ఉద్యోగ విరమణ చేసిన లేదా ఉద్యోగాలు మారిన చందాదారులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నిధులను సకాలంలో ఉపసంహరించుకోవాలని లేదంటే వడ్డీ నష్టపోవాల్సి వస్తుందని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తెలిపింది. ఈ మేరకు ఇనాపరేటివ్ (క్రియాశీలకంగా లేని) ఖాతాలపై చందాదారులకు అధికారికంగా అవగాహన కల్పిస్తూ స్పష్టతనిచ్చింది.
ఉద్యోగం వదిలేసిన తర్వాత లేదా చందా చెల్లింపులు నిలిచిపోయిన తర్వాత ఖాతాలోకి కొత్తగా డిపాజిట్లు రాకపోతే ఆ ఖాతాలు ఇనాపరేటివ్గా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి ఖాతాలపై వడ్డీ నష్టపోకుండా ఉండేందుకు ఈపీఎఫ్ఓ రెండు విభిన్న వయోపరిమితి ఆధారిత నిబంధనలను స్పష్టం చేసింది.
55 ఏళ్ల కంటే ముందే రిటైర్మెంట్ పొందినవారు.. వీరు తమకు 58 ఏళ్ల వయసు నిండేలోపు ఈపీఎఫ్ సొమ్మును పూర్తిస్థాయిలో క్లెయిమ్ చేసుకోవాలి.
55 ఏళ్లు లేదా ఆ తర్వాత రిటైర్ అయినవారు.. ఉద్యోగ విరమణ పొందిన తేదీ నుంచి సరిగ్గా మూడేళ్ల (3 ఏళ్లు) కాలపరిమితిలోగా నిధులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.
రిటైర్మెంట్ నిధి సురక్షితంగా ఉండాలంటే..
మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఎన్) ద్వారా ఈపీఎఫ్ ఖాతాను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తుండాలి.
ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలను(కేవైసీ) ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోవాలి.
ఉద్యోగం మారిన ప్రతిసారీ పాత ఈపీఎఫ్ బ్యాలెన్స్ను కొత్త కంపెనీ ఖాతాకు బదిలీ చేసుకోవాలి.
పదవి విరమణ అనంతర నిధులను నిర్దేశిత గడువు దాటకముందే ఉపసంహరించుకోవాలి.
ఈపీఎఫ్ఓ జారీ చేసే తాజా మార్గదర్శకాలను తరచూ గమనిస్తూ ఉండాలి.
కేవలం పొదుపు చేయడమే కాకుండా విరమణ నిధిని బాధ్యతాయుతంగా నిర్వహించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సకాలంలో క్లెయిమ్లు పూర్తి చేసుకుని వడ్డీ నష్టపోకుండా చూసుకోవడం చందాదారుల ప్రాథమిక బాధ్యత.
ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ తీరుపై వారెన్ బఫెట్ సీరియస్!


