ముంబై: గణేశ్ చతుర్థి సందర్భంగా ముంబై మేయర్ రితు తావ్డే తన నివాసంలో పర్యావరణహిత మట్టి గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నగరంలో నిర్వహించే గణేశోత్సవ వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ విగ్రహాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు చెందిన ప్రభాదేవి మున్సిపల్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న రితిక్ పాస్వాన్ స్వయంగా తయారు చేశారు.
రితిక్ తన చేతులతో తయారుచేసిన మట్టి గణేశుడి విగ్రహాన్ని మేయర్కు అందించారు. విద్యార్థి కళాత్మక ప్రతిభను, భక్తి భావాన్ని గౌరవిస్తూ తావ్డే ఆ విగ్రహాన్ని తన నివాసంలో ప్రతిష్ఠించారు. గణేశ్ పూజకు రితిక్, అతని తల్లిని కూడా ఆహ్వానించారు. మేయర్ నివాసంలో ఒకటిన్నర రోజుల గణేశోత్సవం సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. పూలు, ఇతర పర్యావరణహిత వస్తువులతో అలంకరణలు చేశారు. ఈ సందర్భంగా తావ్డే మాట్లాడుతూ మహారాష్ట్ర రాష్ట్ర పండుగైన శ్రీ గణేశోత్సవాన్ని పురస్కరించుకుని అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ముంబై నగర ప్రజలకు ఆనందం, సౌభాగ్యం, ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: లండన్లో గంగా హారతి.. చరిత్రలో తొలిసారి!


