సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మరోహత్యాచార ఘటన కలకలం రేపింది. మైనర్ బాలికపై ముగ్గురు మైనర్లతో సహా నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ఒక బహిరంగ ప్రదేశంలో పడేశారు. దీంతో ఆమె శరీర భాగాలను కుక్కలు తినడం మరింత ఆందోళన రేపింది. సెప్టెంబర్ 13న ఆలస్యంగా ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసుల సమాచారం ప్రకారం 16 ఏళ్ల బాలికను నలుగురు (ముగ్గురు మైనర్లతో సహా) గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం బాలికను కత్తితో పొడిచి చంపేశారు. ఆమె శవాన్ని బహిరంగ ప్రదేశంలో పడేసి పారిపోయారు. మృతదేహంలోని కొన్ని భాగాలను కుక్కలు పీక్కు తిన్నాయి. దీంతో మృతదేహం మరింత కుళ్లిపోయింది. ఎంతగా అంటే పోలీసులు లింగ నిర్ధారణను కూడా వెంటనే చేయలేకపోయారు.
సెప్టెంబర్ 13న వాయువ్య ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో కుషాక్ రోడ్డు సమీపంలో గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. మృతురాలితో నిందితులకు ముందే పరిచయం ఉన్నట్టు భావిస్తున్నారు. ఎందుకంటే సంఘటన జరిగే రోజు ఆమె వారితో కలిసి ఒక టెంపోలో ప్రయాణించింది. టెంపో లోపల అందరూ కలిసి మద్యం సేవించిన తర్వాత, బాలికపై లైంగిక దాడి చేసి, కత్తితో పొడిచి హత్య చేశారు. శవంలో కొన్ని భాగాలను కుక్కలు తినేశాయి. ఒక చేయి కూడా వేరుపడి ఉంది. దీంతో చనిపోయింది ఆడా, మగా అని నిర్ధారించడానికి పోలీసులకు సమయం పట్టింది.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు శివమ్ అలియాస్ సుదామ మిగిలిన ముగ్గురు 16, 17 ఏళ్ల మైనర్లు.అయితే బాలిక తరచూ ఇంటి నుంచి వెళ్లి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చేది కావడంతో, ఆమెపై ఎలాంటి మిస్సింగ్ ఫిర్యాదు చేయలేదని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేసి, నిందితుల నుంచి రెండు కత్తులు, టెంపో, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది.
ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్


