గణేశ్‌ మండపం వ్యర్థాలతో ఇంధనం | Lalbaugcha Raja Mandal launches Prasad to Energy initiative to generate power | Sakshi
Sakshi News home page

గణేశ్‌ మండపం వ్యర్థాలతో ఇంధనం

Sep 13 2026 6:26 AM | Updated on Sep 13 2026 6:26 AM

Lalbaugcha Raja Mandal launches Prasad to Energy initiative to generate power

ముంబై: ఈ ఏడాది ముంబైలోని ప్రఖ్యాత లాల్‌బాగ్చా గణేశ్‌ మండపం వద్ద ఏర్పడే ప్రసాద వ్యర్థాలు మొత్తం ఇంధనంగా మారనుంది. బాంబే మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) చేపట్టిన ‘ప్రసాద్‌ టు ఎనర్జీ’ కార్యక్రమంలో భాగంగా ప్రసాదం తయారీ, పంపిణీల సమయంలో పుట్టుకొచ్చే సుమారు 80 టన్నుల వ్యర్థాలను బయోమెథనైజేషన్‌ ద్వారా వంట గ్యాస్‌గా మార్చనున్నారు. 

ఈ గ్యాస్‌తో ఉత్పత్తి అయ్యే 7700 యూనిట్ల విద్యుత్తును ముంబైలోని నాలుగు మున్సిపల్‌ ఆసుపత్రుల్లో వాడనున్నారు. సెలెబ్రిటీలు సహా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే లాల్‌బాగ్చా రాజా మండల్‌ సాయంతో తామీ కార్యక్రమం చేపట్టినట్లు బీఎంసీ ప్రకటించింది. సోమవారంతో మొదలై మొత్తం పదకొండు రోజులపాటు జరిగే గణేశ్‌ ఉత్సవాల్లో రోజూ కనీసం 8 నుంచి పది టన్నుల చెత్త ఉత్పత్తి అవుతూంటుందని బీఎంసీ అంచనా వేస్తోంది. 

ఈ చెత్తను అక్కడికక్కడే వేరు చేసి ప్రత్యేక వాహనాల ద్వారా నాయర్, కస్తూర్బా, జీటీబీ, సియాన్‌ ఆసుపత్రుల్లోని బయోమెథనైజేషన్‌ ప్లాంట్లకు తరలిస్తారు. ఈ ప్లాంట్లు ఒకొక్కటి రోజుకు రెండు టన్నుల వరకూ చెత్తను గ్యాస్‌గా మార్చగలవు. అయితే ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మాత్రం చెత్తను బట్టి మారిపోతూంటుంది. ఆసుపత్రుల్లోని విద్యుత్తు దీపాలను వెలిగించేందుకు ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడతామని బీఎంసీ తెఇపింది. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్‌ కంపెనీకి అప్పగించామని తెలిపింది. తడిచెత్త సాయంతో విద్యుత్తు ఉత్పత్తి చేసి చెత్త సమస్యను పరిష్కరించవచ్చునన్న సందేశాన్ని అందరికీ పంపేందుకే తామీ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement