ప్రియురాలితో కలిసి మలేషియా టూర్ ఎంజాయ్ చేసొద్దామని భావించిన ఒక వ్యాపారవేత్తకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పూణెకు చెందిన ఒక వ్యాపారవేత్త, తాను బిజినెస్ ట్రిప్ అని చెప్పి మరో మహిళతో కలిసి మలేషియా వెళ్లాలని ప్లాన్ వేశాడు. కట్ చేస్తే...
వ్యాపార పర్యటన నిమిత్తం తాను మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్తున్నట్లు తన భార్యకు చెప్పాడు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత కనిపించడం లేదంటూ భార్య కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయితే, తాను మరో మహిళా స్నేహితురాలితో కలిసి ప్రయాణిస్తున్న నిజం బయటపడకుండా ఉండేందుకే ఆయన ఇమ్మిగ్రేషన్ సమస్యలంటూ అబద్ధం ఆడినట్లు పోలీసులు తెలిపారు.
లాండ్రీ వ్యాపారం చేసే 46 ఏళ్ల ఆ వ్యాపారి, బిజినెస్ ట్రిప్ పేరుతో సెప్టెంబర్ 14న ఒక మహిళా స్నేహితురాలితో కలిసి కౌలాలంపూర్ వెళ్లాలని ప్లాన్ చేశారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో ఆ మహిళ గతంలో పోగొట్టుకున్నట్లు ప్రకటించిన పాత పాస్పోర్ట్తో ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆమెను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు.
ఇదీ చదవండి: కాటేసిన పాముతో ఆసుపత్రికి : పాము హల్చల్, వణికిన రోగులు
భార్యకు అబద్దం చెప్పి..!
చట్టపరమైన చిక్కులు రావడం, మరో మహిళతో ప్రయాణిస్తున్న విషయం భార్యకు తెలిసిపోతుందనే భయంతో ఇమ్మిగ్రేషన్ సమస్యలంటూ కట్టుకథ చెప్పాడు. అక్కడితో ఆగలేదు విమానాశ్రయం ల్యాండ్లైన్ నుంచి భార్యకు ఫోన్ చేసి, ఇమ్మిగ్రేషన్ సమస్యల వల్ల తన ఫోన్ను స్వాధీనం చేసుకున్నారని అబద్ధం చెప్పాడు. మళ్లీ మరుసటి రోజు వాట్సాప్ వీడియో కాల్లో కూడా సేమ్ స్టోరీ రిపీట్ చేశాడు. ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. దీంతో ఆందోళన చెందిన భార్య బుధవారం పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కిడ్నాప్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.తనపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి బుధవారం రాత్రి సాహర్ పోలీస్ స్టేషన్కు వచ్చి తానే అబద్ధం ఆడినట్లు అంగీకరించారు. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల్లో కోర్టులో "సి సమ్మరీ" (C Summary) క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి : గంటలో 106 పుల్-అప్స్ : చీరకట్టుతో నటి ఫిట్నెస్ ఫీట్


