సాక్షి, చెన్నై: తమిళనాడులోని శాసన సభ్యులకు ప్రభుత్వం తరఫున కొత్త వాహనాలను కేటాయించేందుకు కసరత్తు వేగవంతమైంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 లక్షల నుంచి రూ.34 లక్షల విలువైన కార్లను అందించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించిన మోడల్ కార్లను సచివాలయ ప్రాంగణానికి తీసుకువచ్చి అధికారులు పరిశీలిస్తున్నారు ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వం తరఫున ఉచిత కార్లను అందజేస్తామని అసెంబ్లీలో సీఎం విజయ్ తెలిపిన విషయం తెలిసిందే.
ఇంధనం, వాహన నిర్వహణ, వ్యక్తిగత సహాయకుడి నియామకం వంటి వాటి ఖర్చులకు నెలకు రూ.లక్ష అందజేయనున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటన అమల్లో భాగంగా వివిధ ప్రముఖ ప్రైవేట్ వాహన తయారీ సంస్థలకు చెందిన 6 రకాల మోడల్ కార్లను (మహీంద్రా స్కార్పియో, ఎక్స్యూవీ తదితరాలు) అధికారులు పరిశీలన కోసం చెన్నైలోని సచివాలయ ప్రాంగణానికి తీసుకువచ్చారు.
ఈ కార్లను టెస్ట్ డ్రైవ్ చేసి, అత్యంత అనుకూలమైన మోడల్ను ఎంపిక చేయనున్నారు. 234 కార్ల కొనుగోలుకు ప్రణాళిక రూపకల్పన చేసి ఉన్నా, డీఎంకే సభ్యులు 59 మంది తమకు కార్లు వద్దని ప్రకటించడం గమనార్హం. దీంతో ఎన్ని కార్లు కొనుగోలు చేస్తారో? అన్న చర్చ ఊపందుకుంది. ఒక్కో కారు ఖరీదు కనిష్టంగా రూ.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.34 లక్షల వరకు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం.


