పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ పర్వత ప్రాంతాల్లో దశాబ్దాలుగా రగులుతున్న గూర్ఖా గుర్తింపు, స్వయంప్రతిపత్తి వివాదానికి శాశ్వత ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. సుక్నాలో స్థానిక నేతలు, వాటాదారులతో నిర్వహించిన కీలక త్రైపాక్షిక భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగ పరిధికి లోబడి ‘శాశ్వత రాజకీయ పరిష్కారం’ కనుగొంటామని హామీ ఇస్తూనే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని విభజించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.
రాష్ట్ర విభజన లేకుండానే రాజ్యాంగ పరిష్కారం
సుక్నాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గూర్ఖా సమస్యపై స్పష్టమైన వైఖరిని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ భౌగోళిక సమగ్రతను దెబ్బతీయకుండా, రాష్ట్రాన్ని విభజించకుండానే గూర్ఖా వర్గాల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, పరిపాలనాధికారాలను పరిరక్షిస్తామని తేల్చిచెప్పారు. ఈ వ్యూహం ద్వారా పర్వత ప్రాంత ప్రజల దశాబ్దాల ఆకాంక్షలను తీరుస్తూనే, బెంగాల్ సమగ్రతను కాపాడే మార్గాన్ని కేంద్రం ఎంచుకుంది.
పంకజ్ కుమార్ సింగ్ నేతృత్వంలో హైలెవల్ కమిటీ
ఈ సమస్య పరిష్కారానికి కార్యాచరణను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం మాజీ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ).. ప్రస్తుత కేంద్ర మధ్యవర్తి పంకజ్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కేవలం చర్చలకే పరిమితం కాకుండా, తుది ఒప్పంద ముసాయిదాను రూపొందించడం, అమలు విధివిధానాలు ఖరారు చేయడం వంటి బాధ్యతలను నిర్వర్తించనుంది.
పరిపాలనా స్వయంప్రతిపత్తిపై కసరత్తు
రాజ్యాంగ నిబంధనలకు లోబడి డార్జిలింగ్ హిల్స్ ప్రాంతానికి మరింత పరిపాలనా స్వయంప్రతిపత్తి లేదా ప్రత్యేక పాలనా యంత్రాంగాన్ని కల్పించే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది. దీని తుది రూపురేఖలు హైలెవల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఖరారు కానున్నాయి. అంతేకాకుండా, ఉత్తర బెంగాల్ పర్వత ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన పూర్తి ఆర్థిక సహకారాన్ని అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
11 గూర్ఖా వర్గాలకు ఎస్టీ హోదా డిమాండ్
ఈ సమావేశంలో దార్జిలింగ్ ప్రాంతంలోని 11 వెనుకబడిన గూర్ఖా వర్గాలకు షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా కల్పించాలనే డిమాండ్పై ప్రత్యేకంగా చర్చించారు. ఎస్టీ హోదా లభిస్తే రిజర్వేషన్లు, రాజ్యాంగ రక్షణలతో పాటు గూర్ఖా యువతకు ఉపాధి, విద్యా రంగాల్లో ఊతం లభిస్తుంది. ఈ వర్గాల సామాజిక-ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా చర్చలు సాగాయి.
సుక్నా భేటీలో ఏకమైన రాజకీయ పక్షాలు
సుక్నా వేదికగా జరిగిన ఈ భేటీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, దార్జిలింగ్ ఎంపీ రాజు బిష్టా, రాజ్యసభ ఎంపీ హర్షవర్ధన్ శ్రింగ్లా, గూర్ఖా జనముక్తి మోర్చా (జీఏఎం) అధినేత బిమల్ గురుంగ్, గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (జీఎన్ఎల్ఎఫ్)అధ్యక్షుడు మన్ ఘీసింగ్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. విభిన్న రాజకీయ భావజాలాలు కలిగిన నేతలందరూ ఒకే వేదికపైకి రావడం ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి సానుకూల సంకేతంగా మారింది.
నాలుగు దశాబ్దాల గూర్ఖాలాండ్ ఆందోళనల చరిత్ర
దార్జిలింగ్, కాలింపాంగ్ పరిసర ప్రాంతాల గూర్ఖాలు తమ ప్రత్యేక భాష, సంస్కృతి, రాజకీయ హక్కుల కోసం 1980ల నుంచి పోరాడుతున్నారు. గతంలో 1988లో డీజీహెచ్సీ, 2011లో జీటీఏ ఏర్పాటైనా అవి స్థానిక సమస్యలను పూర్తిగా పరిష్కరించలేకపోయాయి. తేయాకు తోటల సంక్షోభం, భూమి హక్కులు, ఉపాధి లేమి తదితర సమస్యలు నేటికీ కొనసాగుతున్న నేపథ్యంలో, తాజా హైలెవల్ కమిటీ ఏర్పాటు గూర్ఖా ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.
ఇది కూడా చదవండి: గినియాలో విషాదం: చెత్త కుప్ప కూలి 30 మంది మృతి


