో ఓ వింత ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తలతో పాటు ఆమె ప్రియుడు కూడా ఒకే ఇంట్లో కలిసి జీవించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మహమూదాబాద్ ప్రాంతానికి చెందిన శుభం వర్మ, అంజు దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నితిన్ అనే యువకుడు తరచూ శుభం ఇంటికి వచ్చి వెళ్లేవాడు. శుభం అతడిని తన సొంత సోదరుడిలా భావించి, ఇంట్లోనే ఆశ్రయం కల్పించడంతో ఇంట్లోని మనిషిలా మారిపోయాడు.
ఈ క్రమంలో అంజు, నితిన్ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అనంతరం తన భర్త శుభం, ప్రియుడు నితిన్లతో కలిసే ఒకేచోట జీవిస్తానని అంజు స్పష్టం చేసింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో గొడవలు లేదా విడాకులకు దారితీస్తుండగా, ఇక్కడ భర్త శుభం భిన్నమైన వైఖరి కనబరిచాడు. తన భార్య అంజుతో పాటు నితిన్ను కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని అతడు తేల్చిచెప్పాడు. అవసరమైతే ఇంటిని వదిలి వెళ్లేందుకైనా సిద్ధమేగానీ, వారిద్దరితో బంధాన్ని తెంచుకోబోనని స్పష్టం చేశాడు. ఇద్దరు పిల్లలను కూడా తమతోనే ఉంచుకుంటామని దంపతులు తెలిపారు. అయితే, ఈ ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో నివసించడాన్ని కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.
వివాదం ముదరడంతో వ్యవహారం మహమూదాబాద్ కొత్వాలీ పోలీసు స్టేషన్కు చేరింది. ఇరువర్గాలకు పోలీసులు గంటల తరబడి కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఇన్స్పెక్టర్ భాను ప్రతాప్ సింగ్ సైతం సర్దిచెప్పే యత్నం చేసినప్పటికీ, ముగ్గురూ తమ నిర్ణయానికే కట్టుబడి ఉండటంతో సమస్య కొలిక్కి రాలేదు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక కేసు నమోదు కాలేదని సమాచారం.
ఇది కూడా చదవండి: చండీగఢ్: ఉగ్ర కుట్ర భగ్నం.. ఆయుధాలతో ముగ్గురు అరెస్ట్


