వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశమంతా గణనాథుని నామస్మరణతో మార్మోగిపోతుంది. అయితే మహారాష్ట్రలో ఈ పండుగకు మరో ప్రత్యేకత ఉంది. గణపయ్యను ఒక్కచోట దర్శించుకోవడం కాదు.. ఎనిమిది పవిత్ర క్షేత్రాల్లో ఎనిమిది విశిష్ట రూపాల్లో కొలువైన విఘ్నేశ్వరుడిని దర్శించుకోవడమే ‘అష్టవినాయక యాత్ర’. స్వయంభూ గణేశులుగా భక్తులు విశ్వసించే ఈ ఎనిమిది ఆలయాలు.. ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఎనిమిది క్షేత్రాలు మహారాష్ట్రలోని పుణె, రాయ్గఢ్, అహ్మద్నగర్ జిల్లాల్లో ఉన్నాయి. గణేశ చతుర్థి సందర్భంగా ఈ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అసలు ఈ సంప్రదాయ అష్టవినాయక యాత్ర ఎక్కడ మొదలై.. ఎక్కడ ముగుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వినాయక చవితి వేళ మహారాష్ట్రలోని గణేశ ఆలయాలు భక్తులతో సందడిగా మారుతాయి. ముఖ్యంగా అష్టవినాయక యాత్రకు ఈ సమయంలో మరింత ప్రాధాన్యత ఉంది. సంప్రదాయంగా ఈ యాత్ర మొరగావ్ నుంచి ప్రారంభమై తిరిగి అక్కడే ముగుస్తుంది.
1. మొరగావ్ మయూరేశ్వరుడు
అష్టవినాయక యాత్రలో మొరగావ్లోని శ్రీ మయూరేశ్వర ఆలయం తొలి, చివరి దర్శన స్థలంగా ఉంటుంది. ఇక్కడ గణేశుడిని మయూరేశ్వరుడు లేదా మృగమూర్తి రూపంలో పూజిస్తారు. ఈ రూపానికి వాహనం నెమలి అని చెబుతారు. మహారాష్ట్ర టూరిజం సమాచారం ప్రకారం.. అష్టవినాయక సంప్రదాయంలో ఈ ఆలయానికి అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది. అందుకే సంప్రదాయ యాత్రలో మొరగావ్ ప్రత్యేక ప్రారంభ, ముగింపు క్షేత్రంగా నిలుస్తుంది.
2. సిద్ధటెక్ సిద్ధివినాయకుడు
అష్టవినాయక యాత్రలో తదుపరి ముఖ్యమైన క్షేత్రం సిద్ధటెక్లోని సిద్ధివినాయక ఆలయం. ఇక్కడ గణేశుడిని ‘సిద్ధివినాయకుడు’గా భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయం పౌరాణిక ప్రాధాన్యంతో ప్రసిద్ధి చెందింది. అష్టవినాయక యాత్రలో భాగంగా ఈ క్షేత్రాన్ని దర్శించడం సంప్రదాయంలో ముఖ్యమైన అంశంగా భావిస్తారు.
3. పాలి బల్లాళేశ్వరుడు
రాయ్గఢ్ జిల్లాలోని పాలి గ్రామంలో ఉన్న బల్లాళేశ్వర ఆలయానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అష్టవినాయక ఆలయాల్లో గణేశుడి పేరుతో కాకుండా ఆయన భక్తుడైన బల్లాళుడి పేరుతో ఉన్న ఏకైక ఆలయం ఇదే. గణేశుడిపై బల్లాళుడికి ఉన్న భక్తితో ఈ ఆలయ కథ ముడిపడి ఉంది. అందువల్ల అష్టవినాయక క్షేత్రాల్లో బల్లాళేశ్వర ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది.
4. మహడ్ వరదవినాయకుడు
రాయ్గఢ్ జిల్లాలోని మహడ్లో వరదవినాయక ఆలయం ఉంది. అష్టవినాయక యాత్రలో ఇది మరో ముఖ్యమైన మజిలీ. ఇక్కడ గణేశుడిని వరదవినాయక రూపంలో పూజిస్తారు. ఆనందం, సౌభాగ్యం, సమృద్ధి, మనశ్శాంతి కోసం భక్తులు ప్రధానంగా స్వామివారిని ప్రార్థిస్తారు. అష్టవినాయక సంప్రదాయంలోని ప్రముఖ గణేశ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి.
5. థేవూర్ చింతామణి
పుణె సమీపంలోని థేవూర్లో చింతామణి ఆలయం ఉంది. అష్టవినాయక యాత్రలో ఇది కూడా కీలకమైన క్షేత్రం. ప్రశాంతమైన వాతావరణంతో పాటు అధికమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్ర టూరిజం ప్రకారం.. మూళా, ముఠా, భీమా నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఈ ఆలయం ఉంది. దీంతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ప్రశాంతత కూడా లభిస్తుంది.
6. లేణ్యాద్రి గిరిజాత్మజుడు
లేణ్యాద్రిలోని గిరిజాత్మజ ఆలయం ప్రత్యేక ఆరాధనా రూపానికి ప్రసిద్ధి చెందింది. అష్టవినాయక ఆలయాల్లో గణేశుడిని బాలరూపంలో పూజించే ఏకైక క్షేత్రంగా దీనికి గుర్తింపు ఉంది. పార్వతిదేవి తపస్సు అనంతరం గణేశుడు ఇక్కడ గిరిజాత్మజుడిగా ప్రత్యక్షమయ్యాడనే నమ్మకం ఉంది. ఈ కారణంగా అష్టవినాయక యాత్రలో గిరిజాత్మజ క్షేత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
7. ఓజర్ విఘ్నేశ్వరుడు
ఓజర్లోని విఘ్నేశ్వర గణపతి ఆలయం కూడా అష్టవినాయక యాత్రలోని ముఖ్యమైన క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం నిర్మాణశైలి, బంగారు విగ్రహాల కారణంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గణేశుడిని ‘విఘ్నేశ్వరుడు’గా, అంటే అడ్డంకులను తొలగించే స్వామిగా పూజిస్తారు. అష్టవినాయక సంప్రదాయంలో ఈ ఆలయానికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.
8. రంజన్గావ్ మహాగణపతి
అష్టవినాయక యాత్రలో ఎనిమిదో ప్రధాన ఆలయం రంజన్గావ్లోని మహాగణపతి ఆలయం. ఇది పుణెకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అష్టవినాయక సంప్రదాయంలో ఈ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్షేత్రానికి సంబంధించిన కథ శివుడు, త్రిపురాసురుడి కథతో ముడిపడి ఉంది. ఇలా ఎనిమిది గణేశ క్షేత్రాల దర్శనంతో అష్టవినాయక యాత్ర పూర్తవుతుంది. గణేశ చతుర్థి సందర్భంగా ఈ ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. యాత్రకు వెళ్లాలని భావించేవారు దర్శన సమయాలు, స్థానిక రవాణా సదుపాయాలు, పండుగ సమయంలో అమల్లో ఉండే ప్రయాణ సంబంధిత సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని వెళ్లడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ‘కలల కశ్మీరం’లో థియేటర్లు ఎందుకు మూతపడ్డాయి?


