నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన నర్సింగ్ కోర్సు.. ఆరేళ్లు దాటినా ముగియలేదు. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు.. డిగ్రీ చేతికి ఎప్పుడు వస్తుందో తెలియదు. దీంతో సహనం కోల్పోయిన వందలాది మంది నర్సింగ్ విద్యార్థులు రోడ్డెక్కారు. పోలీసుల బ్యారికేడ్లను తోసుకుంటూ ఏకంగా ఎంపీ కార్యాలయంలోకి దూసుకెళ్లి బైఠాయించారు. మధ్యప్రదేశ్లోని ఖార్గోన్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.
బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లోని ఖార్గోన్లో నర్సింగ్ విద్యార్థుల ఆగ్రహం ఒక్కసారిగా భగ్గుమంది. పరీక్షలు ఆలస్యం కావడం, డిగ్రీలు అందకపోవడంపై ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు.. శుక్రవారం తమ నిరసనను మరింత తీవ్రం చేశారు. వందలాది మంది విద్యార్థులు బిస్తాన్ రోడ్ నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు ర్యాలీగా బయలుదేరి ఎంపీ కార్యాలయం వైపు వెళ్లారు. చేతుల్లో బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థులు వాటిని తోసుకుంటూ ముందుకు వెళ్లారు. పోలీసులను దాటి ఎంపీ గజేంద్ర సింగ్ పటేల్ కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడే బైఠాయించారు.
Anger erupted among hundreds of nursing students in Khargone, Madhya Pradesh, on Friday as they broke through police barricades and entered the premises of the SDM office while protesting delayed examinations and degrees.
Carrying banners and placards, the students marched… pic.twitter.com/1JfQPcJ1rf— IndiaToday (@IndiaToday) August 22, 2026
విద్యార్థుల ప్రధాన ఆవేదన నర్సింగ్ కోర్సు పరీక్షలు, డిగ్రీల జారీలో జరుగుతున్న జాప్యంపైనే. సాధారణంగా నాలుగేళ్లలో పూర్తవ్వాల్సిన నర్సింగ్ డిగ్రీ తమకు ఆరేళ్లుగా మారిపోయిందని వారు ఆరోపించారు. ఇంకా పలు పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో తమ విద్యా భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు రెండూ అనిశ్చితంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కోర్సు పూర్తి చేయాల్సిన వయసులోనే ఏళ్ల తరబడి పరీక్షల కోసం ఎదురు చూస్తున్నాం. డిగ్రీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేదు’ అంటూ విద్యార్థులు తమ సమస్యను వెల్లడించారు.
ఇది కూడా చదవండి: బీజేపీకి కొత్త టెన్షన్.. అసలు సవాలు ఇప్పుడే..
ఈ సమస్యపై విద్యార్థులు వరుసగా ఆరు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే గురువారం తమ ఆగ్రహం మరింత పెరిగిందని వారు చెప్పారు. ఎంపీ గజేంద్ర సింగ్ పటేల్ ఖార్గోన్లోనే ఉన్నప్పటికీ.. తమను కలవడానికి రాలేదని విద్యార్థులు ఆరోపించారు. దీంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఎంపీ కార్యాలయాన్ని ముట్టడించే స్థాయికి చేరుకున్నారు. పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. బారికేడ్లను దాటుకుని కార్యాలయ ప్రాంగణంలోకి వెళ్లి దాదాపు గంటపాటు బైఠాయించి నిరసన తెలిపారు. చివరికి విద్యార్థులు ఎంపీకి ఉద్దేశించిన వినతిపత్రాన్ని ఆయన వ్యక్తిగత సహాయకుడికి అందజేశారు. అనంతరం ఆందోళనను విరమించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


