న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఢిల్లీలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో విజయ్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు ఆనకట్ట ప్రాజెక్టుకు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అంగీకారం లేకుండా అనుమతి ఇవ్వొద్దని విజయ్ కోరారు. దీనిపై తమిళనాడు రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అలాగే, పలువురు కేంద్ర మంత్రులను కూడా విజయ్ కలవనున్నారు.
తమిళనాడుకు సంబంధించిన అభివృద్ధి, ప్రాజెక్టులు, ఆర్ధిక అంశాలపై విజయ్ చర్చిస్తారు. చెన్నై మెట్రో రైలు విస్తరణ, జీఎస్టీ పరిహారం బకాయిలు, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన వాటా, ఇతర అంశాలపై ప్రధాన మంత్రికి వినతి పత్రం ఇవ్వనున్నారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రఖ్యాత తమిళ కవి-సన్యాసి తిరువళ్లువర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతోనూ విజయ్ సమావేశమవుతారు.


