రిజర్వేషన్ల రద్దు డిమాండ్లతో దేశంలో మరోసారి చర్చ మొదలైన వేళ.. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఎవరు అడిగినా రిజర్వేషన్లను రద్దు చేయలేం.. ఇది ఎవరో ఇచ్చే దానం కాదు.. రాజ్యాంగం కల్పించిన హక్కు’ అంటూ ఆయన తేల్చిచెప్పారు. జంతర్మంతర్ వద్ద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న సమయంలో చిరాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు.. రిజర్వేషన్ వ్యవస్థపై మరోసారి తీవ్ర చర్చకు తెరతీశాయి.
పాట్నా విమానాశ్రయంలో ఢిల్లీకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన చిరాగ్.. తరతరాలుగా సామాజిక వివక్షకు గురైన వర్గాలను సమాజ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే రిజర్వేషన్ల ఉద్దేశమని చెప్పారు. ప్రభుత్వం తన ఇష్టానుసారం ఇచ్చే రాయితీగా రిజర్వేషన్లను చూడకూడదని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలను రాజ్యాంగం గుర్తించిందని, వారి అభ్యున్నతికి రిజర్వేషన్లు ఒక మార్గంగా కల్పించిందని చిరాగ్ పేర్కొన్నారు. సమాజంలో ఇప్పటికీ సామాజిక వివక్షకు సంబంధించిన ఘటనలు జరుగుతున్నాయని.. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పలేమని అన్నారు. అందుకే సామాజిక న్యాయంపై చర్చ కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
జంతర్మంతర్ వద్ద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న విద్యార్థులపైనా చిరాగ్ స్పందించారు. వారు తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారని, వారి అభిప్రాయాలను వినాల్సిన అవసరం ఉందన్నారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని, నిరసనకారులతో మాట్లాడితే రిజర్వేషన్ల వెనుక ఉన్న ఉద్దేశం, అవి ఎందుకు కొనసాగాల్సి వస్తుందో వివరించవచ్చని చెప్పారు. రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలపై కూడా చిరాగ్ స్పందించారు. నిరసనకారుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని చర్చకు అవకాశం కల్పించాలన్న ధోరణిని వ్యక్తం చేశారు.
తేజస్వీకి కౌంటర్..
ఇదిలా ఉంటే బీహార్ ఆర్థిక పరిస్థితిపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపైనా చిరాగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ప్రతిపక్షం ఆధారాలతో తమ అభ్యంతరాలను ప్రస్తావించాల్సిందని అన్నారు. కేవలం ఆరోపణలు చేయడం కాకుండా.. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడం కూడా ప్రతిపక్ష బాధ్యతేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, అభివృద్ధిని వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చిరాగ్ తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో ఒకే కూటమి ప్రభుత్వాలు ఉన్న ‘డబుల్ ఇంజిన్’ పాలనతో బీహార్ ఆర్థికంగా మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


