ముంబై: గణేశ్ చతుర్థి వేడుకలకు ముందుగా ముంబైలో ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా రాజా 2026 తొలి దర్శనాన్ని శుక్రవారం సాయంత్రం అధికారికంగా ఆవిష్కరించారు. లాల్బాగ్చా రాజా గణేశోత్సవ మండల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీంతో నగరంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గణేశోత్సవ వేడుకల సందడి ప్రారంభమైంది. లాల్బాగ్చా రాజా ముంబయిలో అత్యంత ప్రసిద్ధి చెందిన గణేశ విగ్రహాల్లో ఒకటి. కళాత్మక నైపుణ్యంతో రూపొందించే ఈ విగ్రహం కేవలం ప్రతిమ మాత్రమే కాకుండా భక్తి, కళా వైభవం, ముంబై ఉత్సాహభరిత స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఈ మండపాన్ని, గణేశుడిని దర్శించుకుంటారు.
2026లో గణేశ్ చతుర్థి వేడుకలు సెప్టెంబర్ 14న ప్రారంభం కానున్నాయి. లాల్బాగ్చా రాజా తొలి దర్శనం ముంబై గణేశోత్సవానికి ముందు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఘట్టాల్లో ఒకటిగా ఉంది. లాల్బాగ్-పరేల్ ప్రాంతంలో ఉన్న ఈ విగ్రహం సింహాసనంపై ఆసీనుడై ప్రశాంతమైన, దయామయమైన, ప్రేమపూర్వక రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది. లాల్బాగ్చా రాజా గణపతి విగ్రహం పుట్లాబాయి చాల్లో ఉన్న లాల్బాగ్చా రాజా గణేశోత్సవ మండల్కు అనుబంధంగా ఉంది. ఈ పూజా స్థలాన్ని 1934లో స్థాపించారు. అప్పటి నుంచి ఇది ముంబయి గణేశ్ చతుర్థి వేడుకల్లో అంతర్భాగంగా మారింది. ఎనిమిది దశాబ్దాలకు పైగా ఈ గణపతి విగ్రహ సంరక్షణ బాధ్యతలను కాంబ్లీ కుటుంబం కొనసాగిస్తోంది.
#WATCH | Mumbai, Maharashtra: First look of Lalbaugcha Raja unveiled ahead of Ganesh Chaturthi on September 14. https://t.co/WZurtiJ7wf
— ANI (@ANI) September 11, 2026
భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి రోజున ప్రారంభమయ్యే గణేశ్ చతుర్థి ఉత్సవాలు పది రోజుల పాటు జరుగుతాయి. చతుర్థితో ప్రారంభమై అనంత చతుర్దశితో ముగుస్తుంది. వినాయక చతుర్థి, వినాయక చవితి పేర్లతోనూ దీనిని పిలుస్తారు. మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాల్లో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు ఇళ్లలో గణేశ విగ్రహాలను ప్రతిష్ఠించి, సంప్రదాయ వంటకాలు తయారు చేసి, మండపాలను సందర్శించి పూజలు చేస్తారు. పర్యావరణహిత ప్రత్యామ్నాయాలపైనా దృష్టి పెరుగుతోంది. గత దశాబ్దంగా ముంబైకి చెందిన ఓ కళాకారుడు మట్టి లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్కు బదులుగా పర్యావరణహిత కాగితంతో గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు.
ఇదీ చదవండి: గణేశ్ ఉత్సవాల్లో.. అష్టవినాయక యాత్ర అంటే ఏమిటి?


