breaking news
TVK Government
-
విజయ్ మరో సంచలన నిర్ణయం.. కఠిన మార్గదర్శకాలు!
సాక్షి, చైన్నె: అవినీతి అంతం దిశగా రాష్ట్రంలోని సీఎం విజయ్ ప్రభుత్వం దూకుడు పెంచుతోంది. ప్రభుత్వ ఉద్యోగులపై నమోదయ్యే అవినీతి నిరోధక దర్యాప్తులు, శాఖాపరమైన విచారణలు సంవత్సరాల తరబడి సాగకుండా ఉండేందుకు కఠినమైన నిర్ణయానికి వచ్చారు. కాలపరిమితితో కూడిన సరికొత్త వివరణాత్మక మార్గదర్శకాలను తాజాగా జారీ చేసింది. అయితే, వివిధ శాఖలలో క్రమశిక్షణా చర్యల దర్యాప్తులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండటంపై మద్రాస్ హైకోర్టు ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక ఉత్తర్వులను వెలువరించింది. అనవసరమైన జాప్యానికి కారణమయ్యే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన హైకోర్టు, అన్ని శాఖలలో పారదర్శకతను పెంచేలా మార్గదర్శకాలు ఉండాలని కోరింది.కాలపరిమితి నిర్దేశం, కొత్త నిబంధనలుప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు, పింఛను (పెన్షన్) ప్రయోజనాలు ఈ పెండింగ్ కేసుల వల్ల నిలిచిపోకుండా చూసేందుకు ప్రత్యేక మార్గదర్శాలు, గడువులను విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.● అవినీతి నిరోధక శాఖలో నమోదైన కేసులలో, కేసు నమోదైన తేదీ నుండి 3 నెలలలోపు తుది నివేదిక ముసాయిదాను తప్పనిసరిగా సిద్ధం చేయాలి.● ప్రభుత్వ ఉద్యోగులపై నేరపూరిత దుష్ప్రవర్తన ఆరోపణలకు సంబంధించిన క్రమశిక్షణా చర్యల ప్రక్రియను గరిష్టంగా 9 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.● ఆరోపణలకు సంబంధించిన విచారణల్లో అవసరమైన పత్రాలు, సాక్ష్యాధారాలను 4 నెలల్లోగా సంబంధిత విభాగానికి అందజేయాలి.● అవినీతి కేసులలో ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత, దర్యాప్తు అధికారి 6 నెలల్లోగా దర్యాప్తును పూర్తి చేయాలి. అనంతరం 2 వారాల వ్యవధిలో తుది నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.● విచారణ నోటీసు అందిన 20 రోజుల్లోగా ప్రభుత్వం దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.ఉద్యోగ సంఘాల ఆహ్వానం..తాజాగా ఉత్తర్వులను ఉద్యోగ సంఘాలు ఆహ్వానించాయి. నిజాయితీపరులైన అధికారులు కూడా ఈ నిరంతర క్రమశిక్షణా చర్యల జాప్యం వలన ఇబ్బందులు పడుతున్నారని తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహకులు పేర్కొన్నారు. టీవీకే విజయ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కాలపరిమితి విధానాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే దర్యాప్తు అధికారులు నిర్దేశించిన ఈ గడువులను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పాటించేలా చూడాలని వారు కోరారు. -
డీఎంకే ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. అరెస్టుకు కసరత్తు!
సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేసిన కేసులో మాజీ మంత్రి, డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని అరెస్టు చేయడానికి చెన్నై పోలీసులు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే ఆయన సోదరుడు అశోక్ కుమార్పై కేసు నమోదు చేశారు.కాగా, విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు పలు బృందాలు రంగంలోకి దిగినట్టు ఇళయరాజ అనే ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బుధవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారంతో గురువారం మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఇందులో ఓ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత ఉన్నారు. కొందరు టీవీకే ఎమ్మెల్యేలకు రూ. 35 కోట్లు, మరికొందరికి రూ. 50 కోట్ల మేరకు ఆఫర్ ఇవ్వడం, బెదిరింపులకు కూడా పాల్పడినట్టు చెన్నై పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడ్డ వారు ఇచ్చిన సమాచారంతో మాజీ మంత్రి , డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్కుమార్పై పోలీసులు దృష్టి సారించారు. అశోక్కుమార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. సెంథిల్ బాలాజీని సైతం ఈ కేసు పరిధిలోకి తెచ్చి, ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ అన్నదమ్ముల కోసం కరూర్, కోయంబత్తూరులో పోలీసులు గాలిస్తున్నారు. -
విజయ్ చుట్టూ రహస్య వలయం.. బయటపడిన షాకింగ్ నిజాలు
తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ చుట్టూ రాజకీయ సలహాదారులు, సినీ మేనేజర్లు, ప్రొడక్షన్ కంట్రోలర్లు, ఎన్నికల వ్యూహకర్తలు, పాత్రికేయులు, వ్యాపార భాగస్వాములు, ఎన్నాళ్లుగానో ఆయనతో ఉన్న నమ్మకస్తులు కలిసి ఉన్నారని ‘‘ఇండియన్ ఎక్స్ప్రెస్’’ పేర్కొంది.వారిలో చాలామంది పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, విజయ్ వ్యక్తిగత వర్గం మధ్య స్వేచ్ఛగా తిరుగుతున్నారని, దీనితో పాలనకు, వ్యక్తిగత సంబంధాలకు మధ్య ఉన్న హద్దులు మసకబారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నట్టు కనిపిస్తున్న వ్యక్తులను తరచూ సోషల్ మీడియా పోస్టులు లేదా ప్రతిపక్ష ఆరోపణల ద్వారానే గుర్తిస్తున్నారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. జూన్ 30న డీఎంకే సంస్థాగత కార్యదర్శి ఆర్.ఎస్.భారతి పోలీసు డైరెక్టర్ జనరల్కు ఫిర్యాదు చేశారు. మంత్రి మండలి సమావేశాలు, అధికారిక సమీక్షలు, ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఇతర గోప్య సమావేశాల్లో జాన్ అరోకియాసామి, విష్ణు రెడ్డి పాల్గొన్నారని ఆరోపిస్తూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.ఆ ఫిర్యాదులో అధికార రహస్యాల చట్టం సహా ఇతర చట్టాల ఉల్లంఘన జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. గోప్యంగా నిర్వహించే ప్రభుత్వ సమావేశాల వివరాలను రహస్యంగా ఉంచాలన్న ప్రమాణాన్ని ముఖ్యమంత్రి పాటించాల్సిన బాధ్యత ఉందని అందులో పేర్కొన్నారు.విష్ణు రెడ్డి విజయ్కు అత్యంత సన్నిహితుడిగా, జాన్ అరోకియాసామి రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారని చెబుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఎదుగుదలలో ఇద్దరూ కీలక పాత్ర పోషించినట్టు సమాచారం.డీఎంకే ఎంపీ పి.విల్సన్ కూడా ఇటీవల ఈ ఇద్దరు ఉన్నతస్థాయి ప్రభుత్వ సమావేశాల్లో పాల్గొనడంపై ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు కాకపోతే మరి వారు గోప్యంగా ఉంచిన పత్రాలపై చర్చ జరిగే సమావేశాలకు వారు ఏ హోదాలో హాజరయ్యారని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలో ఈ ఇద్దరికీ ప్రత్యేక గదులు కేటాయించారని కూడా విల్సన్ ఆరోపించారు. దీంతో ప్రభుత్వంలో వారి పాత్ర, వారికి ఉన్న ప్రాప్యతపై సందేహాలు మరింత పెరిగాయి.టీవీకే ఏమంటోంది?ఈ ఆరోపణలు సరైనవి కావని టీవీకే వర్గాలు తెలిపాయి. కీలక సమావేశాల్లో జాన్ అరోకియాసామి, విష్ణు రెడ్డి పాల్గొనేందుకు అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్నాయి.అయితే, ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. ఈ వ్యవహారం ఇద్దరితో మాత్రమే పరిమితం కాలేదు. విజయ్కు ఎన్నాళ్లుగానో మేనేజర్గా ఉన్న జగదీశ్ పళనిస్వామి ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రైవేట్ సెక్రటరీగా నియమితుడైనట్టు సమాచారం. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రభుత్వ నియామకాన్ని వెల్లడించారు. ఈ నియామకం దాదాపు నాలుగు రోజుల ముందే ఖరారైందని ఓ సీనియర్ టీవీకే నేత తెలిపారు. విష్ణు రెడ్డి, జాన్ అరోకియాసామిలా కాకుండా, ముఖ్యమంత్రితో తన సన్నిహిత సంబంధాన్ని ఉపయోగించి జగదీశ్ ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారని చెప్పారు.మరిన్ని నియామకాలు బెంగళూరుకు చెందిన కేవీఎన్ గ్రూప్ ఛైర్మన్, విజయ్ సినిమా జన నాయగన్ నిర్మాత కె.వెంకట నారాయణను తమిళనాడు ప్రత్యేక ప్రతినిధిగా న్యూఢిల్లీలో నియమించారు. ఈ పదవికి మంత్రి హోదా ఉంటుంది. సాధారణంగా ఫోర్ట్ సెయింట్ జార్జ్, కేంద్ర ప్రభుత్వం మధ్య సంబంధాలను సమన్వయం చేసే బాధ్యత ఈ పదవిదే.వేరుగా, విజయ్ నటించిన పలు సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన మనోజ్ పరమహంసను తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అధినేతగా నియమించారు.విజయ్ శిబిరంలో ప్రస్తుతం ఐదుగురు కీలక అనధికార సలహాదారులుగా పనిచేస్తున్నారు. వారు సలహాలు, సమాచారం, రాజకీయ అంచనాలు అందిస్తూ ముఖ్యమంత్రి సలహా వ్యవస్థలో భాగంగా ఉన్నారని చెబుతున్నారు.వారిలో ఒకరు గతంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్కు సన్నిహితంగా ఉండేవారు. ఇప్పుడు విజయ్ అంతర్గత వర్గంలో ఉన్నారు. ఆయన విష్ణు రెడ్డికి బంధువు కూడా. ఈ బృందంలో అధికారికంగా పార్టీ లేదా ప్రభుత్వంలో హోదా లేని ఇద్దరు పాత్రికేయులు కూడా ఉన్నారని సమాచారం. వారిలో ఒకరు తమిళ పత్రిక మాజీ సంపాదకుడు కాగా, మరొకరు సీనియర్ మీడియా ప్రతినిధి. బదిలీలు, సమన్వయ ప్రక్రియల వంటి పరిపాలనా అంశాలపై వారు సలహాలు ఇస్తున్నారని చెబుతున్నారు.ఇంకా ఇద్దరు సినీ, రాజకీయ రంగాలకు చెందినవారని సమాచారం. వారిలో విజయ్ నమ్మకస్తుడైన మాజీ ప్రొడక్షన్ కంట్రోలర్, ప్రజా సంబంధాల అధికారి ఒకరు కాగా, మరొకరు డీఎంకే కూటమి తరఫున 2 సార్లు ఎంపీగా ఎన్నికైన వామపక్ష ఎంపీ అని సోర్సెస్ తెలిపాయి. -
విజయ్ దూకుడు.. తమిళ రాజకీయాల్లో సంచలనం!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే (AIADMK) నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వందలాది మంది కీలక నేతలు అధికార తమిళగ వెట్రి కళగం (TVK)లో చేరేందుకు సిద్ధమవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కనీసం ఐదుగురు మాజీ మంత్రులు, సుమారు 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, వందలాది మంది జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు టీవీకేలో చేరనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.ఈ చేరికల్లో మాజీ మంత్రులు సీ. విజయభాస్కర్, ఎం.ఆర్. విజయభాస్కర్, ఎం.ఎస్.ఎం. ఆనందన్, ఎస్. వలర్మతి వంటి ప్రముఖ నేతలు ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరు ఇప్పటికే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. దీంతో అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం కూడా క్రమంగా తగ్గుతోంది.అన్నాడీఎంకేలో వరుస వలసలు..కాగా, గత కొన్ని వారాలుగా అన్నాడీఎంకే నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు వరుసగా టీవీకే వైపు వెళ్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు విజయ్ సమక్షంలో టీవీకేలో చేరారు. తాజా చేరికలతో ఈ వలసలు మరింత వేగం పుంజుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత టీవీకే రాష్ట్రవ్యాప్తంగా తన సంస్థాగత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అధికార పార్టీ కావడంతో అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఇతర పార్టీల నాయకులు టీవీకే వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు, పాత ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే టీవీకేలో రాజకీయ భవిష్యత్ మెరుగ్గా ఉంటుందనే భావన కూడా కొంతమంది నాయకుల్లో కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.అన్నాడీఎంకేకు ఇది హెచ్చరికేనా?వరుస రాజీనామాలు, సీనియర్ నేతల నిష్క్రమణ అన్నాడీఎంకే సంస్థాగత బలంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో ప్రభావం ఉన్న నాయకులు పార్టీని వీడటం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్పై ప్రభావం పడొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ వలసలను ఎదుర్కొనేందుకు అన్నాడీఎంకే నాయకత్వం సంస్థాగత పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టే అవకాశముందని కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలుఒకప్పుడు డీఎంకే–అన్నాడీఎంకే మధ్యే పరిమితమైన తమిళ రాజకీయాలు ఇప్పుడు టీవీకే ఎదుగుదలతో కొత్త దిశలో ప్రయాణిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ పార్టీ ఇతర పార్టీల నుంచి నాయకులను ఆకర్షించడంలో సఫలమవుతోంది. ఈ పరిణామాలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
కొత్త స్క్రిప్ట్ రాసే పనిలో దళపతి విజయ్!
సినిమా తెరపై దశాబ్దాల పాటు ‘దళపతి’గా అభిమానులను ఊర్రూతలూగించిన సి. జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయనపై అందరికీ సందేహాలే!. ‘‘రాజకీయాలు తెలియదు’’, “ఎలాంటి అనుభవం లేదు”, “పాలన అంటే సినిమా చేయడం కాదు” ఇలా.. ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ తమిళనాడు ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్న కొద్ది నెలల్లోనే.. విజయ్ తనపై ఉన్న ఆ అనుమానాలనే లక్ష్యంగా చేసుకుని ఒక్కో అడుగుతో సమాధానం చెబుతున్నట్టు కనిపిస్తోంది.మొదట్లోనే ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాజకీయాల కంటే పాలనపైనే ఫోకస్ పెట్టినట్టు సంకేతాలు ఇచ్చాయి. బాధ్యతలు చేపట్టిన వెంటనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రకటనతో కోట్లాది కుటుంబాలకు నేరుగా ఊరట కలిగించారు. అదే సమయంలో ప్రతి జిల్లాలో యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, మాదకద్రవ్యాలపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. మహిళలు, పిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా “సింగప్పెన్ టాస్క్ ఫోర్స్” ఏర్పాటు చేయడం మరో కీలక నిర్ణయంగా మారింది.వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ మద్యం దుకాణాల(TASMAC) విషయంలో కూడా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. దేవాలయాలు, పాఠశాలలు, బస్టాండ్ల సమీపంలో ఉన్న దుకాణాలను దశలవారీగా మూసివేయడం ద్వారా “పాలనలో కఠినత” అనే సందేశాన్ని బలంగా పంపింది.అయితే విజయ్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నది కేవలం నిర్ణయాలు కాదు.. ఆ వెనుక ఉన్న “పాలనా శైలి”. ప్రతి రోజు సమయానికి సచివాలయానికి చేరుకోవడం, గంటల తరబడి ఫైళ్లపై దృష్టి పెట్టడం, అధికారులపై క్రమశిక్షణను తప్పనిసరి చేయడం వంటి అంశాలు కొత్త చర్చకు దారితీశాయి. సంప్రదాయ రాజకీయ నేతలలా కాకుండా, ఆయన కార్పొరేట్ సీఈఓ తరహాలో పాలన నడుపుతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది.అంతేకాదు, వ్యక్తిగత అలవాట్లు కూడా ఈ కథనంలో భాగమయ్యాయి. టైం కంటే ముందే ‘ఆఫీస్’కు వెళ్తున్న ఆయన.. సాదాసీదాగా సెక్రటేరియెట్లోని తన ఛాంబర్ భోజనం చేయడం, అనవసర రాజకీయ సమావేశాలను తగ్గించడం వంటి విషయాలు ఆయన “డిసిప్లిన్ ఫస్ట్” పాలనా విధానానికి ఉదాహరణలుగా చెబుతున్నారు. అధికార వర్గాల్లో సమయపాలనను కఠినంగా అమలు చేయడం కూడా అదే దిశలోని సంకేతం.విజయ్ ప్రభుత్వం కేవలం సంక్షేమంపై మాత్రమే కాదు, వ్యవస్థ మార్పుపై కూడా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అమ్మా ఉణవగం క్యాంటీన్ల ఆధునీకరణ, నిలిచిపోయిన తాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, రైతులకు ఆర్థిక ప్యాకేజీలు వంటి నిర్ణయాలు ప్రజల రోజువారీ జీవితంపై ప్రభావం చూపేలా ఉన్నాయి. అదే సమయంలో ఆర్థిక పారదర్శకత కోసం ఫైనాన్స్ వైట్పేపర్ విడుదల చేయడం కూడా చర్చనీయాంశమైంది.రాజకీయంగా చూస్తే కేంద్రంతో ఆయన వైఖరి కూడా సమతుల్యంగానే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ, నీతి ఆయోగ్ సమావేశాల్లో పాల్గొనడం ద్వారా.. తమిళనాడు ప్రయోజనాలను బలంగా వినిపిస్తూనే, కేంద్రంతో విభేదాలను పెద్దగా పెంచకుండా ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.మరో కీలక అంశం.. అవినీతి వ్యతిరేక చర్యలు. హెచ్ఆర్&సీఈ శాఖకు చెందిన పలు ప్రాజెక్టులను రద్దు చేయడం, పర్యవేక్షణ వ్యవస్థను కఠినతరం చేయడం, కాంట్రాక్ట్ వ్యవస్థపై నియంత్రణ పెంచడం వంటి చర్యలు ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయి.అయితే ఈ కథ ఇంకా పూర్తికాలేదు. కొన్ని ఎన్నికల హామీలు అమలు దశలోనే ఉన్నాయి. ప్రతిపక్షాలు మాత్రం ఇంకా అనుభవం లోపం, పాలనా స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. విమర్శలు తగ్గకపోయినా, వాటికి సమాధానం ఇప్పుడు మాటలతో కాదు, నిర్ణయాలతో వస్తోంది. సినిమాల్లో ఎలా అయితే ప్రతి సన్నివేశానికి ఒక క్లైమాక్స్ ఉంటుందో, రాజకీయాల్లో విజయ్ కూడా తన పాలనను అదే తరహాలో “పర్ఫార్మెన్స్ మోడ్”లో నడుపుతున్నాడన్న భావన బలపడుతోంది. ఇది తాత్కాలిక ఉత్సాహమా? లేక స్థిరమైన రాజకీయ మార్పుకు ఆరంభమా అన్నది రాబోయే కాలమే నిర్ణయించాలి. -
సీఎం విజయ్కు వైకో మద్దతు.. నిలదీసిన రిపోర్టర్పై తీవ్ర ఆగ్రహం!
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన రెండు రోజులకే, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో విలేకరుల సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చెంగల్పట్టులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన వైకో, ఆ సమయంలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సహనం కోల్పోయారు. సదర జర్నలిస్టుపై నోరు పారేసుకున్నారు. గత ఐదేళ్ల డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలిందని, భూ రిజిస్ట్రేషన్ల నుండి ప్రతిదానిలోనూ ‘కటింగ్, కమిషన్’ వసూలు చేశారని వైకో ఆరోపించారు. ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్ జోక్యం చేసుకుంటూ..గత ఐదేళ్లుగా అదే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఈ అవినీతిపై ఎందుకు నోరు మెదపలేదు?అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. కూటమి రాజకీయాల్లో కొన్ని పరిమితులు ఉంటాయని, కూటమి ధర్మాన్ని పాటించడం వల్లే అప్పుడు మాట్లాడలేకపోయానని వైకో వివరణ ఇచ్చారు.అయితే సదరు జర్నలిస్ట్ అదే ప్రశ్నపై పట్టుబట్టడంతో వైకో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. నువ్వు ఒక దురుద్దేశంతోనే ఇక్కడికి వచ్చావు. నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు? మీ యజమాని పత్రికను అమ్ముకున్నాడు. నువ్వు కూడా ఒక అమ్ముడుపోయిన వ్యక్తివి’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతటితో ఆగకుండా సదరు విలేకరిని ప్రెస్ మీట్ వదిలి వెళ్ళిపోవాలని ఆదేశించారు. వైకో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడున్న ఎండీఎంకే కార్యకర్తలు, మద్దతుదారులు సదరు జర్నలిస్ట్పైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు, డీఎంకే కూటమి నుండి బయటకు వస్తున్నట్లు జూన్ 27న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో వైకో అధికారికంగా ప్రకటించారు. గత తొమ్మిదేళ్లుగా కూటమిలో తమకు సరైన గౌరవం దక్కలేదని, డీఎంకే గుర్తుపై పోటీ చేయాల్సి రావడం తమ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందని ఎండీఎంకే నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే కూటమి వీడిన వైకో, ఇప్పుడు డీఎంకే ప్రభుత్వ అవినీతిని టార్గెట్ చేస్తుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
స్టాలిన్ అలా అనకపోయి ఉంటే... ఇదంతా జరిగేదా?
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరగబోతోందా? అధికారంలోకి వచ్చిన రెండు నెలలు కూడా పూర్తికాకముందే సీఎం జోసెఫ్ విజయ్ కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీశారు. డీఎంకేను పూర్తిగా ఒంటరి చేయడమే లక్ష్యంగా దాని మాజీ మిత్రపక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బుధవారం జరగనున్న కీలక సమావేశం తమిళ రాజకీయాల దిశనే మార్చే అవకాశముందనే చర్చ సాగుతోంది.సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా తన మిత్రపక్షాలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్, విడుతలై చిరుతైగళ్ కట్చి (VCK), సీపీఐ, సీపీఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం (MDMK) వంటి పార్టీలను ఆహ్వానించారు. వీటిలో చాలా పార్టీలు గతంలో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో భాగస్వాములే కావడం గమనార్హం.అధికారికంగా డీఎంకేకు గుడ్బై?ఈ సమావేశానికి ముందే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న విడుతలై చిరుతైగళ్ కట్చి (VCK) అధినేత తిరుమావళవన్ పార్టీ అధికారికంగా డీఎంకే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకే ప్రభుత్వానికి VCK మద్దతు ప్రకటించినప్పటికీ, ఇప్పుడు అధికారికంగా డీఎంకేతో బంధం తెంచుకోవడం పెద్ద రాజకీయ పరిణామంగా భావిస్తున్నారు.డీఎంకే మాజీ మిత్రులంతా విజయ్ వైపు?ఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వంలో భాగమయ్యారు. ఇటీవల వైకో నేతృత్వంలోని ఎండీఎంకే కూడా డీఎంకేతో దశాబ్దాల అనుబంధానికి ముగింపు పలికింది. అయితే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం డీఎంకేతోనే కొనసాగుతున్నారు. ఇక సీపీఐ, సీపీఎం వైఖరి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.సెక్యులర్ ఫ్రంట్కు శ్రీకారంవిజయ్ నేతృత్వంలో కొత్త "సెక్యులర్ కూటమి" ఏర్పాటు దిశగా ఈ సమావేశం తొలి అడుగుగా భావిస్తున్నారు. ఎన్నికలు ఇప్పట్లో లేకపోయినా.. ప్రభుత్వాన్ని మరింత స్థిరంగా ఉంచడం, మిత్రపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావడం, భవిష్యత్ స్థానిక సంస్థలు, ఉపఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే వ్యూహంపై చర్చించే అవకాశముంది.స్టాలిన్ వ్యాఖ్యలే కారణమా?ఇటీవల డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ "తమిళనాడులో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు" అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యల తర్వాతే విజయ్ మిత్రపక్షాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రక్రియ వేగం పుంజుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ స్థిరత్వంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టడంతో పాటు, డీఎంకే మాజీ మిత్రులంతా తమవైపే ఉన్నారనే సంకేతాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని అత్యంత ప్రాధాన్యంగా నిర్వహిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో "స్టాలిన్ ఆ వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే... విజయ్ ఇంత వేగంగా కొత్త ఫ్రంట్ ఏర్పాటుకు పావులు కదిపేవారా?" అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్న విజయ్ టీమ్..ఈ కీలక సమావేశానికి హాజరుకావాలని టీవీకే సీనియర్ నేతలు, మంత్రులు ఎన్. ఆనంద్, ఆదవ్ అర్జున్ స్వయంగా వివిధ పార్టీల అగ్రనేతలను కలిసి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా వీసీకే అధినేత తిరుమావళవన్తో ప్రత్యేకంగా సమావేశమై ఆహ్వాన పత్రం అందించడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.డీఎంకేకు ఇది పెద్ద రాజకీయ సవాలేనా?2019 నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమే తమిళ రాజకీయాలను శాసించింది. కానీ ఇప్పుడు అదే కూటమిలోని భాగస్వాములు ఒక్కొక్కరుగా విజయ్ వైపు చేరడం సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీగానే మిగులుతుందా? లేక కొత్త రాజకీయ ఫ్రంట్కు అధికారిక శ్రీకారం చుడుతుందా? అన్నది ఒక ప్రశ్న అయితే... స్టాలిన్ చేసిన ఒక్క వ్యాఖ్యే ఈ మొత్తం రాజకీయ వేగానికి కారణమైందా? అన్న ప్రశ్న కూడా ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అంతే ఆసక్తిగా చర్చనీయాంశమవుతోంది. -
విజయ్ పార్టీ మంత్రులకు స్టాలిన్ అల్లుడి అల్టిమేటం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అల్లుడు శబరీశన్ తాజాగా తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి చెందిన మంత్రులు ఆధవ్ అర్జున, సీటీఆర్ నిర్మల్ కుమార్లకు పరువునష్టం నోటీసులు పంపారు. తమపై చేసిన అవినీతి ఆరోపణలను వెనక్కి తీసుకుని, 15 రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని శబరీశన్ ఆ నోటీసులో పేర్కొన్నారు.36 శాఖల అవినీతి ఆరోపణలపై ధ్వజంఆధవ్ అర్జునకు పంపిన నోటీసు ప్రకారం.. ఆయన మీడియా సమావేశంలో శబరీశన్పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వంలోని 36 శాఖల్లో భారీగా సొమ్ములు వసూలు చేశారని, అందులో తలా 16 శాఖల నిధులను ఉదయనిధి స్టాలిన్, శబరీశన్లకు పంచిపెట్టారని ఆధవ్ అర్జున ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలు, ప్రాంతీయ టీవీ ఛానళ్లలో విపరీతంగా ప్రచారం కావడమే కాకుండా, దాదాపు నాలుగు లక్షల కంటే ఎక్కువ వీక్షణలు సాధించాయని, దీనివల్ల తన ప్రతిష్టకు తీవ్ర భంగం వాటిల్లిందని శబరీశన్ ఆ నోటీసులో పేర్కొన్నారు.విద్యుత్ ఛార్జీల పెంపుపై నిర్మల్ కుమార్ వ్యాఖ్యలుమరో టీవీకే నేత సీటీఆర్ నిర్మల్ కుమార్కు పంపిన ప్రత్యేక నోటీసులో, విద్యుత్ ఛార్జీల పెంపునకు శబరీశన్కు ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖ ఆదాయ వ్యయాలు, అప్పులు భారీగా పెరిగాయని నిర్మల్ కుమార్ ప్రెస్ మీట్లో విమర్శించారు. అంతేకాకుండా, ఈ విద్యుత్ బిల్లుల పెంపు వల్ల లాభపడింది ఎవరు? ఒక కుటుంబమా, అల్లుడా లేదా కుమారుడా? అని ప్రశ్నిస్తూ శబరీశన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.15 రోజుల డెడ్లైన్.. లీగల్ యాక్షన్ హెచ్చరికఈ నేపథ్యంలోనే శబరీశన్ ఇద్దరు నేతలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. టీవీకే నేతలు చేసిన ఈ నిరాధార ఆరోపణలు, వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, బహిరంగంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసులు అందిన 15 రోజుల్లోగా ఈ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో, వారిపై తదుపరి చట్టపరమైన న్యాయ పోరాటాన్ని ప్రారంభించడం మినహా తనకు మరో మార్గం లేదని శబరీశన్ హెచ్చరించారు. ఈ పరిణామం తమిళనాట రాజకీయ వేడిని మరింత పెంచింది. -
కరూర్ ఘటన.. విజయ్ కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరూర్ తొక్కిసలాట బాధితులను కలిసేందుకు ముఖ్యమంత్రి విజయ్ సిద్దమయ్యారు. ఇందులో భాగంగా విజయ్ ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. జూలై రెండో సీఎం విజయ్.. కరూర్లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బాధితులను కలిసి మాట్లాడనున్నారు. కాగా, ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కూడా విజయ్.. కరూర్ ఘటనను గుర్తు చేసుకున్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ ఇటీవల జరిగిన ప్రసంగంలో కరూర్ తొక్కిసలాట ఘటనను ప్రస్తావించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపారు.Vijay Anna karur visit July second week 🥺🥺pic.twitter.com/rU7w3rxZRv— Parthiban 🦁 (@parthi_off) June 29, 2026ఈ ఘటన 2025 సెప్టెంబర్లో కరూర్లో జరిగిన టీవీకే సభ సందర్భంగా చోటుచేసుకుంది. నాడు సభ కోసం భారీ సంఖ్యలో ప్రజలు ఒక్కసారిగా వేదిక వైపు దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారు. విచారణలో సభా నిర్వహణలో లోపాలు, జనసమూహ నియంత్రణలో వైఫల్యాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్ను కూడా సీబీఐ విచారించింది. ఇటీవల అసెంబ్లీలో ఆయన ఈ విషాదాన్ని ప్రస్తావిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు కొనసాగుతాయని చెప్పారు. -
పళనికి మరో ఎదురుదెబ్బ.. ఆరో ఎమ్మెల్యే రాజీనామా
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుతో అన్నాడీఎంకేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ.. విజయ్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే తన పార్టీకి రాజీనామా చేశారు. అయితే, ఆయన టీవీకే చేరనున్నట్టు సమాచారం.తమిళనాడులో మాజీ మంత్రి, అన్నాడీఎంకే ఎమ్మెల్యే విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజీనామా చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. విజయభాస్కర్ తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్కు సమర్పించగా, అది ఆమోదించబడినట్లు నివేదికలు తెలిపాయి.అయితే, ఇప్పటికే పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరడంతో, పార్టీ శాసనసభ బలం తగ్గుతూ వస్తోంది. ఈ పరిణామం పార్టీలో అంతర్గత విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయనే సంకేతంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, పార్టీని వీడుతున్న వారంతా టీవీకే తరఫున పోటీ చేసేందుకే ఇలా రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది. -
త్రిషకు డిప్యూటీ సీఎం ఇచ్చినా ఆశ్చర్యం లేదు!
సాక్షి, చెన్నై: సొంత స్నేహాలు, సినిమా సంబంధాల కోసమే ప్రభుత్వ పదవులను పంచుతున్న సీఎం జోసఫ్ విజయ్, రానున్న రోజుల్లో నటి త్రిషకు డిప్యూటీ సీఎం పదవిని ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన అవశ్యం లేదని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఓ వీడియో రికార్డింగ్ సందేశం విడుదల చేస్తూ, సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.సినిమా వాళ్లకే అధికార కేంద్రాలా? ప్రభుత్వ పదవుల నియామకాలపై ఉదయకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమిళనాడులోని 8 కోట్ల మంది ప్రజల హక్కులను ఢిల్లీలో పరిరక్షించేందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అనే ప్రతిష్టాత్మక పదవి ఉందన్నారు. తమిళనాడులో అర్హులైన వారెవరూ ఈ పదవికి దొరకలేదా అని ప్రశ్నిస్తూ, తనతో సినిమాలు తీసిన వారికి, తన చిత్రాల్లో నటించిన వారికి, తన పర్సనల్ మేనేజర్లు జగదీష్ పళనిస్వామి, జాన్ ఆరోగ్యస్వామి, విష్ణురెడ్డి, రాధన్ పండిట్, వెంకట్ నారాయణ వంటి వారికే సీఎం విజయ్ ప్రభుత్వ పదవులు ఇచ్చుకుంటూ పోతున్నారని ఆరోపించారు. ఇదే ధోరణి కొనసాగితే త్వరలోనే త్రిషను కూడా ఉప ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన ప్రకటించవచ్చని ఎద్దేవా చేశారు.అన్నాడీఎంకే వర్గాలకు పదవులు మరోవైపు.. ప్రస్తుతం తిరుక్కళుక్కున్రం తూర్పు యూనియన్ కార్యదర్శిగా ఉన్న చెంగల్పట్టు తూర్పు జిల్లా ఎంజీఆర్ జి.కె.బాబు, అసోసియేషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈమేరకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుక్కళుకుండ్రం వెస్ట్ యూనియన్ లీగ్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె.ఆర్.సెల్వంను ఆ పదవి నుంచి తొలగిస్తున్నారు. ప్రస్తుతం యూనియన్ లీగ్ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న పి. ముకుందన్, తిరుక్కలకుండ్రం వెస్ట్ యూనియన్ లీగ్ సెక్రటరీగా, చెంగల్పట్టు తూర్పు జిల్లా మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శిగా మధురాంతకం పంచాయతీ యూనియన్ కమిటీ అధ్యక్షురాలు గీత, అజయ్ మోహన్కుమార్ తిరుపోరూర్ ఉత్తర యూనియన్ కార్యదర్శిగా నియమితులయ్యారని తెలిపారు. -
చిక్కుల్లో విజయ్ మంత్రి.. డీఎంకే ఎంట్రీతో ముదిరిన వివాదం
చేతిలో ఏటీఎం కార్డు.. మొబైల్ స్క్రీన్పై తెల్లటి పొడి.. కరెన్సీ నోటు.. ఆ పక్కనే నవ్వులు చిందిస్తున్న అమ్మాయి.. ఇదంతా చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. టీవీకే ఎమ్మెల్యే, తమిళనాడు మంత్రి డీ శరత్కుమార్కు డ్రగ్స్ అలవాటు ఉందా? అంటూ పలువురు పశ్నిస్తున్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీలో స్వయంగా సీఎం విజయ్ పాల్గొన్న వేళ.. ఈ వీడియో బయటకు రావడం తమిళనాట కలకలం రేపింది.తమిళనాడు మానవ వనరుల నిర్వహణ శాఖ మంత్రి డి. శరత్కుమార్కు సంబంధించిన ఓ వ్యక్తిగత వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీడియోలో మంత్రి ఏటీఎం కార్డుతో మొబైల్ స్క్రీన్పై తెల్లటి పొడి వంటి పదార్థాన్ని నలిపినట్లు కనిపిస్తోంది. పక్కనే రూ.500 నోటు కూడా ఉండటంతో పలువురు సోషల్ మీడియా వినియోగదారులు అది మాదకద్రవ్యమేనని ఆరోపించారు. కొందరు ఆయన రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై శరత్ వివరణ ఇచ్చుకున్నారు. ఆ వీడియో పాతదని.. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తీసిందని.. దానిని తాను ఇన్స్టాగ్రామ్ 'క్లోజ్ ఫ్రెండ్స్' స్టోరీలో షేర్ చేశానని.. అది ఇప్పుడు వైరల్ అవుతోందని అన్నారాయన. Old video of TVK Minister Sarathkumar is viral online where he was caught using drugs during IPL.He gave an explanation that it was some tablet/ milk power for his baby. But where is the baby and wife here?(1/n)pic.twitter.com/T6LXICsYUp— GeoMedicus (@dr_harish_s) June 26, 2026ఇక డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన శరత్కుమార్.. భార్య, చిన్న కుమార్తెతో కలిసి వీడియో విడుదల చేశారు. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగిందని.. అప్పటికి తన కుమార్తెకు ఏడాదిన్నర వయసు మాత్రమేనని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారి మాత్ర మింగకపోవడంతో, వైద్యుడి సూచన మేరకు మాత్రను పొడిచేసి ద్రవంలో కలిపి ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. వీడియోలో కనిపిస్తున్నది అదే మాత్ర అని, దీనిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.Did a #TamilNadu minister really get caught handling drugs during an #IPL match? An old video of Tamil Nadu Minister for Human Resources Management D. Sarathkumar has resurfaced online, triggering drug-related allegations on social media.The clip shows the minister using a bank… pic.twitter.com/gBZ7aKR2lX— The New Indian Express (@NewIndianXpress) June 26, 2026అయితే ఈ వివరణతో వివాదం ఆగలేదు. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై స్పందిస్తూ.. వీడియోలో కనిపించిన తీరు డ్రగ్స్ తీసుకునే విధానాన్ని పోలి ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి విజయ్ ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారని.. అలాంటి సమయంలో మంత్రిపై వచ్చిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.ఈ వివాదంపై బీజేపీ కూడా స్పందించింది. మంత్రి శరత్కుమార్ వివరణ ఇచ్చినప్పటికీ, వైరల్ వీడియోపై పోలీసులు దర్యాప్తు చేసి నిజానిజాలు బయటపెట్టాలని బీజేపీ నేత నారాయణన్ తిరుపతి డిమాండ్ చేశారు.గత నెలలోనే మంత్రి పదవి చేపట్టిన శరత్కుమార్కు ఈ వివాదం రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ వీడియో వైరల్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వీడియోలో కనిపించేది నిజంగా డ్రగ్సా? లేక మంత్రి చెబుతున్నట్లుగా చిన్నారికి ఇచ్చే మందేనా? అనే అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. -
సీఎం విజయ్, త్రిషపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం కొనసాగుతోంది. సీఎం విజయ్,హీరోయిన్ త్రిషను ఉద్దేశిస్తూ డీఎంకే నేత,ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కళగం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అనితా రాధాకృష్ణన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ నెల జూన్ 20న తమిళనాడు తూత్తుకుడి జిల్లా ఆత్తూరులో జరిగిన ఒక సంక్షేమ కార్యక్రమ వేదికగా.. సీఎం విజయ్ సినిమా రంగాన్ని వీడి రాజకీయాల్లోకి రావడం, విజయ్-త్రిషల వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడం, అసెంబ్లీలో విజయ్ వ్యవహరిస్తున్న శైలిని ఎగతాళి చేస్తూ అనితా రాధాకృష్ణన్ మాట్లాడటంతో ఈ వివాదం మొదలైంది.నటి ఇంట్లో సంతోషంగా గడిపే ముఖ్యమంత్రి విజయ్.. ఇప్పుడు అసెంబ్లీ అనే ఊబిలో చిక్కుకుపోయి, నలువైపులా ఇరుక్కుపోయానే అనే మానసిక ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. సినిమా షూటింగ్ల కంటే రాజకీయం, రాష్ట్ర పాలన ఎంతో భిన్నమైనవని సూచించారు. తాను ఒక వ్యాపారవేత్తనని పేర్కొంటూ, తన దుకాణంలోకి ఒక కస్టమర్ అప్పు కోసం వచ్చాడా లేదా నగదుతో వస్తువులు కొనడానికి వచ్చాడా అనేది వారి ముఖం చూసి చెప్పగలనని అనితా రాధాకృష్ణన్ ఈ సందర్భంగా ఉదాహరించారు. అదేవిధంగా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ ముఖంలో కనిపిస్తున్న గందరగోళాన్ని చూస్తే, ‘ఓరి దేవుడా.. నన్ను ఎంతటి పెద్ద ఉచ్చులో బిగించేశారు’ అని ఆయన లోలోపల సహాయం కోసం అర్థించేలా ఉన్నట్లు తనకు అనిపించిందని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి హావభావాలను తప్పుబడుతూ ఎమ్మెల్యే రాధాకృష్ణన్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. టీవీకే నేతల ఫిర్యాదుతో స్పందించిన ఆత్తూరు పోలీసులు అనితా రాధాకృష్ణన్పై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ జూన్ 20న చేసిన రాజకీయ విమర్శలు, నటి త్రిష జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఫోటో వల్ల వైరల్ కావడంతో వివాదానికి దారితీశాయి. జూన్ 24-25 తేదీల్లో టీవీకే శ్రేణులు ఈ పాత వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
విజయ్ Vs స్టాలిన్.. బస్సు ప్రయాణం వీడియోలు వైరల్
చెన్నై: తమిళనాడులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త బస్సులను ప్రారంభించడంతో పాటుగా ఆయన కూడా బస్సులో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో గత ముఖ్యమంత్రి స్టాలిన్ బస్సులో ప్రయాణించిన వీడియోలను విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో, విజయ్, స్టాలిన్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల సౌకర్యార్థం రూ.127 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 300 కొత్త ప్రభుత్వ బస్సులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ స్వయంగా కొత్త బస్సులో ప్రయాణించారు. చెన్నైలో ప్రారంభ కార్యక్రమం అనంతరం మెరీనా బీచ్ వరకు బస్సులో ప్రయాణించిన ఆయన, సాధారణ ప్రయాణికుడిలా కండక్టర్ వద్ద టికెట్ కొనుగోలు చేశారు. టికెట్కు సరిపడా చిల్లర డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాధారణంగా టికెట్ ఇస్తున్న సమయంలో "చిల్లర ఇవ్వండి" అనేది కండక్టర్ల నుంచి తరచూ వినిపించే ఫిర్యాదు. అయితే సీఎం విజయ్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితమైన చిల్లరతో టికెట్ కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.300 new buses inaugurated by CM Vijay today!! pic.twitter.com/X51NeJ2zDE— TVK Mathan (@VMathanRaj29086) June 25, 2026ప్రారంభించిన 300 బస్సుల్లో డీజిల్, సీఎన్జీ వాహనాలు ఉన్నాయి. ఈ బస్సులు చెన్నైతో పాటు రాష్ట్రంలోని ఆరు రవాణా జోన్లలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రజా రవాణా సేవల నాణ్యతను మెరుగుపరచడం, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. తమిళనాడు ప్రజా రవాణా వ్యవస్థ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రవాణా నెట్వర్క్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రవాణా సంస్థలు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. The reason people rejected MK Stalin and accepted Thalaivar Vijay as the CM ❤ pic.twitter.com/gFlNLKQqkz— George 🍿🎥 (@georgeviews) June 25, 2026 -
రీల్స్.. ఐటెం సాంగ్స్.. విజయ్కు ఉదయనిధి స్ట్రాంగ్ కౌంటర్
తమిళనాడు అసెంబ్లీలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా.. ముఖ్యమంత్రి విజయ్ ప్రతిపక్షం పేరు ప్రస్తావించకుండానే తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే దీనికి డీఎంకే తరఫున ఉదయనిధి స్టాలిన్.. విజయ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత డీఎంకే ప్రభుత్వ పథకాలనే కొత్తగా తమవిగా విజయ్ ప్రచారం చేసుకుంటున్నారని ఉదయనిధి ఆరోపించారు. మహిళా హక్కుల భృతి, పాఠశాల అల్పాహార పథకం.. ఈ పథకాలు డీఎంకే హయాంలోనే ప్రారంభమయ్యాయని, ఇప్పుడు వాటిపై కొత్త ప్రభుత్వం స్టిక్కర్ అతికించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రంగా పెరిగాయని, కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చిందని అన్నారు. కావేరీ డెల్టా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మినీ పవర్ కట్ల నుంచి భారీ విద్యుత్ అంతరాయాల వరకు ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. "అన్నా వస్తే పవర్ వస్తుంది అన్నారు.. ఇప్పుడు తమిళనాడుకే పవర్ పోయింది" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.మహిళల భద్రత అంశంపైనా ఉదయనిధి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విజయ్ ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే 200కు పైగా లైంగిక నేరాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. "మహిళలపై జరుగుతున్న నేరాలు చూస్తుంటే మనం తమిళనాడులో ఉన్నామా? లేదంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అయితే సభలో అత్యంత చర్చనీయాంశంగా మారింది మాత్రం.. సీఎం విజయ్పై ఆయన చేసిన వ్యక్తిగత, రాజకీయ విమర్శలే. "అసెంబ్లీని సినిమా హాల్లా మార్చేశారు. సభలో కూడా నటించడం మొదలుపెట్టారు" అంటూ ఉదయనిధి ఎద్దేవా చేశారు. విజయ్ ప్రసంగాన్ని ఉద్దేశించి.. "విజయ్ నటిస్తుంటే స్పీకర్ కట్ చెబుతున్నారు.. మళ్లీ యాక్షన్ చెప్పగానే మొదలుపెడుతున్నారు" అని ఉదయ్నిధి వ్యాఖ్యానించారు.అంతేకాదు, "రేపటి నుంచి విజయ్ అసెంబ్లీకి క్యార్వాన్, మేకప్ మ్యాన్, ఫైట్ మాస్టర్లను కూడా తీసుకొస్తారేమో’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ కావడానికే అసెంబ్లీని వాడుకుంటున్నారు. రీల్స్ చేసుకోవడానికే వస్తున్నారా? పాలనపై బాధ్యత లేదా? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. సభలో విజిల్స్ వేయడం కనిపిస్తోంది. రేపు ఎమ్మెల్యేలతో ఐటెం సాంగ్స్కు డ్యాన్సులు చేయిస్తారేమో అంటూ ఉదయ్నిధి, టీవీకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.ఇదిలా ఉంటే అంతకు ముందు సీఎం విజయ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతిపై విచారణలు కొనసాగుతాయని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. "మాది యాక్టర్ పార్టీ అని ఎగతాళి చేశారు. కానీ ప్రజల మధ్య నుంచే వచ్చి ఈ స్థాయికి చేరుకున్నాం" అంటూ విమర్శలకు సమాధానం ఇచ్చారు.అయితే.. ఉదయ్నిధి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అధవ్ అర్జున్.. పార్టీ పేరు కూడా చెప్పకుండానే కొందరు ఉలిక్కిపడుతున్నారని వ్యాఖ్యానించారు. అవినీతి జరిగి ఉంటే ఆ డబ్బంతా తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుస్తామని చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.మొత్తానికి తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు అధికార టీవీకే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మధ్య రాజకీయ పోరుకు వేదికగా మారాయి. సీఎం విజయ్ విమర్శలు.. ఉదయనిధి చేసిన ప్రతివిమర్శలు.. వాటికి అధికార పక్షం ఇచ్చిన కౌంటర్లు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. -
నా కొడుకు రాజకీయాల్లోకి రాడు.. పళని సంచలన ప్రకటన
సాక్షి, చైన్నె: తన కుమారుడు మిథున్ రాజకీయాల్లోకి ప్రవేశించబోవడం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి కె. పళనిస్వామి స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఖండిస్తూనే, కొత్తగా ఏర్పాటైన టీవీకే కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.వారసత్వ రాజకీయాలపై క్లారిటీతన కుమారుడు మిథున్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొన్ని టీవీ ఛానళ్లలో జరుగుతున్న చర్చలు ముమ్మాటికీ అవాస్తవమని ఖండించారు. ఆయన కేవలం అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యుడిగా మాత్రమే ఉన్నారన్నారు. పార్టీలో ఎలాంటి పదవిలోనూ లేరని, తన కుమారుడు మిథున్ భవిష్యత్తులోనూ రాజకీయాల్లోకి రాబోరని నేను కచ్చితంగా, స్పష్టంగా తెలియజేస్తున్నానని అన్నారు. మీడియా సంస్థలు ఇలాంటి అవాస్తవ ప్రచారాలను నిలిపివేయాలని కోరారు. అలాగే అన్నాడీఎంకేను ఎవరూ కదిలించలేరని, గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం కేవలం కలలో వేసిన నీటి మూట లాంటిదని ఎద్దేవా చేశారు.మళ్లీ రాజుకున్న అసంతృప్తి మరోవైపు.. అన్నాడీఎంకేలో అసమ్మతి జ్వాలలు చల్లారడం లేదు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే, అసంతృప్త ఎమ్మెల్యేలంతా సీనియర్ నేత సి.వి. షణ్ముగం నివాసంలో ఆకస్మికంగా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలుతలెత్తిన విషయం తెలిసిందే. పార్టీ సీనియర్లు వేలుమణి, సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 25 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతోపార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి షాక్ తప్పలేదు. ఆ తదుపరి పరిణామాలతో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి నలుగురు రాజీనామా చేశారు. చివరకు రాజీ చర్చలతో వేలుమణితోపాటుగా ఇతర ఎమ్మెల్యేలు పళణి పక్షాన చేరారు. అయితే, సీవీ షణ్ముగం, సీ విజయ భాస్కర్ మాత్రం దూరంగా ఉంటూ వచ్చారు. వీరిలో సీ విజయ భాస్కర్ తన ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేశారు. సీవీ షణ్ముగం మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ సర్వ సభ్య సమావేశం నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం చెన్నైలోని సీవీ షణ్ముగం నివాసంలో జరిగినæ ఆకస్మిక సమావేశంలో వేలుమణి, నత్తం విశ్వనాథన్, కె.పి. అన్బళగన్ హాజరు కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. -
ముఖ్యమంత్రి విజయ్కి విశాల్ ఇచ్చిన బహుమతి ఏమిటి?
టీవీకే పార్టీ అధ్యక్షుడు జోసఫ్ విజయ్ను ముఖ్యమంత్రి అయిన తరువాత చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయన్ని కలవడానికి వరుస కడుతున్నారనే చెప్పాలి. అలా తాజాగా నటుడు విశాల్ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్కు మర్చిపోలేని బహుమతిని ఇచ్చారు. అందుకు ముఖ్యమంత్రి విశాల్కు ధన్యవాదాలు తెలిపారు.ఇంతకీ నటుడు విశాల్ ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్కి అందించిన ఆ బహుమతి ఏమిటి? దీని గురించి మీడియా విడుదల చేసిన ప్రకటనలో విశాల్ తెలుపుతూ నేను నెలకొల్పిన దేవి ట్రస్ట్ ద్వారా పలువురు విద్యార్థుల ఉన్నత విద్య సాయం చేస్తున్నాను. అదే విధంగా నేను నిర్వహించే కార్యక్రమాలకు అభినందించడానికి వచ్చే ప్రముఖులకు బొకేలు, పూల మాలలు వంటివి కాకుండా ఆ డబ్బును పేద విద్యార్థులకు సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా సోమవారం ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ని కలినప్పుడు ఆయనకు బహుమతిగా ఆయన పేరుతో ముగ్గురు పేద విద్యార్థులకు ఉన్నత విద్య చదివిస్తానని చప్పాను. ఆ ముగ్గురు విద్యార్థుల పేరు వివ రాలను కూడా తెలియజేశాను. ఈ బహుమతికి ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ ధన్యవాదాలు తెలిపా రు" అని నటుడు విశాల్ పేర్కొన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను నటుడు శింబు, నటి సిమ్రాన్ కుటుంబం, నటుడు శ్యామ్ తదితర సినీ ప్రముఖులు కలిశారు. ఇటీవల నటి స్నేహ, ప్రసన్న దంపతులు కూడా తమ పిల్లలతో సహా కలిశారన్నది గమనార్హం. -
విజయ్, ఉదయనిధికి బిగ్ రిలీఫ్..
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్కు ఊరట లభించింది. వీరు ముగ్గురు ఎన్నికల అఫిడవిట్లలో తమ ఆస్తి వివరాలను దాచారని, దీనిపై ఆదాయపన్ను శాఖ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.వివరాల మేరకు.. పెరంబూర్ నియోజకవర్గ ఓటరు విఘ్నేష్ దాఖలు దాఖలు చేసిన పిటిషన్లో సీఎం విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల్లో వేర్వేరు ఆస్తి వివరాలను చూపించారని ఆరోపించారు. పెరంబూర్లో రూ. 115 కోట్లుగా చూపిన ఆస్తులను, తిరుచ్చి ఈస్ట్లో రూ. 220 కోట్లుగా పేర్కొన్నారు. ఈ తప్పుడు సమాచారాలపై ఐటీ శాఖ, ఎన్నికల సంఘం విచారణ జరపాలని కోరారు. అలాగే, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ 2021 ఎన్నికలతో పోలిస్తే ఈసారి చేపాక్కం –ట్రిప్లికేన్ నియోజకవర్గ అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇచ్చారని పేర్కొంటూ ఓటరు కుమారవేల్ పిటిషన్ వేశారు. మైలాపూర్ బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ గత లోక్సభ ఎన్నికల కంటే ఇప్పుడు భిన్నమైన వివరాలు సమర్పించారని గౌతమ్ శివ అనే ఓటరు పిటిషన్ వేశారు. ఎన్నికల సంఘం వివరణ..ఈ మూడు వేర్వేరు పిటిషన్లు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, న్యాయమూర్తి జి. అరుళ్మురుగన్ ధర్మాసనం ఎదుట బుధవారం విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది నిరంజన్ రాజగోపాల్ వాదనలు వినిపించారు. సీఎం విజయ్ రెండు నియోజకవర్గాల్లోనూ పేర్కొన్న ఆస్తి విలువలు సరిగ్గానే ఉన్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి విషయాల్లో కేవలం ఎన్నికల పిటిషన్ మాత్రమే వేయడానికి చట్టంలో వీలుంటుందన్నారు. ఇప్పటికే ఇలాంటి పలు పిటిషన్లను కోర్టులు కొట్టివేసాయని వివరించారు. ఎన్నికల సంఘం వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు.. సీఎం విజయ్, ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయనిధి స్టాలిన్, బీజేపీ అభ్యర్థి, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై దాఖలైన పిటిషన్లను పూర్తిగా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
తమిళ పాలిటిక్స్.. స్టాలిన్కు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, చైన్నె: తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజల తీర్పును గౌరవించి డీఎంకే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలే గానీ, కూటమి పార్టీలపై నిందలు వేస్తూ విమర్శలు కొనసాగిస్తే ఆ పార్టీ ఇక ఎన్నటికీ తమిళానాడులో అధికారంలోకి రాలేదని కాంగ్రెస్ మంత్రులు రాజేష్ కుమార్, విశ్వనాథన్లు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సంయుక్తంగా డీఎంకేకు హెచ్చరికలు చేస్తూ వ్యాఖ్యల తూటాలను పేల్చారు. దీంతో తమిళనాట కాంగ్రెస్ వర్సెస్ డీఎంకే అనే విధంగా పొలిటికల్ హీట్ పెరిగింది. విజయ్ నాయకత్వానికే ప్రజల మొగ్గుఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పెట్టిన 27 నెలల్లోనే 108 స్థానాలు గెలుచుకుని తమిళగ వెట్రి కళగం(టీవీకే) చరిత్ర సృష్టించిందని మంత్రులు పేర్కొన్నారు. జోసెఫ్ విజయ్ సీఎం కావాలన్నదే తమిళనాడు ప్రజల తీర్పు అని వారు స్పష్టం చేశారు. టీవీకేకు మెజారిటీకి 10 సీట్లు తక్కువైనప్పటికీ, అన్నాడీఎంకే మద్దతుతో సులభంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా, లౌకిక విలువల కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే వంటి పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారని కొనియాడారు. అధికారంలో వాటా.. ఇదే నిజమైన కూటమి ధర్మం అని వ్యాఖ్యలు చేశారు. కేవలం 5 సీట్లున్న కాంగ్రెస్కు రెండు మంత్రి పదవులు విజయ్ ఇచ్చారని, అలాగే వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ మద్దతుతో గతంలో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి గొప్ప మనసు చాటుకోలేదని విమర్శించారు.బీజేపీ కుట్రను అడ్డుకున్నాం..ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా బీజేపీ పన్నిన కుట్రకు డీఎంకే కూడా సహకరించిందని, అయితే లౌకిక శక్తులు బలంగా నిలబడటం వల్ల ఆ ప్రయత్నం విఫలమైందన్నారు. అయితే, డీఎంకే అధికారిక పత్రిక ’మురసోలి’లో కాంగ్రెస్ను, రాహుల్ గాంధీని కించపరుస్తూ రాస్తున్న వ్యాసాలపై మండిపడ్డారు. తమకు కూడా తిట్టడం తెలుసనని, అయితే, తమ నాయకులు తమకు రాజకీయం నేర్పారన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, ఒకవేళ తాము హద్దులు దాటితే డీఎంకే తట్టుకోలేదని హెచ్చరించారు. మైనారిటీలు, దళితులు డీఎంకేకు ఎందుకు ఓటు వేయలేదో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. అది వదిలేసి మిత్రపక్షాలపై పడి ఏడిస్తే, వచ్చే ఎన్నికల్లో తమరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, ప్రజలు ఇచ్చే శిక్ష నుండి తప్పించుకోలేరని పేర్కొన్నారు.పుదుచ్చేరిలోనూ పొత్తే.. ఇదిలా ఉండగా.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తమిళగ వెట్రి కళగంతోనే కాంగ్రెస్ పొత్తు అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ వైద్యలింగం స్పష్టం చేశారు. తట్టాంచావడి ఉప ఎన్నికల్లో టీవీకే పోటీ చేస్తే, కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం వైద్యలింగం విలేకరులతో మాట్లాడుతూ.. పుదుచ్చేరి సీఎం రంగస్వామి నియంతృత్వ పోకడలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రివర్గం, శాసనసభ అవసరం లేదంటూ ఆయన ఒక్కరే పరిపాలనను నడుపుకుంటారా..? అని ప్రశ్నించారు. పుదుచ్చేరిలో టీవీకేతో కాంగ్రెస్ పొత్తు అని ప్రకటించిన ఆయన తట్టాంచావడి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఉప ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీకి అవకాశం లేదున్నారు. విజయ్ పార్టీ అయిన టీవీకేను డీఎంకే తక్కువ అంచనా వేయడమే ఓటమికి కారణంగా పేర్కొన్నారు. తాము స్నేహపూర్వకంగా పోటీ చేసిన స్థానాల్లో డీఎంకే విజయం సాధించిందని పేర్కొంటూ, తట్టాంచావడి ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో కూటమికి డీఎంకే నాయకత్వం వహించింది, ఈ దృష్ట్యా, ఓటమికి కూడా డీఎంకేనే బాధ్యత వహించాలని హితవు పలికారు. కూటమిలోని పార్టీలతో డీఎంకే ఏకపక్షంగా చర్చలు జరిపిందని మండి పడ్డారు. తట్టాంచావడిలో టీవీకే పోటీ చేస్తే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, ఇది సీఎం నియోజకవర్గం అని ఎన్నికలలో ప్రజలు ఓట్లు వేశారని, అయితే, ఉప ఎన్నికలలొఓ ఆ పరిస్థితి ఉండదన్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని , ఉప ఎన్నికలలో కాంగ్రెస్మద్దతు కీలకంగా మారిందన్నారు. -
తమిళనాడు సీఎం సంచలన నిర్ణయం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ సహకార సంస్థల ద్వారా పంట రుణాలు పొందిన అన్నదాతల కోసం అత్యంత ప్రాధాన్యత కలిగిన రుణమాఫీ నిర్ణయాన్నివెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సహకార రంగంలో రూ.75 వేలకు పైగా రుణం తీసుకున్న సుమారు 14 లక్షలకు పైగా రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగనుంది. ఈ పథకంతో రూ. 5.932 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడనుంది. ప్రతీ రైతుకు ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు టీవీకే ప్రకటించిేంది. ఈ మేరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.కాగా ఈ పథకం నిబంధనల ప్రకారం సహాకార సంస్థల్లో లోన్ తీసుకున్న చిన్న, సన్నకారు రైతులకు రూ.75,000ల పరిమితి వరకు 100 శాతం రుణమాఫీ లభిస్తుంది. ఒకవేళ తీసుకున్న రుణం మొత్తం రూ.75,000 కంటే ఎక్కువగా ఉంటే, వారికి గరిష్టంగా రూ.35,000ల వరకు రుణమాఫీ వర్తింపజేస్తారు. దీని ద్వారా గత ఏడాది కాలంలో పంట రుణాలు తీసుకున్న వారందరికీ కనీసం రూ.35,000 నుండి గరిష్టంగా రూ.75,000ల వరకు పరోక్ష సహాయం చేకూరనుంది. -
సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు నిషేధం విధించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రోడ్లపై, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు అంటించడం నిషేధమని స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్రంలో భారీ కటౌట్లు, పోస్టర్లు పాదచారుల రాకపోకలకు అడ్డంకిగా మారాయి. పాదచారులు రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు పెరిగాయి.వర్షాకాలం ప్రారంభం కావడంతో బ్యానర్లు, కటౌట్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.అదే సమయంలో టీవీకే తన పార్టీ కార్యకర్తలకు సైతం విజ్ఞప్తి చేసింది. పార్టీ కార్యకర్తలు పోస్టర్లు, బ్యానర్లు, ప్లకార్డులు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించొద్దని కోరింది. జన్మదిన వేడుకలు, కుటుంబ వేడుకలు, రాజకీయ సమావేశాలు వంటి సందర్భాల్లో బహిరంగ ప్రదేశాల్లో డెకరేషన్లు చేయద్దని సూచించింది. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా ఏ వేడుకలు జరపరాదని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత నెలలో పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను విజయ్ మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే రోజు మధ్యాహ్నం, ఆయన తన తమిళగ వెట్రి కజగం కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. పుట్టినరోజులు, కుటుంబ కార్యక్రమాల వంటి సందర్భాలలో ప్రజలకు లేదా ట్రాఫిక్కు ఆటంకం కలిగించే విధంగా... బహిరంగ ప్రదేశాలలో బ్యానర్లు, పోస్టర్లు అంటించొద్దని కోరారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు,కటౌట్లు,పోస్టర్లు అంటించడంపై ఆంక్షలు విధించడంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
విజయ్.. అధికార మత్తులో మర్చిపోయారా?: స్టాలిన్
తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కళగం, ప్రతిపక్షం డీఎంకే మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. చెన్నైలోని అన్నా అరివాలయంలో శనివారం జరిగిన డీఎంకే మహిళా విభాగం లోక్సభ కార్యకర్తల సన్నాహక సమావేశంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సీఎం విజయ్ను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడానికే తమరు ఢిల్లీ వెళ్లారా?, బీజేపీని గట్టిగా విమర్శిస్తే తమరి కుర్చీకి ముప్పు వస్తుందని భయపడుతున్నారా? అంటూ స్టాలిన్ ప్రశ్నలు సంధించారు.డీఎంకే మహిళా విభాగం సమావేశంలో స్టాలిన్ టీవీకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల డీఎంకే ద్రావిడ మోడల్ పాలన మహిళల సంక్షేమమే ధ్యేయంగా సాగిందన్నారు. అయితే, ప్రస్తుత టీవీకే ప్రభుత్వంలో రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు, విద్యుత్ కోతలు, రైతుల రుణాల మాఫీ నాటకాలతో.. ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామా.? అని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు మహిళల భద్రత గురించి మాట్లాడిన సీఎం విజయ్.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై దాడుల్లో మెజారిటీ కేసుల్లో టీవీకే నిర్వాహకులే నిందితులుగా ఉన్నారని వార్తలు వస్తున్నాయని వివరించారు. ఇప్పుడు టీవీకే నుంచి మహిళలకు రక్షణ కావాలని ప్రజలు కోరే పరిస్థితి వచ్చిందన్నారు.డీఎంకే బ్లూప్రింట్ కాపీ కొట్టారు ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం విజయ్ హాజరు కావడంపై స్టాలిన్ స్పందించారు. ఇందులో సీఎం ప్రసంగం అంతా గతంలో డీఎంకే ప్రభుత్వం సాధించిన విజయాలు, రాష్ట్ర హక్కుల కోసం తాము రూపొందించిన పాలసీ నోట్ లాగే ఉందని ఎద్దేవా చేశారు. ఇది సినిమా కాదు.. రాష్ట్ర పరిపాలన, రాష్ట్ర హక్కుల విషయంలో ద్రావిడ మోడల్ ప్రభుత్వం వేసిన బ్లూప్రింట్ ప్రకారమే ఎవరైనా నడవాల్సిందేనని స్పష్టం చేశారు. తాను గతంలో 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అని చెప్తే.. విజయ్ మాత్రం కాస్తమెరుగు దిద్ది మార్చి 2036 నాటికి ఒకటిన్నర ట్రిలియన్ డాలర్ ఎకానమీ అని మాట్లాడారని గుర్తు చేశారు. ఏదేమైనా అందుకు నా అభినందనలు అని వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు పిలుపు గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్తే.. ఇరుపక్షాలు ఎల్కేజీ, యూకేజీ పిల్లల్లా కొట్టుకుంటున్నాయని ఎగతాళి చేసిన విజయ్, ఇప్పుడు నిబంధనలు లేకుండా నిధులు ఇవ్వాలని అదే ఢిల్లీ పెద్దలను కోరి వచ్చారని ఎద్దేవా చేశారు. ఈ విషయాలన్నింటినీ డీఎంకే మహిళా విభాగం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. పార్టీ స్థాపకుడు కరుణానిధి చెప్పినట్లుగా పార్టీ అనేది తల, అధికారం అనేది కిరీటం అని , అయితే, తల ఉంటే కిరీటాన్ని ఎప్పుడైనా ధరించవచ్చు అని గుర్తు చేస్తూ, డీఎంకే పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బీజేపీకి జిరాక్స్ కాపీలా విజయ్ పాలన.. సీఎం విజయ్ ప్రస్తుతం బట్టల షాపింగ్ తరహాలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కొనేస్తున్నారని ఆరోపించారు. తన ప్రభుత్వంపై తనకే నమ్మకం లేక, మొదట అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో తనకు అనుకూలంగా ఓటు వేయించుకున్నారన్నారు. ఇప్పుడు వారితో రాజీనామాలు చేయించి వెంటనే తన పార్టీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేస్తున్న దాన్నే ఇక్కడ విజయ్ చేస్తున్నారని, విజయ్ పూర్తిగా బీజేపీకి జెరాక్స్ కాపీలా వ్యవహరిస్తున్నారన్నారని అన్నారు. -
విజయ్ ఎఫెక్ట్.. స్టాలిన్ కళ్లు తెరిపించిన నివేదిక
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కోల్పోవడంపై నియోజకవర్గాల వారీగా తెప్పించుకున్న క్షేత్రస్థాయి విచారణ నివేదికలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్కు షాక్ తగిలే విధంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల్లో ఘోర పరాజయానికి గల కారణాలను విశ్లేషిస్తూ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు రెండు రోజుల క్రితమే ఒక సమగ్ర నివేదికను స్టాలిన్కు సమర్పించాయి.తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడం, మహిళల్లో వ్యక్తమైన తీవ్ర అసంతృప్తి పార్టీని పూర్తిగా ముంచేసిందని ఈ నివేదిక తేల్చిచెప్పింది. శుక్రవారం డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో ఈ ప్రత్యేక కమిటీతో స్టాలిన్ సమావేశమయ్యారు. ఇందులోని అంశాలను పరిశీలించి, నియోజకవర్గాల వారీగా చర్చించారు. ఓటమికి ప్రధాన కారణాలు తాజా నివేదిక మేరకు వెలుగులోకి వచ్చాయి.విజయ్ను తక్కువగా అంచనా విజయ్ క్షేత్రస్థాయిలో సాధిస్తున్న ప్రజాదరణను, ఆయనకు లభిస్తున్న నిశ్శబ్ద మద్దతును డీఎంకే జిల్లా అధికారులు, స్థానిక నాయకత్వం గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని తేలింది. గెలుపు గుర్రాలైన స్థానిక పలుకుబడి కలిగిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి, కొత్త ముఖాలను పోటీలో పెట్టడం కూడా ఓటమికి ఓ కారణంగా గుర్తించారు. నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య కనీస సమన్వయం లేదని నివేదిక స్పష్టం చేసింది.ఇక యాక్షన్ ప్లాన్ ఈ పరాజయం నేపథ్యంలో డీఎంకేలో భారీ సంస్థాగత మార్పునకు ఎం.కె. స్టాలిన్ శ్రీకారం చుట్టారు. పార్టీ పరిపాలనా యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పెద్ద జిల్లాల పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల వరకు ఒక జిల్లా కార్యదర్శి ఉండగా, ఆ నియోజకవర్గాల సంఖ్యను తగ్గించి కేవలం రెండు లేదా మూడు నియోజకవర్గాలకు ఒక జిల్లా కార్యదర్శిని నియమించేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం పార్టీ పరంగా ఉన్న 78 మంది జిల్లా కార్యదర్శుల సంఖ్యను 115కు పెంచనున్నారు. ఈ విభజన ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మరో 30 మంది పార్టీ కోసం పనిచేసే కొత్త వారికి జిల్లా కార్యదర్శులుగా అవకాశం దక్కనుంది.దక్షిణ, కొంగు మండలాలపై దృష్టి డీఎంకే తీవ్రంగా దెబ్బతిన్న దక్షిణ జిల్లాలు, పశ్చిమ ప్రాంతమైన కొంగు మండలం పార్టీని పునరుద్ధరించడానికి ప్రత్యేక కమిటీని రంగంలోకి దించారు. అలాగే, పార్టీ అగ్రనాయకత్వంలో కూడా అధికార వికేంద్రీకరణ జరగబోతోందని అరివాలయం వర్గాలు తెలిపాయి. కలైంజ్ఞర్ కాలం నాటి పాత రాజకీయ వ్యూహాలు ఇప్పుడు పని చేయవని, కొత్త తరం ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా సరికొత్త నాయకత్వ ఫార్ములాను స్టాలిన్ సిద్ధం చేసినట్టు తెలిసింది.కనిమొళి, ఉదయనిధి: ఇప్పటికే యువజన విభాగంలో కీలకంగా ఉదయనిధి స్టాలిన్తో పాటు, ఢిల్లీ రాజకీయాల్లో అపార అనుభవం, మహిళల్లో మంచి పట్టు ఉన్న సీనియర్ నేత కనిమొళికి కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. వీరిద్దరిని కలిపి ద్వంద్వ బృందం పద్ధతిలో పార్టీని నడిపించేందుకు అధిష్ఠానం కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే జరగబోయే డీఎంకే జనరల్ సర్వసభ్య సమావేశంలో ఈ సంచలన మార్పులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.మహిళా లబ్దిదారుల ఆగ్రహం.. డీఎంకే హయాంలో ప్రవేశపెట్టిన మహిళా హక్కుల పథకం డీఎంకే ఓటమికి ప్రధాన కారణంగా నిలవడం గమనార్హం. రాష్ట్రంలో 2 కోట్ల 20 లక్షల రేషన్ కార్డులు ఉంటే, కేవలం ఒక వర్గానికి మాత్రమే కోటి 34 లక్షల మందికి ఈ సాయం అందించడం, ఇందులోనూ ఇతర పార్టీల వారు ఉండడంతో, మిగిలిన కోటి మంది మహిళలు డీఎంకేకు వ్యతిరేకంగా ఓటు వేశారన్నది స్పష్టం కావడం ఆలోచించ దగ్గ విషయం. అలాగే, ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ప్రభుత్వం అందించిన రూ.5వేలు వేసవి సాయాన్ని కూడా కేవలం కొద్దిమంది అర్హులకు మాత్రమే పరిమితం చేయడం వలన సాధారణ మహిళా ఓటర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమై ఓట్లను దూరం చేసినట్టు తేటతెల్లమైంది.సోఫా మోడల్ ప్రభుత్వం.. మరోవైపు.. తమిళనాడులో డీఎంకే ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో సాధించిన అద్భుత విజయాలను, అభివృద్ధిని తాజా సీఎం విజయ్ ఆయన ఖాతాలో వేసుకుంటున్నారని డీఎంకే యువజన నేత, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆయన సోఫా మోడల్ ప్రభుత్వంగా అభివర్ణించారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం విజయ్ చేసిన ప్రసంగంపై శుక్రవారం ఉదయనిధి తన ఎక్స్ పేజీలో స్పందించారు.అవన్నీ డీఎంకే సాధించినవే.. ఎన్నికల ప్రచారంలో తమిళనాడు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, పాతాళానికి పడిపోయిందని అబద్దపు కథనాలను ప్రచారం చేసిన విజయ్, ఇప్పుడు అధికారంలోకి రాగానే, ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో, తమిళనాడు సాధించిన ఘనతలను ఒక పెద్ద జాబితా రూపంలో చదివి వినిపించారని గుర్తు చేశారు. తమిళనాడు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, దేశంలో ఉద్యోగాలు చేసే మొత్తం మహిళల్లో 42 శాతం మంది తమిళనాడుకు చెందినవారేనని సీఎం విజయ్ అక్కడ ప్రస్తావించారని గుర్తు చేశారు. అలాగే మహిళా విద్య, రక్షణ, ఆరోగ్యం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధిపై కూడా సీఎం మాట్లాడారన్నారు. ఇవన్నీ ఆయన అధికారంలోకి వచ్చిన ఈ ఒక నెల రోజుల సోఫా మోడల్ పాలనలో జరిగినవా? లేక ఐదేళ్లపాటు తమ డీఎంకే ప్రభుత్వం రాత్రింబవళ్లు కష్టపడి సాధించిన ద్రావిడ మోడల్ విజయాలా అని ప్రశి్నస్తూ, దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మౌనం ఎందుకు? ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత విజయ్ తీసుకున్న యూ–టర్న్లపై ఉదయనిధి మండిపడ్డారు. నీట్ పరీక్షే ప్రపంచమా అని ఎన్నికల సమయంలో వ్యాఖ్యలు చేసిన విజయ్, ఇప్పుడు అదే నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఢిల్లీ వరకు వెళ్లిన సీఎం కర్ణాటకలో అధికారంలో ఉన్న తన కొత్త మిత్రపక్ష పార్టీతో కానీ, నీతి ఆయోగ్ సమావేశంలో కానీ, మేఘధాతు వ్యవహారంపై నోరు విప్పలేదని ఆరోపించారు. మనకెందుకులే వచ్చిన గొడవ అన్నట్లుగా ఆయన మౌనంగా తిరిగి వచ్చేశారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి నీతి ఆయోగ్ సమావేశంలో డీఎంకే ప్రభుత్వ విజయాలపై ఈ సోఫా మోడల్’ ప్రభుత్వం పూర్తిగా వారి స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుందని ధ్వజమెత్తారు. -
ఆ కారణంగానే టీవీకేకు మద్దతు.. చిదంబరం కీలక వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ స్పష్టత నిచ్చింది. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం పూర్తిగా సమర్థించారు. ‘మతసామరస్యం , రాష్ట్ర హక్కుల పరిరక్షణ అనే రెండు ప్రాథమిక సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నంత వరకు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు.గురువారం చైన్నెలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, తమిళనాడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఊహించని మహా విజయంమీడియా, రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందకుండా టీవీకే పార్టీ ఎన్నికల్లో ఏకంగా 35 శాతం ఓట్లను కొల్లగొట్టిందని కొనియాడారు. పార్టీ స్థాపించిన కేవలం రెండేళ్లలోనే ఇంతటి ఘనవిజయం సాధించడం అద్భుతమని విజయ్ను అభినందించారు. తమిళనాడు ప్రజలు ఇప్పుడు మళ్లీ ముందస్తు ఎన్నికలను కోరుకోవడం లేదని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే, రాష్ట్రపతి పాలన నెపంతో బీజేపీ దొడ్ది దారి గుండా అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉందని, అందుకే ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ప్రజాస్వామ్యబద్ధంగా సరైన నిర్ణయమని ఆయన విశ్లేషించారు. ప్రస్తుత టీవీకే ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా 31 మంది మంత్రులకు అసెంబ్లీలో ఎలాంటి ముందస్తు అనుభవం లేదన్నారు. అలాగే 101 మంది ఎమ్మెల్యేలు మొదటిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టారని వివరించారు. వీరందరికీ కొంత సమయం ఇవ్వాలని చిదంబరం కోరారు. బీజేపీ నుండి బయటకు వచ్చి అన్నామలై ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించడం గురించి స్పందిస్తూ, అది రాజకీయ పార్టీగా మారుతుందో లేదో నాకు తెలియదన్నారు. అయితే, బీజేపీలో ఆయనకు సరైన గుర్తింపు, గౌరవం దక్కలేదనే విషయం పలు ఇంటర్వ్యూలు చూస్తే స్పష్టంగా అర్థమవుతోందన్నారు. తాను ఇటీవల మాజీ సీఎం స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలిశానని, ఆయన ఇండియా కూటమి నుండి వైదొలుగుతున్నట్లు తనతో ఏమీ చెప్పలేదని వివరణ ఇచ్చారు. -
Tamil Nadu: కాంగ్రెస్ వర్సెస్ టీవీకే
సాక్షి, చెన్నై : కన్యాకుమారి జిల్లా కిల్లియూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే , మంత్రి రాజేష్ కుమార్ ఎన్నికను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు టీవీకే అభ్యర్థి సబీన్ నిర్ణయించారు. ఆయన గెలుపు చెల్లదని ప్రకటించాలని కోరుతూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికలలో 1,311 ఓట్లతో రాజేష్ కుమార్ సబీన్పై గెలిచారు. సోమవారం సబీన్ స్వయంగా కన్యాకుమారి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించిన ఫిర్యాదు లేఖను కిల్లియూర్ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కౌన్సిల్ కార్యదర్శి , ప్రధాన ఎన్నికల కమిషనర్కు కూడా పంపినట్టు ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోస్టల్ ఓట్ల నిర్లక్ష్యం : ఎన్నికల నిబంధనల ప్రకారం లెక్కింపు జరపాల్సిన అనేక పోస్టల్ ఓట్లను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ నిర్దేశిత సమయం కంటే ముందే, అంటే ఉదయం 6 గంటలకే ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారని వివరించారు. సాంకేతిక లోపం పేరిట ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదని, తాము ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా, కౌంటింగ్ అధికారులు సరైన వివరణ ఇవ్వకుండా రకరకాల కారణాలు చెబుతూ తుది ఫలితాన్ని ఏకపక్షంగా ప్రకటించారని సబీన్ ఆరోపించారు.నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ లెక్కింపు ఆధారంగా ప్రకటించిన రాజేష్ కుమార్ విజయాన్ని తక్షణమే రద్దు చేయాలని సబీన్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోతే, త్వరలోనే ఉన్నత న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయించి ఎన్నికల పిటిషన్ దాఖలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.కాగా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యే గెలుపును వ్యతిరేకిస్తూ అధికార పక్షం అభ్యర్థి న్యాయ పోరాటానికి సిద్ధం కావడం చర్చకు దారి తీసింది. -
సీఎం విజయ్కి ‘ఇండియా’ కూటమి షాక్!
న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోలీవుడ్ స్టార్, సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉమ్మడి వ్యూహాన్ని రచించేందుకు నేడు (జూన్ 8) ఢిల్లీలో జరుగుతున్న కీలక ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశానికి సీఎం విజయ్కు ఆహ్వానం దక్కలేదు. తమిళనాడులో కాంగ్రెస్కు అత్యంత ఆప్తుడిగా మారిన విజయ్ ఈ భేటీకి హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.ఈ సమావేశానికి విజయ్ను పిలవకపోవడానికి గల కారణాలను కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం లోక్సభ లేదా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పార్టీలను మాత్రమే ఈ భేటీకి ఆహ్వానించామని కూటమి నేతలు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుతానికి టీవీకే పార్టీ ఇంకా అధికారికంగా ఇండియా కూటమిలో భాగస్వామి కాలేదనే నెపంతోనే ఆయనకు ఈ మొండిచేయి ఎదురైనట్లు తెలుస్తోంది.అయితే లోపల సఖ్యతగా కనిపిస్తున్న ఈ కూటమిలో విజయ్ అంశం తీవ్ర కలకలానికి దారితీసింది. తమిళనాడు ఎన్నికల అనంతరం దశాబ్దాల మిత్రపక్షమైన డీఎంకేను పక్కనబెట్టి, విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై స్టాలిన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంతర్గత విభేదాల నేపథ్యంలో, అటు డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించడం, ఇటు సీఎం విజయ్కు ఆహ్వానం దక్కకపోవడంతో కూటమిలో సరికొత్త రాజకీయ సమీకరణలు చర్చనీయాంశంగా మారాయి.ఇది కూడా చదవండి: మిడిల్ ఈస్ట్ వీసా షాక్: ఆందోళనలో కేరళ నర్సులు! -
‘తమ్ముడూ విజయ్.. ప్రాణం ఒక్కసారే పోతుంది!’
సాక్షి, చైన్నై: తమిళనాడు సీఎం విజయ్పై అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.బి. ఉదయకుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి రాకముందు కూటమి కోసం ఎంతగానో మొత్తుకున్నారని, అప్పుడు ఒక చిన్న లెటర్ ప్యాడ్ పార్టీ గానీ, తమర్ని నమ్మి రాలేదరన్నారు. అయితే, ఇప్పుడు ఏదో మాయాజాలం జరిగి అధికారం దక్కేసరికి.. ఆ పవర్ను చూసి అందరూ తమరి వెనుక పరిగెత్తుకుంటూ వస్తున్నారని విజయ్ను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. మదురై తెప్పకుళం మరియమ్మన్ ఆలయ కుంభాభిషేకం సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఉదయకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ వీడుతున్న అన్నాడీఎంకే నేతలపై, సీఎం విజయ్ రాజకీయ వ్యూహాలపై ఘాటుగా స్పందించారు. అన్నాడీఎంకే చావలేదు.. మళ్లీ పుంజుకుంటుందిపారీ్టలో కొన్ని విభేదాల వల్ల నేతలు శత్రువుల వైపు వెళ్తున్నారని, గతంలో ఎంజీఆర్, జయలలిత హయాంలోనూ నెడుంచెజియన్, ఎస్టీఎస్ వంటి పెద్ద నేతలు పార్టీని వీడి మళ్లీ తిరిగి వచ్చారని ఉదయకుమార్ గుర్తుచేశారు. సొంత పార్టీ విలువ తెలియక కొందరు ప్రేమ, ఆదరణ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్తుండటం బాధాకరమన్నారు. కొందరు చిల్లర గాళ్లు తమను చూసి నవ్వుతున్నారని, తాము కేవలం ఎన్నికల్లో ఓడిపోయామే కానీ, చచ్చిపోలేదన్నారు. అన్నాడీఎంకే ఎన్నో శోధనలు, వేదనలను తట్టుకుని నిలబడిన పార్టీ అని, కోట్ల మంది కార్యకర్తలే ఈ పార్టీకి బలమైన పునాదిగా పేర్కొన్నారు. విజయ్లు ఎంతమంది వచ్చినా తాము చూస్తాం్ఙ అని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ ఏదేని జరిగిన పక్షంలో అందుకు అన్నాడీఎంకేమాత్రం బాథ్యులు కాదన్నారు. విజయ్ తమ్ముడూ.. నీకు హెచ్చరిక ముఖ్యమంత్రి విజయ్ను ‘తమ్ముడు’ అని సంబోధిస్తూ ఉదయకుమార్ కీలక హెచ్చరికలు చేశారు ‘విజయ్ తమ్ముడూ.. ప్రాణం ఒక్కసారే పోతుంది. నీకు హెచ్చరికగా, ప్రేమతో చెబుతున్నాను. జీవితం అనేది ఒకవృత్తం, పైన ఉన్నది కిందకు రావడం ప్రకృతి నియమం. కష్టపడి నమ్ముకున్న వాళ్లతో పార్టీ నడిపితే ఫలితం ఉంటుంది కానీ, దొరికిన వాళ్లనల్లా చేర్చుకుని పార్టీ నడిపితే లాభం లేదు. భవిష్యత్తులో నీకు ఏమైనా జరిగితే దానికి అన్నాడీఎంకే బాధ్యత వహించదు’ అని స్పష్టంచేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఎందుకు? ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి నిర్మల్ కుమార్ గతంలో ఏఎంఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే.. ఇప్పుడు టీవీకేలో చేరారని గుర్తుచేస్తూ, రేపు అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందని తెలిస్తే మళ్లీ ఆయన జంప్ జిలానీ తథ్యమన్నారు. అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలను విజయ్ కలిసి శాలువాలు కప్పడం.. ఆయన తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలో 65 శాతం మంది ప్రజలు విజయ్ వద్దు అని ఓటేశారని ,ఈ విషయం అర్థమైతే ఆయన ఇలా ఆపరేషన్ ఆకర్ష్ పనులు చేయరని ఎద్దేవా చేశారు. లెక్కలు తెలియక కొందరు చేతికూలీలను పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. ఆ మంత్రికి పిచ్చి పట్టింది తమ పారీ్టలో 50 శాతం మందిని లాగేసుకున్నామని టీవీకే మంత్రి ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలపై ఉదయకుమార్ మండిపడ్డారు. ఆధవ్ అర్జున అనే ఆ పిచ్చి మంత్రికి నిజంగానే మైండ్ పాడైందా అనిపిస్తుందన్నారు. ఇలాంటి సగం తెలివితేటల ముఖాలను తీసుకెళ్లి కేబినెట్లో కూర్చోబెట్టారని, ఇలాంటి వాళ్లను చూడాల్సి రావడం మన దురదృష్టం అంటూæ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ ప్రభుత్వం 3 నెలలైనా ఉంటుందా?
చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వంపై డీఎంకే చీఫ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే ప్రభుత్వం మూడు నెలలు కూడా కొనసాగడం కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు 60 ఏళ్ల కాలంలో ఏర్పడిన ఏకైక డీఎంకేయేతర, అన్నాడీఎంకేయేతర ప్రభుత్వం విజయ్ జోసెఫ్ సారథ్యంలో మేలో ఏర్పడటం తెల్సిందే. ఆదివారం చెన్నైలో వీసీకే ఎమ్మెల్యే పనైయూర్ బాబు డీఎంకేలో చేరిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో స్టాలిన్ ప్రసంగించారు. ‘‘ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటిదో నేను చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, మరో ఆరు నెలల వరకు ఎలాంటి విమర్శలు చేయబోనని చెప్పా. ప్రస్తుత పరిస్థితులను చూసి మాట్లాడక తప్పడం లేదు. ఈ ప్రభుత్వం ఎన్ని నెలలు ఉంటుందనికాదు, కనీసం మూడు నెలలయినా మనుగడ సాగిస్తుందా అన్నదే అసలు ప్రశ్న’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమ పార్టీలోకి కొత్తగా వచ్చే వారు తాము వచ్చిన పార్టీని విమర్శించవద్దని కోరారు. -
టీవీకే పార్టీలోకి మరో హీరో? పోస్టుతో క్లారిటీ
తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్ కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. రీసెంట్ ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలవగా, హీరో విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. ప్రస్తుతం ఆయన తనదైన పాలనతో బిజీగా ఉన్నారు. మరోవైపు టీవీకే పార్టీలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో లారెన్స్ రాబోతున్నారనే ప్రచారం రెండు మూడు రోజుల నుంచి సాగుతోంది. ఈ రూమర్స్కి ఎండ్ కార్డ్ వేసిన ఇతడు.. పరోక్షంగా ఓ క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు)ఈ మధ్యే జరిగిన తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్.. పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించారు. రాజ్యంగం ప్రకారం ఒకచోట రాజీనామా చేయాలి. దీంతో తిరుచ్చి సీటుకు రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ త్రిషని నిలబెడతారనే కొన్నిరోజుల క్రితం రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. అయితే అలాంటిదేం లేదని దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడా స్థానంలోనే లారెన్స్.. టీవీకే తరఫున పోటీ చేయనున్నారని వార్తలొస్తున్నాయి.తాజాగా ఈ పుకార్లపై స్పందించిన లారెన్స్.. అందరికి నమస్కారం. తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికల్లో నేను పోటీ చేస్తానని పలు మీడియా ఫ్లాట్ఫామ్స్ వార్తలొస్తున్నాయి. తెలిసిన మీడియా మిత్రులు కూడా నాకు ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాలని అడిగారు. పుకార్లు ఎక్కువవుతుండటం వల్ల నేను స్పష్టం చేయాలనుకుని ఈ నోట్ షేర్ చేస్తున్నాను. ప్రస్తుతం 'బెంజ్' షూటింగ్లో బిజీగా ఉన్నాను. ఈనెల 10వ తేదీకి షెడ్యూల్ పూర్తవుతుంది. 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు మా అమ్మ ఆశీర్వాదంతో ముఖ్యమైన విషయాన్ని పంచుకుంటాను అని రాసుకొచ్చాడు.అమ్మ ఆశీర్వాదంతో చెబుతానని లారెన్స్ అంటున్నాడంటే తిరుచ్చి ఉపఎన్నికల్లో టీవీకే తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడం నిజమే అనే సందేహాలు కలుగుతున్నాయి. నటుడు, కొరియోగ్రాఫర్ అయినప్పటికీ చాన్నాళ్లుగా లారెన్స్ పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యమంత్రి విజయ్ గతంలో చేసిన సినిమాలోని పాటలకు ఇతడు కొరియోగ్రఫీ చేశాడు. బహుశా ఆ బాండింగ్ వల్లే విజయ్, తను ఖాళీ చేసిన స్థానంలో లారెన్స్కి అవకాశం ఇవ్వబోతున్నాడా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 30 ఏళ్ల నాటి కేసు.. నటి సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం) View this post on Instagram A post shared by Ragava Lawrence (@actorlawrence) -
సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు
'బాహుబలి' కట్టప్ప కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా డీఎంకే నేతృత్వంలో జరిగిన సభలో పాల్గొన్న నటుడు సత్యరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. స్టాలిన్ ఓటమి తట్టుకోలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సీఎం విజయ్ తీరుపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.(ఇదీ చదవండి: 'పెద్ది' వివాదంలో మరో మలుపు.. జాన్వీ కపూర్ చాట్ లీక్?)స్టాలిన్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలి. మాజీ సీఎం అనే గౌరవం లేకుండా స్టాలిన్ని విజయ్ విమర్శించడం సరికాదు. మీకు బూతులు వస్తాయంటే నాకు మీకన్నా బాగా వస్తాయి. టీవీకే సోషల్ మీడియా నన్ను టార్గెట్ చేసినా నేను ఎవరికీ భయపడను అని సత్యరాజ్ అన్నాడు.సీఎం విజయ్ పార్టీని ఉద్దేశిస్తూ మాట్లాడిన సత్యరాజ్.. పేర్లు మార్చితే సరిపోదు. ద్రావిడ మోడల్ ఇప్పటికే ఎన్నో మార్పులు తెచ్చింది. సినిమాపై అభిరుచి ఉండటం వేరు, రాజకీయం వేరు. మార్పు కావాలనుకున్నప్పుడు, అది ఎలాంటి మార్పు అనేది ఆలోచించాల్సిన అవసరముంది. ద్రావిడ సామాజిక న్యాయ భావజాలానికి భిన్నమైన సిద్ధాంతాలు వస్తే ప్రజలు ఆలోచించాలి. సోదరుడు విజయ్.. అంబేడ్కర్, ద్రావిడ , తమిళ జాతీయవాదం తన రెండు కళ్లు అంటున్నారు. ఇక్కడ కేవలం నాయకులు, వ్యక్తులు మాత్రమే మారుతున్నారు. పార్టీలలో లోపాలు ఉంటే వాటిని ప్రశ్నించి, పరిష్కరించే వారికే ఓటు వేయాలి. రాబోయే రోజుల్లో కూడా స్టాలిన్ నాయకత్వమే బలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.ఇకపోతే సత్యరాజ్.. డీఎంకే పార్టీకి సపోర్ట్ చేస్తుండగా ఈయన కొడుకు శిబి సత్యరాజ్ మాత్రం విజయ్ టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: అదే నిజమైన ఆనందం: మృణాల్ ఠాకుర్) -
టీవీకేలో ఏకంగా 300 మంది చేరిక.. ఇక ఆ ప్రతిపక్ష పార్టీ పరిస్థితి?
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో ఉంటే ప్రజలకు సరైన సేవ చేయలేకపోతున్నామని చెబుతూ 300 మందికి పైగా ఆ పార్టీ సభ్యులు టీవీకేలో చేరారు. శనివారం చెన్నై సమీపంలోని పనయూరులో పార్టీ ప్రధాన కార్యాలయంలో అధికారికంగా వారు టీవీకేలో చేరి, సీఎం విజయ్ నాయకత్వాన్ని కొనియాడారు.టీవీకేలో చేరిన వారిలో అన్నాడీఎంకే మాజీ మంత్రి వెల్లమండి నటరాజన్, అన్నా ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కమలక్కన్నన్, మైలాపూర్ మాజీ ఎమ్మెల్యే నటరాజ్, మాజీ మంత్రి ఆనందన్, పరమక్కుడి మాజీ ఎమ్మెల్యే సాధన్ ప్రభాకర్, తిరుపత్తూర్ నగర కార్యదర్శి డిటి కుమార్, మరో 300 మందికి పైగా ఉన్నారు.టీవీకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎన్ ఆనంద్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సెంగొట్టైయన్, ప్రజాపనుల శాఖ మంత్రి ఆదవ్ అర్జున సమక్షంలో ఈ చేరిక జరిగింది.మాజీ మంత్రి, సీనియర్ అన్నాడీఎంకే నాయకుడు ఉదుమలై రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. తనతో పాటు త్రిచి ఎన్ ఆర్ శివపతి, కడంబూర్ రాజు, ఎంసి సంపత్, పన్నీర్సెల్వం, గోవిందసామి, కొలత్తూర్ కృష్ణమూర్తి వంటి సీనియర్ నాయకులు అధికార టీవీకేలో చేరినట్లు తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత నాయకత్వాన్ని గుర్తుచేసుకుంటూ, ఆమె హయాంలో అన్నాడీఎంకే కార్యకర్తలు కఠిన క్రమశిక్షణ పాటించారని, ఆమె మరణం పార్టీకి పెద్ద దెబ్బగా మారిందని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా అన్నాడీఎంకేలో కొనసాగినా, ప్రజలకు సమర్థంగా సేవ చేయలేకపోయామని, క్లిష్ట పరిస్థితుల్లో పనిచేశామని రాధాకృష్ణన్ తెలిపారు.ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్లో ఎంజీఆర్, జయలలిత ఆశయాలు కనిపిస్తున్నాయని, టీవీకేలో లభించిన గౌరవం, గుర్తింపే పార్టీలో చేరేందుకు ప్రేరణగా నిలిచిందని చెప్పారు. టీవీకే కోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి సారిస్తూ యువ నాయకత్వానికి మద్దతు ఇస్తామని తెలిపారు.పార్టీ క్రమశిక్షణ పట్ల తమ అంకితభావాన్ని ప్రస్తావిస్తూ, నాయకత్వం అప్పగించే ఏ బాధ్యతనైనా నమ్మకంగా నిర్వర్తిస్తామని రాధాకృష్ణన్ చెప్పారు. భవిష్యత్తులో జిల్లాస్థాయి కార్యకర్తలు, సీనియర్ అన్నాడీఎంకే నాయకులు మరింత మంది టీవీకేలో చేరే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సెంగొట్టైయన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వాన్ని నమ్మి తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఓటు వేశారని చెప్పారు. "భారత చరిత్రలో పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల్లోనే విజయం సాధించిన ఉద్యమం ఏదైనా ఉంటే అది తమిళగ వెట్రి కళగమే. ఎన్ని కూటములు ఏర్పడినా, తమిళ నేలపై పుట్టిన ఎవరూ తమిళనాడులో మా ఉద్యమాన్ని ఓడించలేరు. స్వచ్ఛమైన పాలన అందించగల నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించారు. అది సాధించగల వ్యక్తి ఆయనే. ఎప్పటికీ విజయ్ తమిళనాడు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారు. నేను విప్లవ నాయకుడు ఎంజీఆర్తో ప్రయాణించాను. విప్లవ నాయకురాలు అమ్మతో కూడా కలిసి పనిచేశాను. విశ్వాసం లేని వారు గెలిచారు. ఇతరులను నమ్మిన వారు ఓటమిని చూశారు" అని అన్నారు.ఇదే కార్యక్రమంలో ప్రజాపనుల శాఖ మంత్రి ఆదవ్ అర్జున మాట్లాడుతూ.. సెంగొట్టైయన్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించే విషయంలో టీవీకే ప్రభుత్వం మాజీ డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలను మించి పనిచేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి విజయ్ మంత్రివర్గాన్ని మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత మంత్రివర్గాలతో పోల్చుతూ.. వారి వారసత్వాన్ని టీవీకే ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు."అన్నా, ఎంజీఆర్, పురట్చి తలైవి అమ్మలా నిజాయితీగా ఎదిగిన నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ సి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అవుతారని మేము ముందే చెప్పాం. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. చిన్న పార్టీల నాయకులతో కూర్చున్నారని సెంగొట్టైయన్ను అన్నాఏడీఎంకే సభ్యులు ఎగతాళి చేశారు. కానీ ఆయన ఎంజీఆర్ మంత్రివర్గంలో మంత్రి. కుమార్ అమ్మ మంత్రివర్గంలో మంత్రి. ఇప్పుడు ఇద్దరూ జోసెఫ్ విజయ్ మంత్రివర్గంలో కూడా మంత్రులుగా ఉన్నారు" అని చెప్పారు. -
ఓటమి గుణపాఠం.. స్టాలిన్ సంచలన నిర్ణయం
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమిని చవిచూసిన డీఎంకే పార్టీలో అంతర్గత పునర్వ్యవస్థీకరణకు కసరత్తులు చేపట్టింది. పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ను ఫలితాలు డీలా పడేలా చేశాయి. తాను సైతం కొళత్తూరులో ఓడినా, ప్రధాన ప్రతిపక్షంగా డీఎంకే నిలవడం కాస్త ఊరటగా మారింది. దీంతో స్టాలిన్ పార్టీలో సమూల మార్పులకు చర్యలు చేపట్టారు.30 మంది సభ్యుల కమిటీ విచారణనియోజకవర్గాల వారీగా ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి డీఎంకే అధినాయకత్వం 30 మంది సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే, పార్టీ వలంటీర్లు, సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా పంచుకోవడానికి ‘ఉడన్ పెరప్పే’ అనే ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. ఈ కమిటీలు ఇచ్చే నివేదికను జూన్ 10వ తేదీలోగా పార్టీ అధ్యక్షుడికి సమర్పించాల్సి ఉంది.జిల్లా కమిటీల విభజనపార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రస్తుతం ఉన్న 78 జిల్లాల కార్యదర్శుల సంఖ్యను 115కు పెంచనున్నారు. తద్వారా నియోజకవర్గాల వారీగా పట్టు సాధించవచ్చని భావిస్తున్నారు. యువజనులకు అత్యధికంగా జిల్లాల కార్యదర్శుల పదవులు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో పార్టీలోని ఇతర సీనియర్ నేతలలో కె.ఎన్. నెహ్రూ, వేలు మాత్రం ప్రస్తుతానికి తమ పదవుల్లోనే కొనసాగుతారని సమాచారం.యువతకు చాన్స్ఎన్నికల నివేదికల ఆధారంగా జూన్ 10 తర్వాత డీఎంకే బైలాస్ (రాజ్యాంగం)ను సవరించి భారీ మార్పులు చేయనున్నారు. పార్టీలో సుదీర్ఘకాలంగా సీనియర్ నాయకుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఉన్న దురైమురుగన్న్ను ఆ పదవి నుంచి తప్పించాలని ఎం.కె. స్టాలిన్ నిర్ణయించినట్టు సమాచారం. వయసు పైబడడంతో ఆయన్ను తప్పించి యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించనున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆయనను కేవలం ఒక ఉప–కార్యదర్శి పదవికి పరిమితం చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే, మరి కొందరు సీనియర్లను తప్పించనున్నట్టు తెలిసింది. దీంతో, తమిళనాడులో డీఎంకే రాజకీయం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
తమిళ రాజకీయం.. టీవీకే ఎమ్మెల్యే Vs మేయర్
సాక్షి, చైన్నె: ‘ మీరా? నేనా? చైన్నెలో అంటూ మేయర్ ప్రియ, టీవీకే ఎమ్మెల్యే పల్లవి మధ్య ప్రోటోకాల్ అధికార పోరు గురువారం చోటు చేసుకుంది. తమిళనాడులో ప్రభుత్వం మారిన తర్వాత చైన్నె కార్పొరేషన్లో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య తీవ్రమైన ఈగో క్లాష్ (అధికార పోరు) మొదలైంది. తిరు.వి.కె. నగర్ నియోజకవర్గ పరిధిలోని పులియంతోపులో కొత్తగా నిర్మించిన పాఠశాల భవన ప్రారంభోత్సవంలో చైన్నె మేయర్ ప్రియ (డీఎంకే), స్థానిక మహిళా ఎమ్మెల్యే పల్లవి (టీవీకే) ల మధ్య జరిగిన ఘర్షణ హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో డీఎంకే అధికారం కోల్పోయినప్పటి నుండి మేయర్ ప్రియ బహిరంగ కార్యక్రమాలకు పెద్దగా హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో పులియంతోపు స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పల్లవి ట్రాఫిక్ జామ్ కారణంగా కొద్దిగా ఆలస్యంగా రావడం వివాదానికి కారణమైంది. ఎమ్మెల్యే పల్లవి లోపలికి వచ్చే సమయానికి మేయర్ ప్రియ ప్రోటోకాల్ను పక్కనబెట్టి ఒంటరిగా తానే రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే పల్లవి ముఖం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ తర్వాత లోపల సాంప్రదాయ కుతువిళక్కు (జ్యోతి ప్రజ్వలన) వెలిగించే సమయంలో, మేయర్ ప్రియ మొదటి దీపం వెలిగించారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే పల్లవికి దీపం వెలిగించే అవకాశం ఇవ్వ కుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. விளக்கேற்ற மெழுகுவர்த்தியை கொடுக்காத மேயர் பிரியா.. கோபப்பட்டு வெளியே சென்ற தவெக எம்எல்ஏ பல்லவி#MayorPriya | #MLAPallavi | #Chennai | #TVK | #DMK pic.twitter.com/XuJsKUQL6H— PttvOnlinenews (@PttvNewsX) June 4, 2026పల్లవి దీపం వెలిగించడానికి కొద్దిగా కదలగా, అక్కడి అధికారి ఆమెను వెనక్కి జరగమన్నట్లు మాట్లాడటంతో పల్లవి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తనకు జరిగిన అవమానానికి నిరసనగా ఎమ్మెల్యే పల్లవి కార్యక్రమాన్ని మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన 75వ వార్డు చిన్నబాబు వీధి పాఠశాల ప్రారంభోత్సవంలో కూడా ఆమె మేయర్తో కలిసి దీపం వెలిగించడానికి నిరాకరించి, ‘మీరే వెలిగించుకోండి‘ అని ఖరాఖండీగా చెప్పేశారు.అవమానించారు: ఎమ్మెల్యే పల్లవి ఆవేదనఈ ఘటనపై ఎమ్మెల్యే పల్లవి స్పందిస్తూ.. ‘తాను బిడ్డకు జన్మనిచ్చి కేవలం 10 రోజులే అయిందన్నారు. కనీసం మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారని, అయినా ప్రజా సమస్యల కోసం, తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం అని వచ్చాననని, అయితే, ఈ విధంగా అవమానించడం దారుణం అని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే మేయర్ ప్రియ స్పందిస్తూ చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ, వివాదం సృష్టిస్తున్నారని వివరణ ఇచ్చారు. -
‘‘సీఎం విజయ్ను ఎంజీఆర్తో పోల్చడమేంటీ?’’
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను చాలామంది దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్తో పోల్చుతున్నారు. సినీ రంగం నుంచే ఇద్దరూ రాజకీయాల్లోకి రావడం, ఎంజీఆర్లాగే విజయ్ కూడా తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు కావడంతో ఈ పోలిక వస్తోంది. అభిమాన సంఘాల నెట్వర్క్, పేదలు, యువతపై దృష్టి పెట్టడం, ప్రజాకర్షణ వంటి అంశాలూ దీనికి కారణం. ఎంజీఆర్లా చాలా సంవత్సరాలు విజయ్ కూడా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఎంజీఆర్తో విజయ్ను పోల్చడం సరికాదని పుతియ తమిళగం వ్యవస్థాపకుడు డాక్టర్ కే కృష్ణస్వామి అంటున్నారు. ఎందుకో వివరించి చెప్పారు.తాజాగా, ఓ ఇంటర్వ్యూలో డాక్టర్ కె.కృష్ణస్వామి మాట్లాడుతూ.. ‘‘ఎంజీఆర్ రాజకీయ నేపథ్యంతో విజయ్ను చూడొద్దు. నేను విజయ్ను ఎంజీఆర్తో పోల్చడం లేదు. ఎంజీఆర్ ఎంజీఆరే. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) రాజకీయాలకు ప్రత్యామ్నాయం కావాలనే ఆలోచన దాదాపు 59-60 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంది. 2026 శాసనసభ ఎన్నికలు ఆ ఆలోచనకు వచ్చిన ఫలితం.డీఎంకేపై ప్రజల్లో వ్యతిరేకత ఉండేది. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తేలికగా తీసుకోకూడదు. కఠినంగా వ్యవహరించకూడదు. దక్షిణ తమిళనాడులో పరువు హత్యలు జరుగుతున్నాయి. మహిళల భద్రతపై ఆందోళన పెరిగింది. యువకులు మద్యం బానిసలుగా మారుతున్నారు. అందువల్లే డీఎంకేపై ఇటీవల ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. ఏ గ్రామం వదలకుండా, ఏ వీధి వదలకుండా మాదకద్రవ్యాల సంస్కృతి విస్తరించింది’’ అని చెప్పారు.సినిమాలు చూసి ప్రభావితమయ్యారు.. ‘‘సామాజిక న్యాయం అంటే కేవలం కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం కాదు. ఎనిమిది మంది మంత్రులు ఉన్నంత మాత్రాన తమిళనాడులోని కోట్లాది ప్రజలకు సామాజిక న్యాయం స్థాపించలేరు. సినిమాలు చూసి ప్రభావితమై, ఒక వ్యక్తిపై అభిమానం పెంచుకుని చాలా మంది నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి తమిళనాడులోని గ్రామాల్లో ఏమి జరుగుతుందో తెలియదు. తిరునెల్వేలి జిల్లాలో ఏమి జరుగుతోంది, తూత్తుకుడి జిల్లాలో ఏమి జరుగుతోంది, తెంకాసి జిల్లాలో ఏమి జరుగుతోంది, విల్లుపురం, కడలూరు ప్రాంతాల్లో ఏమి జరుగుతోంది అన్నది తెలియదు’’ అని తెలిపారు. రాజకీయ అవగాహన లేకుండా, ఆకర్షణకులోనై ప్రజలు ఓట్లు వేశారని కృష్ణస్వామి అన్నారు.విజయకాంత్, శరత్కుమార్, భాగ్యరాజ్ వచ్చారు.. ‘‘గత రెండు సంవత్సరాలుగా తమిళనాడులో పెద్ద రాజకీయ మార్పు వస్తుందని నేను చెబుతున్నాను. కానీ ఎవరూ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. 1967లో కాంగ్రెస్ను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి దాదాపు 59 సంవత్సరాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల రాజకీయాలే కొనసాగుతున్నాయి.ఈ రాజకీయాలకు ప్రత్యామ్నాయం కావాలని చాలామంది ప్రయత్నించారు. మూడో కూటమి ఏర్పాటు చేయాలని చూశారు. ద్రవిడ మున్నేట్ర కళగం వద్దు, అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం వద్దు అని పలువురు రాజకీయ శక్తులు ప్రయత్నించాయి. 1996లో కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నించాయి. 1999లో లోక్సభ ఎన్నికల సమయంలో మేము కూడా ప్రయత్నించాం. 2016లో కొన్ని సంస్థలు ప్రయత్నించాయి.అదే విధంగా విజయకాంత్ వచ్చారు. శరత్కుమార్ వచ్చారు. భాగ్యరాజ్ వచ్చారు. సినిమా రంగం నుంచి పలువురు వ్యక్తిగత శక్తులుగా రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ ఉద్యమాలు నడిపినవారు కూడా కలిసి ప్రయత్నాలు చేశారు.తమిళనాడులో ప్రత్యామ్నాయం కావాలనే భావన నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. ఒక రోజు దానికి రూపం వస్తుందని అనుకున్నాం. ఇప్పుడు 2026లో కనిపిస్తున్న మార్పే ఆ రూపం. ఇది ఒక్కరోజులో వచ్చిన మార్పు కాదు. దాదాపు 59-60 సంవత్సరాలుగా తమిళనాడు ప్రజల్లో ఉన్న ఆలోచనకు వచ్చిన ఫలితం. ఈ భావోద్వేగాన్ని విజయ్ సరైన సమయంలో ఉపయోగించుకున్నారు.గత రెండు సంవత్సరాలుగా మేము ఒక విషయం చెబుతున్నాం. తమిళనాడులో ఏకపక్ష పాలనకు ముగింపు రావాలి. ఒకే పార్టీ పాలన కాదు, భాగస్వామ్య రాజకీయాలు రావాలి. కానీ చాలా పార్టీలు ఎన్నికల ముందు కలిసి, ఎన్నికల తర్వాత మేమే మార్పు అంటున్నాయి. అది కూడా మరో రూపంలోని ఆధిపత్య రాజకీయమే. ద్రవిడ మున్నేట్ర కళగం మారాలి. అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం మారాలి. అందరికీ రాజకీయ స్థలం ఇవ్వాలి. సమ్మిళిత రాజకీయాలు రావాలి. ఇప్పటి కాలం మారింది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఉన్న సమస్యలు వేరు. ఇప్పుడు అట్టడుగు వర్గాల సమస్యలు ప్రధాన రాజకీయ పార్టీలు పరిష్కరించలేకపోతే ప్రత్యేక సంస్థలు పుట్టుకొస్తాయి. అందుకే మేము పుదియ తమిళగం ఏర్పాటు చేశాం. తమిళనాడులో కుల సమస్య ఇప్పటికీ ఉంది. కుల నిర్మూలన చాలా ముఖ్యమని మేము భావిస్తున్నాం. అందుకే ఆ సమస్యను ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని కృష్ణస్వామి తెలిపారు. -
సీఎం విజయ్ త్యాగం.. కాంగ్రెస్కు గుడ్న్యూస్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో రాజ్యసభకు జరగనున్న ఉప ఎన్నికలో అధికార టీవీకే పార్టీ ఆ సీటును కాంగ్రెస్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీవీకేతోపాటు కూటమిలోని పార్టీలు ఇందుకు అంగీకారం తెలిపాయి. ఇక, ఈ నెల 18న రాజ్యసభ ఉప ఎన్నిక జరగనుంది.ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే తరఫున రాజ్యసభలో ఎంపీగా కొనసాగిన సీవీ షణ్ముగం.. తమిళనాడు ఎన్నికల సందర్భంగా రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైలాం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో షణ్ముగం తన రాజ్యాసభ పదవికి మే 7న రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ ఉండనుంది. అధికార టీవీకే కూటమి మద్దతు ఉండటంతో కాంగ్రెస్కు విజయావకాశాలున్నాయి.కాగా, తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ సీటు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 8 వరకు, ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన జూన్ 9 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 11 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జూన్ 18న ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా పీ తెన్మోళి కొనసాగనున్నారు. -
తమిళనాట భారీ ట్విస్ట్.. విజయ్, పళనిస్వామి భేటీపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామిని కలవడానికి తమిళనాడు సీఎం విజయ్ ఎప్పుడూ సమయం కోరలేదని ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుసామి స్పష్టం చేశారు. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నిర్మల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన పూర్తిగా ఖండించారు. బుధవారం హోసూరులో మీడియాతో కేపీ మునుస్వామి మాట్లాడుతూ.. మంత్రి నిర్మల్ కుమార్ ప్రెస్మీట్లలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, అనవసర వ్యాఖ్యలు చేస్తే చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. సీఎం విజయ్ ఇప్పటివరకు పళణి స్వామిని కలవడానికి అనుమతి అడిగింది లేదన్నారు. తాము నిరాకరించింది లేదని ఆయన తేల్చి చెప్పారు.సీఎం విజయ్పై ఘాటు వ్యాఖ్యలుఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ రాజకీయ శైలిపై కేపీ మునుసామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం విజయ్ కష్టపడి ఈ స్థాయికి రాలేదని, సినిమా పరిశ్రమలో ఒక మాయను సృష్టించి, ఆ మాయా రూపాన్ని ఇన్స్ట్రాగామ్, రీల్స్లో చూపించారని ఎద్దేవా చేశారు. యువత నమ్మి ఓటేశారని పేర్కొంటూ, తిరుచ్చిలో జరిగిన కృతజ్ఞత సభలో సినిమాలో డైలాగులు చెప్పినట్లే కేవలం 15 నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయారు. వెనుక ఉండి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను ఆయన చదివారు అంతే అని వ్యంగ్యాస్త్రం సంధించారు.సొంత ఆలోచన లేదుప్రజలు మనకెందుకు ఓటేశారని, మనం ఇచ్చిన హామీలు ఏంటి అని, వాటి కోసం ఎలాంటి పథకాలు తీసుకురావాలనే విషయాలపై సీఎం విజయ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం రోజే మాట్లాడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అక్కడ ఆయన మౌనంగా ఉండిపోయారని, ప్రధాని మోదీతో కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడి బయటకు వచ్చేశారని, ఇందులో ఓ ఐదు నిమిషాలు కుశల ప్రశ్నలకు, మరో ఐదు నిమిషాలు రాష్ట్ర సమస్యలు చర్చించేందుకు సమయం ఉంటుందా..? అని ప్రశ్నించారు. సీఎం విజయ్కు సొంత ఆలోచనలు లేవని, ఆయన విషయం లేని సీఎం అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఏ పార్టీ అంతరించిపోదని, ఒకే ఒక్క కార్యకర్త ఉన్నా ఆ పార్టీ బతికే ఉంటుందని మునుసామి పేర్కొన్నారు. కమ్యూనిస్టులు వందేళ్లుగా అధికారంలోకి రాకపోయినా సిద్ధాంతం కోసం పోరాడుతున్నారని, అన్నాడీఎంకే కూడా అలాంటి బలమైన సిద్ధాంతం కలిగిన పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలు సీఎం విజయ్కు తెలియవని , ఒకవేళ విజయ్ నిజంగానే ఎంజీఆర్, జయలలితను విమర్శించకూడదు అనుకుంటే.. ఆయన మొదట కలవాల్సింది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామినే అని స్పష్టం చేశారు. -
విజయ్ని అడిగితే.. డిప్యూటీ సీఎం ఇచ్చేవారు: ప్రేమలత
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ చేసిన ఆదివారం వ్యాఖ్యలు కొత్త ట్విస్టుకు దారి తీశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చైన్నెలో నిర్వహించిన డీఎండీకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం తమిళనాడులో మంత్రి పదవుల కోసం రాజకీయ నాయకులు ఎగబడుతున్నారని ప్రేమలత ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా టీవీకే అధినేత, ప్రస్తుత సీఎం విజయ్ను ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.‘నేను అనుకుంటే విజయ్ను కలవడం పెద్ద విషయమా? అని పేర్కొంటూ, ఇప్పుడు చాలా మంది మంత్రి పదవుల కోసం ఆయన చుట్టూ పరుగులు తీస్తున్నారు. అయితే, నేను గనుక ఒక్క మాట చెప్పి ఉంటే.. విజయ్ స్వయంగా నా ఇంటికి వచ్చి మరీ నాకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి ఉండేవారు. ఇది పచ్చి నిజం.’ అని వ్యాఖ్యలు చేశారు. అయితే, డీఎండీకే ఎప్పుడూ పదవులకో, డబ్బులకో ఆశపడే పార్టీ కాదని నమ్ముకున్న సిద్ధాంతాలకు, కూటమి ధర్మానికి కట్టుబడి ఉండే పవిత్రమైన పార్టీ అని స్పష్టం చేశారు.టీవీకే ప్రభుత్వంపై విమర్శల బాణాలు..తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా కాకముందే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు మొదలయ్యాయని ప్రేమలత ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీవీకే.. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతిభద్రతల క్షీణించాయని, మహిళలపై లైంగిక దాడులు, విద్యుత్ కోతలు, మేఘదాతు వివాదం, రైతుల రుణమాఫీ నిరసనలు పెరిగిపోతున్నాయని, వీటికి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎన్నికల ప్రచారంలో ఎవరినైతే ’దుష్ట శక్తి’ అని విమర్శించారో, ఇప్పుడు అదే పార్టీ మద్దతుతో ఇక్కడ ’పవిత్ర శక్తి’ అని చెప్పుకునే వారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ఈ రాజకీయ డ్రామాలను ప్రజలంతా గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.పళనిస్వామి తీరుపై ఫైర్2024 లోక్సభ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేకు అండగా డీఎండీకే నిలిచిన విషయాన్ని ప్రేమలత గుర్తుచేశారు. అయితే, 2024లో వదిలేసి వెళ్లిన వారినే మళ్లీ 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం పిలిచి పళని చర్చలు జరిపారని పేర్కొన్నారు. కష్టకాలంలో తోడున్న తమను కనీసం గౌరవించి పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఫస్ట్ టైమ్ ప్రజల్లోకి విజయ్.. రేపు తిరుచ్చిలో పర్యటన
సాక్షి, చెన్నై: తిరుచ్చి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం విజయ్ సోమవారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందు కోసం తిరుచ్చి తూర్పు నియోజకవర్గం పరిధిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివరాలు.. సీఎం విజయ్ చెన్నై పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలలో పోటీ చేసిన విషయం తెలిసిందే. తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి ఆయన రాజీనామా చేశారు.సీఎంగా బాధ్యతలు చేపట్టడం, మంత్రి వర్గం విస్తరణ, వాగ్దానాల అమలు, ఢిల్లీ పర్యటన అంటూ బిజీగా ఉన్న విజయ్ ఎట్టకేలకు తిరుచ్చి తూర్పు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం సోమవారం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్ సీఎంగా బాధ్యలు చేపట్టినానంతరం ప్రజలలోకి ప్రథమంగా వస్తున్నారు. చెన్నై నుంచి తిరుచ్చికి విజయ్ విమానంలో వెళ్లారు. తిరుచ్చి విమానాశ్రయం టెర్మినల్ నుండి తన సొంత, ప్రత్యేక వాహనంలో (ఓపెన్ వ్యాన్)లో బయలుదేరుతారు. తిరుచ్చి–పుదుక్కోట్టై రోడ్డులోని టీవీఎస్ టోల్ గేట్, ఓల్డ్ డెయిరీ ఫామ్ ,మిల్క్ స్టేషన్ మీదుగా ప్రయాణించి సెయింట్ జోసెఫ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. ఆయన ఓపెన్ వ్యాన్లో నిలబడి ప్రజలకు , కార్యరర్తలకు చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతూ, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రసంగిస్తారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత ఆయన తమిళనాడులోని ఇతర జిల్లాలలో కూడా పర్యటించి ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారని సమాచారం. -
విజయ్కి బిగ్ షాక్.. ప్రేమలత విజయకాంత్ సంచలన ఆరోపణలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలు, పిల్లలకు రక్షణ కరువైందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, ఘోర దాడుల సంఘటనలను ప్రస్తావిస్తూ ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తక్షణమే ఈ వ్యవహారాలపై దృష్టి సారించి, శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.కాపాడాల్సిన వారే కీచకులవుతున్నారు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని దారుణ సంఘటనలను ప్రేమలత ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెన్నై వడపళనిలో 16 ఏళ్ల మైనర్ బాలుడికి మద్యం ఇప్పించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు స్వయంగా ఒక హెడ్ కానిస్టేబుల్పైనే కేసు నమోదు కావడం సమాజంలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నట్టు మండిపడ్డారు. చెన్నై వేళచ్చేరి బస్టాండ్ సమీపంలో గాయాలతో స్ప్పహతప్పి పడివున్న 61 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి జరగడం అత్యంత వేదనాభరితమని, వృద్ధులకు కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విల్లుపురం,కడలూరు అంటూ చెన్నై నుంచి తేనివ రకు నిత్యం నేరాల పర్వం కొనసాగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రంలో మార్పు వస్తుందనే ఆశతో ప్రజలు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని, కానీ ఇలాంటి వరుస నేరాలు ప్రజల్లో తీవ్ర నిరాశను, అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయని ప్రేమలత పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రశాంతంగా జీవించే వాతావరణాన్ని కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిందితులు ఎంతటి వారైనా పక్షపాతం లేకుండా కఠినంగా శిక్షించాలని, ఇప్పటికైనా సీఎం స్వయంగా స్పందించి, శాంతిభద్రతలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. -
ఆలయంలో మంత్రి రహస్య తనిఖీ.. అడ్డంగా దొరికిన అర్చకులు!
సాక్షి, చెన్నై: తూత్తుకుడి జిల్లాలోని ప్రముఖ మురుగన్ ఆలయం తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో వీఐపీ, ప్రత్యేక దర్శనాల పేరిట అర్చకులు, సిబ్బంది భక్తుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు నిరంతరం ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో హిందూ ధారి్మక దేవదాయ శాఖ మంత్రి రమేష్ ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయంలో ఒక సామాన్య భక్తుడిలా మారి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లంచం డిమాండ్ చేసిన అర్చకులు డిజిటల్ ఆధారాలతో సహా మంత్రికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం కలకలం రేపింది. డిజిటల్ చెల్లింపు.. రెడ్ హ్యాండెడ్ ఆధారాలు ప్రస్తుతానికి తన వద్ద నగదు లేదని చెప్పిన మంత్రి, అక్కడి అర్చకుడి గూగుల్ పే నంబర్కు రూ.4వేలు ఆన్ లైన్ ద్వారా బదిలీ చేశారు. డబ్బులు అకౌంట్లో పడ్డాయని అర్చకులు నిర్ధారించుకున్న మరుక్షణమే, మంత్రి తన ముఖానికి ఉన్న మాస్క్ తొలగించి తానెవరో బయటపెట్టారు. డిజిటల్ లావాదేవీ ఆధారాలు సహా దొరకడంతో అర్చకులు, వారికి సహకరించిన సిబ్బంది షాక్కు గురయ్యారు. అక్రమాలకు పాల్పడిన అర్చకులను, సిబ్బందిని ఆలయ కార్యాలయానికి పిలిపించి మంత్రి రమేష్ వారి నుంచి లిఖితపూర్వక వివరణ లేఖలను తీసుకున్నారు.ఆ తర్వాత ఆయన అన్నదాన సముదాయానికి వెళ్లి సాధారణ భక్తులతో కలిసి కూర్చుని భోజనం చేశారు. అక్కడ పంపిణీ చేసే అన్నదాన టోకెన్ల జారీలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించి, అక్కడి సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించారు. ఆలయ ఆస్తులు, నెలవారీ ఆదాయం, పరిపాలనాపరమైన అంశాలపై కూడా మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.ఈ వ్యవహారంపై మంత్రి రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్నెట్లో తాజా తనిఖీలకు సంబంధించిన తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయన్నారు. లంచం వసూలు చేసిన వారి నుంచి క్షమాపణ లేఖ తీసుకోలేదని, కేవలం వివరణ లేఖ మాత్రమే కోరామన్నారు. ఆలయ అన్నదానం, ఆస్తుల నిర్వహణపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నామని అన్నారు. ఈ విచారణ నివేదిక వచ్చిన తర్వాత, తప్పు చేసిన వారు ఎంతటివారైనా సరే, ఎలాంటి పక్షపాతం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, సామాన్యుడిలా మంత్రి చేసిన ఈ ఆకస్మిక తనిఖీలను ఆలయానికి వచ్చిన భక్తులు అభినందించారు.ఒక సామాన్య భక్తుడిలా మంత్రి ఎంట్రీ మంత్రి రమేష్ తన అధికారిక వాహనాన్ని ఆలయ సముదాయానికి దూరంగా నిలిపివేసి, ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ టీషర్ట్, మాస్క్ ధరించి తన సహాయకుడితో కలిసి కాలినడకన ఆలయంలోకి ప్రవేశించారు. శీఘ్ర దర్శనం చేసుకోవడానికి ఏం చేయాలని మంత్రి సహాయకుడు అక్కడి అర్చకులను విచారించారు. వచ్చిన వ్యక్తి మంత్రి అని తెలియని అర్చకులు, ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున నలుగురికి కలిపి మొత్తం రూ.4వేలు ఇస్తే వెంటనే వీఐపీ దర్శనానికి తీసుకెళ్తామని బేరసారాలు మొదలెట్టారు. -
విజయ్ సర్కార్కు కొత్త సవాల్..
సాక్షి, చైన్నె: ‘మేమే ప్రత్యామ్నాయం.. సరికొత్త స్వచ్ఛమైన రాజకీయ శక్తి’ అంటూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చి, 108 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన ‘తమిళనాడు వెట్రి కళగం’ అధినేత విజయ్ సీఎం పగ్గాలు చేపట్టి మూడు వారాలు అయింది. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో మార్పు కోసం ఓట్లేసి గెలిపించిన సామాన్య ప్రజలు, క్షేత్రస్థాయి సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం విజయ్ ముందు 7 కీలక ప్రశ్నలను ఉంచుతున్నారు. వీటిని సామాజిక మాధ్యమాల రూపంలో, లేఖల రూపంలో విజయ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. 1.శాంతిభద్రతలు – మహిళల భద్రతఎన్నికల ప్రచారంలో ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అని విమర్శించిన విజయ్, అధికారంలోకి రాగానే శ్రీసింగప్పెన్ అదిరడి పడైశ్రీ (మహిళా స్పెషల్ ఫోర్స్) పథకంపై తొలి సంతకాల్లో ఒకటి చేశారు. అయితే, ఇది ఆచరణలో గత ప్రభుత్వంలో ఉన్న పింక్ పెట్రోల్ పథకానికి కేవలం పేరు మార్చడమే (స్టిక్కర్ రాజకీయం) అని విమర్శలు వస్తున్నాయి. గత 15 రోజుల్లోనే రాష్ట్రంలో 19 లైంగిక నేరాలు నమోదయ్యాయని గణాంకాలు చెబుతుండటంతో, మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకోబోయే నిర్మాణాత్మక చర్యలేమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.2.అవినీతి నిర్మూలన – రిజిస్ట్రేషన్ శాఖగత డీఎంకే ప్రభుత్వం చివర్లో తెచ్చిన శ్రీస్టార్ 3.0శ్రీ సాఫ్ట్వేర్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసినా, ఇంటర్నెట్ పరిజ్ఞానం లేని సామాన్యులకు దళారీల వేధింపులు ఇంకా తప్పడం లేదు. భూమి పత్రాల సవరణ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఖజానా ఖాళీ అయింది.. శ్వేతపత్రం విడుదల చేస్తాం అని ప్రకటించిన సీఎం విజయ్, ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ , ఆర్టీవీ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అవినీతిని ఎలా అంతమొందిస్తారనే అంచనాలు పెరిగినట్టు ఎదురు చూస్తున్నారు.3.మహిళల నిరీక్షణ – ఉచిత గ్యాస్, బస్సు ప్రయాణంఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్నపూర్ణి సూపర్ సిక్స్ పథకం కింద ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, కుటుంబ మహిళలకు నెలకు రూ. 2,500 పెట్టుబడి సాయం, శ్రీవెట్రి పయన తిట్టంశ్రీ కింద అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీల అమలు కోసం మహిళా లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ప్రశ్నించే వారు అధికమయ్యారు. తమకు ఉచిత ఫ్రిజ్లు, రూ. 8,000 కూపన్లు వద్దు.. నిజమైన మార్పు కావాలి అని ఓట్లేసిన తమ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నినాదిస్తున్నారు.4.నిరుద్యోగ యువత – నన్బాస్, నన్బీస్ ఆశలుతమిళనాడు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే కేటాయిస్తామని, ఉన్నత చదువుల కోసం భరోసా లేకుండా రూ. 20 లక్షల వరకు విద్యా రుణాలు ఇస్తామని, నిరుద్యోగ యువతకు రూ. 4,000 భృతి కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. అయితే, రెండు వారాల పాలనలో యువత సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించలేదని సామాన్య యువత అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.5.మత్స్యకారుల సమస్య – కచ్చతీవుపై మౌనంశ్రీలంక నావికాదళం చేతిలో బందీలుగా చిక్కుకున్న తమిళనాడు మత్స్యకారులను, వారి పడవలను విడిపించాలని కేంద్రానికి లేఖలు రాయడం వంటి ప్రక్రియ పాత పద్ధతిలోనే రాష్ట్రంలో కొనసాగుతోంది. మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ కచ్చతీవు వివాదంపై నో కామెంట్స్ అని దాటవేయడం మత్స్యకార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సున్నితమైన అంశంపై సీఎం విజయ్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని తీరప్రాంత ప్రజలు కోరుతున్నారు.6.ప్రభుత్వ ఉపాధ్యాయుల డిమాండ్లుప్రభుత్వ బదిలీలు, పదోన్నతుల్లో అవినీతిని అంతమొందిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. అయితే, మే నెల ముగుస్తున్నా ఉపాధ్యాయుల సాధారణ బదిలీల కౌన్సెలింగ్పై ఎలాంటి ప్రకటన రాలేదు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 243 (రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్)ను రద్దు చేయాలని జాక్టో–జియో వంటి ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బదిలీల ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తారా లేదా అని ఉపాధ్యాయ లోకం నిలదీస్తుంటం గమనార్హం.7.రైతుల ఆవేదన – రుణమాఫీపై అసంతృప్తివ్యవసాయ రుణాల పూర్తి మాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీకి, ప్రస్తుత ఉత్తర్వులకు పొంతన లేదని రైతులు మండిపడుతున్నారు. సహకార బ్యాంకుల్లో రూ. 50 వేల వరకు రుణం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు పూర్తి మాఫీ అని, అంతకు మించి ఉన్నవారికి రేషియో పద్ధతిలో మాఫీ అని ప్రభుత్వం ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూమి పరిమాణాన్ని బట్టి కాకుండా, రుణ మొత్తాన్ని బట్టి రైతులను వర్గీకరించడం మోసపూరితమని వామపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. అలాగే, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు రూ. 60 వరకు వసూలు చేస్తున్న అక్రమాలను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రధాని మోదీతో సీఎం విజయ్ భేటీ
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఢిల్లీలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో విజయ్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు ఆనకట్ట ప్రాజెక్టుకు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అంగీకారం లేకుండా అనుమతి ఇవ్వొద్దని విజయ్ కోరారు. దీనిపై తమిళనాడు రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అలాగే, పలువురు కేంద్ర మంత్రులను కూడా విజయ్ కలవనున్నారు.తమిళనాడుకు సంబంధించిన అభివృద్ధి, ప్రాజెక్టులు, ఆర్ధిక అంశాలపై విజయ్ చర్చిస్తారు. చెన్నై మెట్రో రైలు విస్తరణ, జీఎస్టీ పరిహారం బకాయిలు, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన వాటా, ఇతర అంశాలపై ప్రధాన మంత్రికి వినతి పత్రం ఇవ్వనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రఖ్యాత తమిళ కవి-సన్యాసి తిరువళ్లువర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతోనూ విజయ్ సమావేశమవుతారు. -
ఇది తమిళనాడా లేదా యూపీనా..?
తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 15 రోజుల్లోనే రాష్ట్రంలో భారీ సంఖ్యలో నేరాలు జరిగాయని ఆరోపిస్తూ, మహిళలు, పిల్లల రక్షణ కోసం సీఎం విజయ్ తీసుకుంటున్న చర్యలేంటో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉదయనిధి స్టాలిన్ సోమవారం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ను పంచుకున్నారు. తమిళనాడులో గత 15 రోజుల్లోనే 25 హత్యలు, 4 జంట హత్యలు , 19 లైంగిక దాడులు జరిగాయని వివరించారు. ఇవి కేవలం మీడియాలో వచ్చిన వార్తల ఆధా రంగా తెలిసిన గణాంకాలు మాత్రమేనని పేర్కొన్నారు. మార్పు.. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన వారి పాలనలో.. తమిళనాడు శాంతిభద్రతలు ఏస్థాయిలో దిగజారిపోయాయో చెప్పడానికి ఈ ఘోరాలే నిదర్శనం అని వివరించారు. అసలు ఇది తమిళనాడా లేక ఉత్తర ప్రదేశా?‘ అని ఆయన ప్రశ్నించారు. వరుస నేరాల తో విమర్శల దాడి రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు దారుణ ఘటనలను ఉదయనిధి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోయంబత్తూర్ సూలూర్ పరిధిలో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన నుంచి కోలుకోకముందే, విల్లుపురం జిల్లాలో మరో బాలికపై లైంగిక దాడి జరిగిందన్నారు. ప్రసిద్ధ మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం సమీపంలోనే ఒక బాలుడు దారుణంగా హత్యకు గురయ్యాడని, కోయంబత్తూర్లో ఒక యువతి ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరి భయాందోళనలు సృష్టించారని వివరించారు. సీఎం నియోజకవర్గంలోనే అరాచకం స్వయంగా సీఎం సొంత నియోజకవర్గమైన పెరంబూర్లో మత్తు ముఠా ఏకంగా 13 వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ అరాచకానికి ఒడిగట్టిందన్నారు. ఎన్నికల ముందు వీర నినాదాలు చేసిన సీఎం, ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఎందుకు నోరు విప్పడం లేదు? మీ ’సింగపెన్’ (మహిళా రక్షణ) టాస్క్ ఫోర్స్ ఏమైంది? అని ఉదయనిధి నిలదీశారు. పెరుగుతున్న నేరాలతో ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్న తరుణంలో.. కేవలం కంటితుడుపు చర్యగా ఉదయం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, ఒక ప్రకటన విడుదల చేస్తే సరిపోదని సీఎంను ఉద్దేశించి ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని, మహిళలు, చిన్నారు లకు రక్షణ కలి్పంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. -
వారితో జాగ్రత్త.. విజయ్కు తమిళిసై హెచ్చరిక
సాక్షి, చైన్నె: వెన్నుపోటు కాంగ్రెస్కు అలవాటేనని, జాగ్రత్తగా ఉండాలని సీఎం విజయ్కు బీజేపీ మహిళా నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. ఆదివారం చైన్నెలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, కూటమి రాజకీయాల్లో ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకోవడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయిందన్నారు. తమ విజయాల్లో డీఎంకే పాత్ర ఏమీ లేదని కొందరు అంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు డీఎంకే చేసిన తప్పులతో తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు విమర్శించారు.దీనికి కౌంటర్గా కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే ఆరోపిస్తోందన్నారు. ఈ క్రమంలోనే కొత్త సీఎం జోసెఫ్ విజయ్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్కు ఎప్పటినుంచో ఉన్న అలవాటు అని, ఇన్నాళ్లూ తమతో ఉన్న డీఎంకేకే వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ.. రేపు సీఎం విజయ్కు కూడా వెన్నుపోటు పొడవడానికి వెనుకాడదని హెచ్చరించారు.అన్నాడీఎంకే విషయంలో త్వరలో నిర్ణయం..మరోవైపు.. అసెంబ్లీలో ఎవరికి గుర్తింపు ఇవ్వాలనే విషయంపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పరస్పర పిటిషన్లపై త్వరలోనే ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం చైన్నెలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత ఎన్నికపై మీ వైఖరి ఏమిటి? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పీకర్ ప్రభాకర్ స్పందిస్తూ.. రెండు వేర్వేరు వర్గాలుగా విడిపోయిన అన్నాడీఎంకేలోని రెండు ప్రధాన వర్గాలు కూడా అసెంబ్లీలో గుర్తింపు కోరుతూ తనకు వినతిపత్రాలు సమర్పించాయన్నారు.ఆ వినతిపత్రాలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి అని తెలిపారు. తన నిర్ణయంపై వస్తున్న అంచనాలపై స్పందిస్తూ.. ఈ విషయంలో తాను తీర్పు వెలువరించినప్పుడు, ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరించానో ఈ దేశానికి స్పష్టంగా తెలియబోతోందన్నారు. తనపై ఆరోపణలు చేసే వారికి కూడా అప్పుడు వాస్తవాలు అర్థమవుతాయన్నారు. సరైన సమయంలో, తగిన నిర్ణయం తీసుకుని దాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తాననని, తన నిర్ణయం పూర్తి న్యాయబద్ధంగా ఉంటుందని స్పీకర్ వివరించారు. -
ట్రోలింగ్ చేయడం సరికాదు.. మంత్రి కీర్తన ఆవేదన
సాక్షి, చైన్నె: ‘నేను సహజంగా నవ్విన నవ్వును కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు... దానికి రాజకీయ రంగు పూసి, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడం తీవ్రంగా కలచివేసింది’ అని పరిశ్రమల శాఖ మంత్రి కీర్తనా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక సుదీర్ఘ వివరణను పోస్ట్ చేశారు.ట్రోలింగ్ చేయడం సరికాదుపరిశ్రమల శాఖ సమావేశం ముగిసిన తర్వాత ప్రెస్మీట్లో విలేకరుల ప్రశ్నలు–సమాధానాలు ముగిసిన తరుణంలో తాను సహజంగా నవ్వాననని, అది ఏ ఒక్క ప్రశ్నకో లేదా రాష్ట్రంలో జరిగిన ఏ ఒక్క ఘటనకో వ్యతిరేకంగా చేసిన ప్రతిబింబం కాదన్నారు. అయితే తన తాలూకు ఆ బాడీ లాంగ్వేజ్ను తప్పుగా చిత్రీకరిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నెగిటివ్గా ప్రచారం చేయడం బాధాకరం అని మంత్రి కీర్తనా పేర్కొన్నారు. இவர்கள் எல்லாம் மனிதர்களா...பத்து வயது சிறுமி பாலியல் வன்கொடுமைக்கு ஆளாக்கப்பட்டு மிகக் கொடூரமாக கொலை செய்யப்பட்டது தொடர்பாக செய்தியாளர்கள் கேள்வி கேட்டால் அமைச்சர் @Keerthana4VNR வுக்கு சிரிப்பு வருகிறது 🤬🤬🤬 pic.twitter.com/eALA6Cx8IV— Sivan - DMK (@SSivanDMK) May 24, 2026ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో కూడా వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధారమైన విమర్శలు చేయడం, వ్యక్తిగత దాడులకు దిగడం , సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారాహిత్యంగా ట్రోలింగ్ చేయడం ఆందోళనకరమని ఆమె అన్నారు. ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని విమర్శించడం ప్రజాస్వామ్యంలో భాగమే కావచ్చని, అయితే, ఒకరి వ్యక్తిగత క్షణాలను అస్త్రంగా మార్చుకుని నిజాన్ని వక్రీకరించడం సమాజానికి ఆరోగ్యకరమైన పద్ధతి కాదని హితవు పలికారు.தொழில்துறை தொடர்பான அறிமுகக் கூட்டத்தை முடித்து பத்திரிகையாளர்களை சந்தித்து வெளியே வந்தபோது, கேள்வி-பதில்கள் முடிந்த தருணத்தில் இயல்பாக நான் சிரித்தேன். அது எந்தக் கேள்விக்கும் அல்லது சம்பவத்திற்கும் எதிரான பிரதிபலிப்பல்ல. ஆனால் அந்த உடல் மொழியை தவறாகப் புரிந்து கொண்டு, அரசியல்…— Virudhai Magal Keerthana (@Keerthana4VNR) May 24, 2026మరోవైపు.. మైనర్ హత్యాచారం కేసు వివరాలను మీడియాకు వివరించే సమావేశంలో తమిళనాడు పోలీస్ అధికారుల వ్యవహరించిన అమానవీయంపై నెటిజన్లు, ప్రజలు ఫైర్ అవుతున్నారు. ప్రెస్మీట్లో పోలీసుల అధికార నవ్వులాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా..పోలీసు అధికారుల తీరుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కోయంబత్తూరు వెస్ట్ జోన్ ఐజీ రమ్య భారతి సహా డీఐజీ, ఎస్పీ ముగ్గురు అధికారులు పదేళ్ల బాలిక హత్యాచారం కేసు ప్రెస్ మీట్లో నవ్వులాటలు సాగిస్తూ.. మీడియా ముందే నవ్వారు. సున్నితమైన ఈ కేసులో ఏమాత్రం సీరియస్నెస్ లేని అధికారులు వైఖరిపై జనాగ్రహం పెల్లుబికుతుంది. అధికారుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. పోలీసుల అమానవీయ చర్య విషయం సీఎం విజయ్ వరకు వెళ్లడంతో సంబంధిత అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.Insensitive 🤦🤦🤦 pic.twitter.com/xiMg9toeb7— Rajasekar (@sekartweets) May 24, 2026అసలు ఏం జరిగింది?కోయంబత్తూర్లోని దుకాణానికి వెళ్లి అదృశ్యమైన 10 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాట కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కార్తీక్, మోహన్ రాజ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారి హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 రోజుల్లోనే రాష్ట్రంలో నేరాల గ్రాఫ్ పెరిగిందని డీఎంకే విమర్శలు గుప్పించింది. -
10 ఏళ్ల బాలిక కిడ్నాప్, హత్య.. సీఎం విజయ్ ఏం చేశారంటే..?
చెన్నై: కోయంబత్తూరులో ఒక 10 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ విషాదంగా ముగిసింది. తాజాగా తీవ్ర గాయాలతో కూడిన ఆ బాలిక మృతదేహం సూలురులోని కన్నంపాల్యం లేక్ వద్ద లభ్యమయ్యింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పందించారు. ఇటువంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లో క్షమించరాదని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. 21వ తేదీ గత గురువారం రోజు సాయంత్రం సూలూరులో ప్రాంతంలో 10 ఏళ్ల బాలిక సరుకులు కొనడానికి బయటకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మోహాన్ రాజ్, కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ బాలికను అపహరించారు. అనంతరం ఆ బాలిక మృతదేహం లభ్యమయ్యింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఆ బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించారు. తాము మార్పు కోసం సీఎం విజయ్కు ఓటేశామని ఇప్పుడు ఈ ఘటనపై ఆయన కనీసం స్పందించడం లేదని ముఖ్యమంత్రి స్పందించేవరకూ మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు.దీంతో ఈ నిరసనల నేపథ్యంలో తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం విజయ్ స్పందించారు."నిన్న కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికకు జరిగిన దారుణ ఘటన తీవ్ర దుఃఖాన్ని, దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఇలాంటి అమానుషమైన, క్షమించరాని నేరపూరిత చర్యలను మన సమాజంలో ఎన్నటికీ సహించలేం. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని" అని Xలో పోస్ట్ చేశారు.అయితే ఈ ఘటనపై తమిళనాడు డీజీపీ సీరీయస్గా ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా బాధితురాలి తల్లిదండ్రులను ఆ నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే సుకుమార్ కలిశారు. నిందితులను ఎట్టిపరిస్థితుల్లో శిక్షించి తీరుతామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై అక్కడి ప్రతిపక్ష డీఎంకే తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 12 రోజుల్లోనే, లైంగిక హింస, గంజాయి స్మగ్లింగ్, రౌడీయిజం, అధికార పార్టీ సభ్యుల దురుసు ప్రవర్తన, అరాచకాలు విపరీతంగా పెరిగి పోయాయాని ఇప్పుడు ఏకంగా బాలిక అపహరణ, అనంతరం హత్య జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల స్థితిని తెలియజేస్తుందన్నారు. కేవలం 12 రోజుల్లోనే 30కి పైగా ప్రధాన ఘటనలు వార్తల్లోకి వచ్చాయని రాష్ట్రంలో శాంతిభద్రతలపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. -
విజయ్ గవర్నెన్స్ ఫాక్ట్ చెక్.. 108 సీట్లు..1000 అబద్దాలు ?
-
.............
– వివాదంపై టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వివరణసాక్షి, చైన్నె : తన పాత జ్యోతిష్య కార్యాలయంలో ప్రభుత్వ అధికారులతో నిర్వహించిన సమావేశం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీయడంతో, తమిళగ వెట్రి కళగం మహిళా ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంపై ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ సోషల్ మీడియా ట్రోల్స్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.వివాదం ఏమిటంటే..?ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ పరిధిలోని గౌండంపాళయం నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున కనిమొళి సంతోష్ విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రముఖ జ్యోతిష్యురాలిగా ప్రాచుర్యం పొందారు. ఇటీవల ఆమె ప్రజారోగ్యశాఖ అధికారులతో తన కార్యాలయంలో సమావేశమై, అందుకు సంబంధించిన మూడు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటోల్లో ఎమ్మెల్యే కనిమొళి పెద్ద లగ్జరీ సోఫాలో కూర్చోగా, ఆమెకు ఎదురుగా ప్రభుత్వ అధికారులు ప్లాస్టిక్ కుర్చీలలో కూర్చోవడం కనిపించింది. ప్రభుత్వ అధికారులను ఆమె అవమానించారంటూ నెటిజన్లు, ప్రతిపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి.ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ వివరణ:ఈ వివాదంపై ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే, అందులోని అసలు నిజాన్ని వివరించారు. తాను రాజకీయాల్లోకి రాకముందు చాలా ఏళ్లుగా జ్యోతిష్యురాలిగా ప్రజలను కలుస్తున్న కార్యాలయం అని, తన జీవిత ప్రయాణంలో అది ఎంతో ముఖ్యమైన స్థలంగా పేర్కొన్నారు. తన కొత్త ఎమ్మెల్యే ఆఫీస్ పనులు (పెయింటింగ్, ఇతర పనులు) ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కొత్త ఆఫీస్ పనులు పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత ఆఫీస్ నుంచే ప్రజల సమస్యలను, అధికారులను కలిసి వినతులను స్వీకరిస్తున్నానని తెలిపారు. తనకు ప్రజాసేవే ముఖ్యం, ఆఫీస్ ఎక్కడ ఉందనేది కాదని వివరించారు. తాను అధికారులను ఇంటికి పిలిపించుకుని, ప్లాస్టిక్ కుర్చీలలో కూర్చోబెట్టి అవమానించానని కొందరు కావాల నే ట్రోల్ చేస్తుండడం అవాస్తవంగా పేర్కొన్నారు.


