షోపియాన్‌: నక్కిన ఇద్దరు ఉగ్రవాదుల కోసం సైన్యం వేట.. | Two Lashkar Terrorists Trapped in Shopian Orchard | Sakshi
Sakshi News home page

షోపియాన్‌: నక్కిన ఇద్దరు ఉగ్రవాదుల కోసం సైన్యం వేట..

Jul 5 2026 11:27 AM | Updated on Jul 5 2026 11:28 AM

Two Lashkar Terrorists Trapped in Shopian Orchard

షోపియాన్: జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. శుక్రవారం ఒక పండ్ల తోటలో ఏర్పాటు చేసిన కెమెరాకు చిక్కిన ఇద్దరు ఉగ్రవాదుల కదలికల ఆధారంగా ఈ ముమ్మర గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలోని ఏడు గ్రామాలను ఆర్మీ, స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

భద్రతా దళాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇప్పటివరకు నాలుగు గ్రామాలను ఖాళీ చేయించాయి. కుల్గాం జిల్లాకు చెందిన లతీఫ్, జాకీర్‌లుగా గుర్తించిన ఈ ఉగ్రవాదులు సైన్యంపైకి ఎదురుకాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమై దీటుగా సమాధానం ఇస్తున్నాయి. ఉగ్రవాదులు పారిపోకుండా తోట చుట్టూ ఉన్న అన్ని మార్గాలను సైన్యం పూర్తిగా మూసివేసింది.

దక్షిణ కశ్మీర్‌ను సెంట్రల్ కాశ్మీర్, పీర్ పంజాల్ శ్రేణులతో అనుసంధానించే షోపియాన్ వ్యూహాత్మకంగా ఉగ్రవాదులకు కీలక రహదారిగా మారింది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇక్కడి దట్టమైన అడవులు, తోటలు ఉగ్రవాదులు తప్పించుకోవడానికి సహకరిస్తున్నాయి. పాకిస్తాన్ మద్దతు కలిగిన  ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను అణచివేయడానికి జరుగుతున్న ఈ ఆపరేషన్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement