ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు, బెర్క్షైర్ హాథ్వే చైర్మన్ వారెన్ బఫెట్ ప్రస్తుత స్టాక్ మార్కెట్ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేటి ఆర్థిక మార్కెట్ల తీరుపై హెచ్చరికలు జారీ చేశారు. స్వల్పకాలిక ఊహాగానాలు, క్రమశిక్షణ లేని జూదపు(కేసినో) ధోరణులు మార్కెట్ను ఏలుతున్నాయని స్పష్టం చేశారు.
రూ.33 లక్షల కోట్లకు పైగా నగదు నిల్వలు
మార్కెట్లపై ఆసక్తి పెరిగిన ప్రస్తుత సమయంలోనూ బెర్క్షైర్ హాథ్వే 2026 మొదటి త్రైమాసికంలో ఏకంగా 397.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.33 లక్షల కోట్లకు పైగా) రికార్డు నగదు, స్వల్పకాలిక ట్రెజరీ బిల్లులను సమకూర్చుకుంది. ఇది కంపెనీ మొత్తం విలువలో మూడో వంతు కంటే ఎక్కువ కావడం గమనార్హం. మార్కెట్లో వ్యాల్యూయేషన్లు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రతి ఒక్కరూ జూదాన్ని ఇష్టపడుతున్నప్పుడు సరైన విలువ కలిగిన షేర్లను కనుగొనడం అత్యంత కష్టం అని సీఎన్బీసీ ఇంటర్వ్యూలో బఫెట్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా వన్-డే ఆప్షన్స్ ట్రేడింగ్, పాలీమార్కెట్ వంటి ప్రిడిక్షన్ మార్కెట్ల వేగవంతమైన వృద్ధిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
సంక్షోభ సమయాల్లోనే పెట్టుబడులు
అనవసరమైన ఉత్సాహంతో ఊహాజనిత ర్యాలీలను వెంబడించడం కంటే లిక్విడిటీని నిలుపుకోవడమే తమ శైలి అని బఫెట్ పునరుద్ఘాటించారు. ‘మార్కెట్లో పెద్ద ఎత్తున క్షీణత లేదా తీవ్ర సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే మేము ఈ భారీ నిధులను రంగంలోకి దించుతాం’ అని పేర్కొన్నారు. 2008 నాటి ఆర్థిక సంక్షోభం, కొవిడ్ క్రాష్ వంటి సమయాల్లో బెర్క్షైర్ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. 2026 ప్రారంభంలో బఫెట్ నుంచి సీఈఓ బాధ్యతలు స్వీకరించిన గ్రెగ్ అబెల్ కూడా ఇదే మార్గంలో పయనిస్తున్నారు. తన మొదటి త్రైమాసికంలోనే 8.1 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ హోల్డింగ్స్ను విక్రయించి రక్షణత్మక వైఖరిని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు-2026’కు ఆమోదం


