రియాద్: సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతంలో హౌతీ తిరుగుబాటుదారులు వరుసగా క్షిపణులు, డ్రోన్లతో జరిపిన మెరుపు దాడుల్లో 13 మంది పౌరులు గాయపడ్డారు. దీంతో యెమెన్కు చెందిన హౌతీలపై గట్టిగా స్పందిస్తామని సౌదీ అరేబియా మంగళవారం హెచ్చరించింది. ప్రాంతీయంగా నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ఈ పరిణామం ఉద్రిక్తతలను మరింతగా పెంచింది.
ఇరాన్కు అనుకూలంగా ఉన్న హౌతీలు బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించి సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతంలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో 13 మంది పౌరులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. దీనిపై సౌదీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. యెమెన్లో అంతర్యుద్ధం జూలైలో తీవ్రరూపం దాల్చినప్పటి నుంచి సౌదీ మద్దతున్న ప్రభుత్వ దళాలు, హౌతీల మధ్య పోరాటం కొనసాగుతోంది. రియాద్పై సముద్ర దిగ్బంధాన్ని ప్రకటించిన హౌతీలు.. ఎర్ర సముద్రంలో ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు.
గత వారం హౌతీలు యెమెన్లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతంతో పాటు బాబ్ అల్-మందబ్ జలసంధిపై పట్టు సాధించారు. కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి మార్గంలో రాకపోకలు తీవ్రంగా ప్రభావితమవుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇది యెమెన్ ప్రభుత్వ దళాలకు ఎదురుదెబ్బగా మారింది. ప్రపంచంలోనే ప్రముఖ ముడిచమురు ఎగుమతిదారైన సౌదీ అరేబియాలోని చమురు మౌలిక సదుపాయాలను హౌతీలు లక్ష్యంగా చేసుకున్నారు.
ఇదీ చదవండి: హిందీలో ఎంబీబీఎస్.. నాలుగేళ్ల తర్వాత దిమ్మతిరిగే రిజల్ట్!


