‘తమ్ముడూ విజయ్‌.. ప్రాణం ఒక్కసారే పోతుంది!’ | RB Udhayakumar Fire On CM Vijay | Sakshi
Sakshi News home page

‘తమ్ముడూ విజయ్‌.. ప్రాణం ఒక్కసారే పోతుంది!’

Jun 8 2026 9:15 AM | Updated on Jun 8 2026 11:00 AM

RB Udhayakumar Fire On CM Vijay

సాక్షి, చైన్నై: తమిళనాడు సీఎం విజయ్‌పై అన్నాడీఎంకే  సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆర్‌.బి. ఉదయకుమార్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి రాకముందు కూటమి కోసం ఎంతగానో మొత్తుకున్నారని,  అప్పుడు ఒక చిన్న లెటర్‌ ప్యాడ్‌ పార్టీ గానీ, తమర్ని నమ్మి రాలేదరన్నారు. అయితే, ఇప్పుడు ఏదో మాయాజాలం జరిగి అధికారం దక్కేసరికి.. ఆ పవర్‌ను చూసి అందరూ తమరి వెనుక పరిగెత్తుకుంటూ వస్తున్నారని  విజయ్‌ను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. మదురై తెప్పకుళం మరియమ్మన్‌ ఆలయ కుంభాభిషేకం సందర్భంగా అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఉదయకుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ వీడుతున్న అన్నాడీఎంకే నేతలపై, సీఎం  విజయ్‌ రాజకీయ వ్యూహాలపై ఘాటుగా స్పందించారు. 

అన్నాడీఎంకే చావలేదు.. మళ్లీ పుంజుకుంటుంది
పారీ్టలో కొన్ని విభేదాల వల్ల నేతలు శత్రువుల వైపు వెళ్తున్నారని, గతంలో ఎంజీఆర్, జయలలిత హయాంలోనూ నెడుంచెజియన్, ఎస్టీఎస్‌ వంటి పెద్ద నేతలు పార్టీని వీడి మళ్లీ తిరిగి వచ్చారని ఉదయకుమార్‌ గుర్తుచేశారు. సొంత పార్టీ  విలువ తెలియక కొందరు ప్రేమ, ఆదరణ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్తుండటం బాధాకరమన్నారు. కొందరు చిల్లర గాళ్లు తమను  చూసి నవ్వుతున్నారని, తాము కేవలం ఎన్నికల్లో ఓడిపోయామే కానీ, చచ్చిపోలేదన్నారు. అన్నాడీఎంకే ఎన్నో శోధనలు, వేదనలను తట్టుకుని నిలబడిన పార్టీ అని, కోట్ల మంది కార్యకర్తలే ఈ పార్టీకి బలమైన పునాదిగా పేర్కొన్నారు.   విజయ్‌లు ఎంతమంది వచ్చినా తాము చూస్తాం్ఙ అని ధీమా వ్యక్తం చేశారు. విజయ్‌ ఏదేని జరిగిన పక్షంలో అందుకు అన్నాడీఎంకేమాత్రం బాథ్యులు కాదన్నారు. 

విజయ్‌ తమ్ముడూ.. నీకు హెచ్చరిక 
ముఖ్యమంత్రి విజయ్‌ను ‘తమ్ముడు’ అని సంబోధిస్తూ ఉదయకుమార్‌ కీలక హెచ్చరికలు చేశారు ‘విజయ్‌ తమ్ముడూ.. ప్రాణం ఒక్కసారే పోతుంది. నీకు హెచ్చరికగా, ప్రేమతో చెబుతున్నాను. జీవితం అనేది ఒకవృత్తం, పైన ఉన్నది కిందకు రావడం ప్రకృతి నియమం. కష్టపడి నమ్ముకున్న వాళ్లతో పార్టీ నడిపితే ఫలితం ఉంటుంది కానీ, దొరికిన వాళ్లనల్లా చేర్చుకుని పార్టీ నడిపితే లాభం లేదు. భవిష్యత్తులో నీకు ఏమైనా జరిగితే దానికి అన్నాడీఎంకే బాధ్యత వహించదు’ అని స్పష్టంచేశారు.  

ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఎందుకు? 
ప్రస్తుత విద్యుత్‌ శాఖ మంత్రి నిర్మల్‌ కుమార్‌ గతంలో ఏఎంఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే.. ఇప్పుడు టీవీకేలో చేరారని గుర్తుచేస్తూ, రేపు అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందని తెలిస్తే మళ్లీ ఆయన జంప్‌ జిలానీ తథ్యమన్నారు. అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలను విజయ్‌ కలిసి శాలువాలు కప్పడం.. ఆయన తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలో 65 శాతం మంది ప్రజలు విజయ్‌ వద్దు అని ఓటేశారని ,ఈ విషయం అర్థమైతే ఆయన ఇలా ఆపరేషన్ ఆకర్ష్ పనులు చేయరని ఎద్దేవా చేశారు. లెక్కలు తెలియక కొందరు చేతికూలీలను పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. 

ఆ మంత్రికి పిచ్చి పట్టింది 
తమ పారీ్టలో 50 శాతం మందిని లాగేసుకున్నామని టీవీకే  మంత్రి ఆధవ్‌ అర్జున చేసిన వ్యాఖ్యలపై ఉదయకుమార్‌ మండిపడ్డారు. ఆధవ్‌ అర్జున అనే ఆ పిచ్చి మంత్రికి నిజంగానే మైండ్‌ పాడైందా అనిపిస్తుందన్నారు. ఇలాంటి సగం తెలివితేటల ముఖాలను తీసుకెళ్లి కేబినెట్‌లో కూర్చోబెట్టారని, ఇలాంటి వాళ్లను చూడాల్సి రావడం మన దురదృష్టం అంటూæ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.     

Advertisement
 
Advertisement
Advertisement