కాంగ్రెస్ సభ్యురాలు నాన్సీ మేస్ సంచలన వ్యాఖ్యలు
మసాచుసెట్స్కు చెందిన లిండ్సే క్లాన్సీ అనే తల్లి తన ముగ్గురు పిల్లలని గొంతు నులిమి హత్య చేసిన కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో విచారణ సందర్బంగా కాంగ్రెస్ సభ్యురాలు నాన్సీ మేస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో లిండ్సేకు బహిరంగ మరణ శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. పిల్లలను చంపితే ఇలాగే ఉంటుందనేది ప్రపంచంలోని తల్లులందరికీ హెచ్చరికలా ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు.
2023లో జరిగిన ఈ ఘటనపై విచారణ ముగిసిన తర్వాత, ఇటీవల కోర్టులో మిస్ ట్రయల్ (Mistrial) ప్రకటించారు. తీవ్రమైన ప్రసవానంతర మానసిక సమస్య (పోస్ట్పార్టం సైకోసిస్) కారణంగానే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. ఏడు రోజుల పాటు సుదీర్ఘ చర్చల తరువాత 9 మంది మహిళలు, ముగ్గురు పురుషులతో కూడిన జ్యూరీ ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. మానసిక పరిస్థితి కారణంగా ఆమె నిర్దోషి అని 11 మంది జ్యూరీ సభ్యులు ఓటు వేయగా, ఒకరు మాత్రం వ్యతిరేకించారు. దీంతో జ్యూరీ ప్రతిష్టంభన నెలకొనడంతో జడ్జి విలియం సుల్లివన్ మిస్ ట్రయల్ ప్రకటించారు.
ఇదీ చదవండి: రూ. 12,300 కోట్ల సీఎం విజయ్ డీల్ : 9 వేల ఉద్యోగాలు
దీనిపై దక్షిణ కరోలినా కాంగ్రెస్ మహిళ నాన్సీ మేస్ ఈ కేసుపై తీవ్రంగా స్పందించారు. లిండ్సే క్లాన్సీకి మరణశిక్ష విధించాలని, అది కూడా అందరికీ ఒక హెచ్చరికగా బహిరంగ మరణశిక్ష (Public Execution) కావాలని ఆమె డిమాండ్ చేశారు. పిల్లలు చనిపోయారు కనుక ఆమెకు మరణశిక్ష విధించాలి. అదీ బహిరంగంగా జరగాలి. కాల్చి చంపినా, విద్యుత్ కుర్చీలో కూర్చోబెట్టినా ఏదైనా పర్వాలేదు. కానీ ప్రపంచంలోని తల్లులందరికీ ఒక హెచ్చరికలా ఉండాలని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, లిండ్సే క్లాన్సీని క్షమించాలని ఆమె తరఫు న్యాయవాది కెవిన్ రెడ్డింగ్టన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కోరడాన్ని నాన్సీ మేస్ తీవ్రంగా తప్పుబట్టారు.
కాగా మూడో బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని నెలల పాటు లిండ్సే క్లాన్సీ మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ప్రసవానంతర మానసిక రుగ్మతతో నిద్రలేమి, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో సతమతమవుతూ ఉండేది. దీంతో ఆమె నిపుణులను సంప్రదించింది. చికిత్స తీసుకుంది. కానీ అవేవీ పనిచేయకపోవడంతో, ఆమె ఒక మానసిక వైద్య ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రి నుంచి విడుదలైన పంతొమ్మిది రోజుల తర్వాత, ఆమె మసాచుసెట్స్లోని తమ ఇంట్లో తన ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపేసింది. భర్త పాట్రిక్ క్లాన్సీ ఇంటిలో లేని సమయంలో లిండ్సే తన ముగ్గురు పిల్లలను గొంతు నులిమి హత్య చేసింది.
ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్
ఆమె తీవ్రమైన పోస్ట్పార్టం డిప్రెషన్, సైకోసిస్తో బాధపడుతున్నట్లు వైద్య నిపుణులు కోర్టులో వెల్లడించారు. పిల్లలను హాని చేయాలనే ఆలోచనలు వస్తున్నాయని, ఒక పురుషుడి గొంతు తనను హెచ్చరిస్తున్నట్లు ఆమె అంతకుముందే తన భర్తకు, తల్లికి తెలిపింది. హత్య జరిగిన సమయంలో ఆమె వాస్తవ ప్రపంచానికి దూరంగా, తీవ్రమైన మానసిక అస్థిరతలో ఉందని వైద్య సాక్షులు తెలిపారు.2023 జనవరిలో జరిగిన ఈ హత్యలకు ఆమె మాజీ భర్తే మొదటి సాక్షి. అతను తన భార్యను క్షమించానని, ఆమెను చెడ్డదానిగా కాకుండా అనారోగ్యంతో ఉన్నదానిగా భావించానని ఇంటర్వ్యూలలో చెప్పాడు.


