Representative image
పుణేలో కేంద్ర మంత్రి, పుణే ఎంపీ మురళీధర్ మొహోల్ భద్రతా కాన్వాయ్ను ఓవర్టేక్ చేశాడు ఓ బైకర్. దీంతో ఆ 32 ఏళ్ల ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 13న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇవాళ రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో మొహోల్ కాన్వాయ్ శివాజీనగర్లోని సంచైతి చౌక్ మీదుగా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మొహోల్ భద్రతా విధుల్లో ఉన్న పోలీసు అధికారి ఈశ్వర్ లక్ష్మణ్ భికులే ఫిర్యాదు మేరకు నానా పేఠ్కు చెందిన శుభం విజయ్ వణిత్పై శివాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వణిత్ అధిక వేగంతో ద్విచక్ర వాహనం నడుపుతూ నిర్లక్ష్యంగా కాన్వాయ్ను దాటాడని పోలీసులు ఆరోపించారు.
ఈ చర్యతో ఇతర వాహనదారులు, పాదచారులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొహోల్ ప్రత్యేక విధుల అధికారి వినోద్ సతవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బైకర్ మద్యం మత్తులో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మొహోల్కు కల్పించిన వై ప్లస్ భద్రతా వలయాన్ని బైకర్ పదేపదే ఉల్లంఘించాడని సతవ్ ఆరోపించారు. “ఇది తీవ్రమైన భద్రతా ఉల్లంఘన” అని ఆయన అన్నారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


