సెమీ ఫైనల్లో శ్రీలంక (PC: Sri lanka Cricket)
ఆసియా క్రీడలు-2026 మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్లో శ్రీలంక జట్టు సత్తా చాటింది. జపాన్లోని నిశిన్ వేదికగా జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మలేషియాను చిత్తుగా ఓడించింది. తద్వారా సెమీస్కు అర్హత సాధించింది.
ఆటపట్టు మెరుపు అర్ధ శతకం
కరోగి స్పోర్ట్స్ పార్కులో శుక్రవారం ఉదయం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో ఇమేషా దులాని (2) విఫలమైనప్పటికీ.. కెప్టెన్ చమరి ఆటపట్టు మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటింది. కేవలం 37 బంతుల్లోనే ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో ఆటపట్టు 63 పరుగులు సాధించింది.
కవిశా ధనాధన్
మిగిలిన వారిలో హాసిని పెరీరా (26 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించగా.. కవిశా దిల్హరి ధనాధన్ (27 బంతుల్లో 44 నాటౌట్) దంచికొట్టింది. ఆఖర్లో హర్షిత సమరవిక్రమ (18 బంతుల్లో 25) కూడా వేగంగా ఆడింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.
74 పరుగులకే పరిమితం
మలేషియా బౌలర్లలో నురిన్ ఇమానైనా మూడు వికెట్లు తీసి సత్తా చాటింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన మలేషియా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 74 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బౌలర్లు మిథాలి అయోధ్య, కవిశా దిల్హరి, చమరి ఆటపట్టు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి.. తలా రెండు వికెట్లు కూల్చి.. ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు.
సెమీస్లో పాక్తో ఢీ
మలేషియా బ్యాటర్లలో వినిఫ్రెడ్ దురైసింగం (28), మహిరా ఇజాతి ఇస్మాయిల్ (24) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఇక మలేషియాపై 86 పరుగుల తేడాతో జయభేరి మోగించిన శ్రీలంక.. సెమీ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. ఇక ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా సెమీస్ చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే తొలి సెమీ ఫైనల్లో పాకిస్తాన్- శ్రీలంక తలపడేందుకు సిద్ధమయ్యాయి.
చదవండి: సంజూను పక్కనపెట్టాను.. వైభవ్ వేచి చూడాల్సిందే: గంభీర్


