సాక్షి, విజయవాడ: సాక్షి టీవీ దెబ్బకు కూటమి సర్కార్ మరోసారి దిగొచ్చింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టుల భర్తీని మళ్లీ ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత పరీక్ష నిర్వహించి నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టే విధానంపై సాక్షి టీవీ వరుస కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసే ప్రయత్నం జరుగుతోందంటూ సాక్షి టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. నియామకాల్లో అక్రమాలకు ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి నిరుద్యోగుల తరఫున ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాలను తిరిగి ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కొత్త జీవోతో ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి టీవీ కథనాల నేపథ్యంలో కూటమి సర్కార్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. దీంతో, జీవో మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడం గమనార్హం. కూటమి సర్కార్ పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టే విధానాన్ని ప్రశ్నిస్తూ ప్రసారాలు చేసిన సాక్షి టీవీ.. నిరుద్యోగులకు న్యాయం జరిగేలా కృషి చేసింది. ఈ వ్యవహారంలో సాక్షి టీవీపై మంత్రి అచ్చెన్నాయుడు గతంలో విమర్శలు చేసి అబాసుపాలయ్యారు. తాజాగా నియామక ప్రక్రియపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సాక్షి టీవీ చెప్పిందే నిజమని ప్రభుత్వం అంగీకరించింది.
ఏపీపీఎస్సీ ద్వారానే నియామకాలు..
ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామక బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించనున్నారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఇదీ చదవండి: బాబు సర్కార్ మరో 2000 కోట్ల అప్పు


