పూణె: మహారాష్ట్రలోని పూణె జిల్లా బారామతిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) అజిత్ దశావతారే కుమార్తె ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు, వార్తా సంస్థల సమాచారం ప్రకారం.. శనివారం రోజున సదరు బాలిక తన తల్లితో చిన్న విషయమై వాగ్వాదానికి దిగింది. అనంతరం కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఎంత సమయమైనా ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం బారామతి పరిధిలోని రూయ్ గ్రామం సాయినగర్ ప్రాంతంలో ఆమె నివాసానికి సమీపంలోనే బాలిక మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం బారామతి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నామని, పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: విటమిన్ డి సీక్రెట్ బయటపెట్టిన న్యూరాలజిస్ట్


