సాక్షి, హైదరాబాద్: జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ డిమాండ్ చేశారు. సంజుష్ను అరెస్టు చేసి భారతి ముఖి కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ఈ ఘటన జరిగి ఐదు రోజులవుతున్నా కానీ నిందితుడిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని కేఏ పాల్ ప్రశ్నించారు. ఆర్థిక సాయం అందించి.. యువతి కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలన్నారు. రూలింగ్ పార్టీలో ఉన్నవారికి ఒక చట్టం.. సాధారణ ప్రజలకైతే ఒక చట్టమా? అంటూ ఆయన నిలదీశారు.
కాగా, లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ హైదరాబాద్ ఐటీ కారిడార్లో లగ్జరీ స్పోర్ట్స్ కారుతో అతి వేగంతో దూసుకొచ్చి ఓ యువతిని బలిగొన్నాడు. అత్యంత రద్దీగా ఉండే ఐటీ కారిడార్లోని ఇనార్బిట్ మాల్ వద్ద ఈ నెల 16న మధ్యాహ్నం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో లైఫ్స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతి ముఖి (26) దుర్మరణం చెందింది. ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజ్యసభ సభ్యుడు, జనసేన పార్టీ నేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్ (23) ఈ ఘోర ప్రమాదానికి కారణమైనట్లు తేలింది. దీంతో సంజుష్పై మాదాపూర్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.


