సాక్షి, చెన్నై: తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలు, పిల్లలకు రక్షణ కరువైందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, ఘోర దాడుల సంఘటనలను ప్రస్తావిస్తూ ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తక్షణమే ఈ వ్యవహారాలపై దృష్టి సారించి, శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కాపాడాల్సిన వారే కీచకులవుతున్నారు
రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని దారుణ సంఘటనలను ప్రేమలత ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెన్నై వడపళనిలో 16 ఏళ్ల మైనర్ బాలుడికి మద్యం ఇప్పించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు స్వయంగా ఒక హెడ్ కానిస్టేబుల్పైనే కేసు నమోదు కావడం సమాజంలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నట్టు మండిపడ్డారు. చెన్నై వేళచ్చేరి బస్టాండ్ సమీపంలో గాయాలతో స్ప్పహతప్పి పడివున్న 61 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి జరగడం అత్యంత వేదనాభరితమని, వృద్ధులకు కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విల్లుపురం,కడలూరు అంటూ చెన్నై నుంచి తేనివ రకు నిత్యం నేరాల పర్వం కొనసాగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలి..
రాష్ట్రంలో మార్పు వస్తుందనే ఆశతో ప్రజలు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని, కానీ ఇలాంటి వరుస నేరాలు ప్రజల్లో తీవ్ర నిరాశను, అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయని ప్రేమలత పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రశాంతంగా జీవించే వాతావరణాన్ని కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిందితులు ఎంతటి వారైనా పక్షపాతం లేకుండా కఠినంగా శిక్షించాలని, ఇప్పటికైనా సీఎం స్వయంగా స్పందించి, శాంతిభద్రతలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.


