మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఒక టీచర్ చూపిస్తున్న అంకితభావం అందరినీ ఆకట్టుకుంటోంది. పదుల సంఖ్యలో కూడా లేని విద్యార్థుల చదువు కోసం ప్రతిరోజూ దట్టమైన అడవిలో ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కవల్తేక్ ధంగర్వాడా అనేది కనీస సౌకర్యాలు కూడా లేనటువంటి ఒక చిన్న గ్రామం. కేవలం మూడు ఇళ్లు, తొమ్మిది మంది నివాసితులు. వ్యవసాయం, పశుపోషణ వారి జీవనాధారం.
ఈ ఊరిలో ఉన్న బడికి వెళ్లాలంటే చాలా కష్టం. దట్టమైన అడవిని, క్రూరమైన జంతువులను, కొండకోనలను దాటుకుని వెళ్లాలి. కానీ జీవన్ మిథారీ అనే ఉపాధ్యాయుడు మాత్రం ఆ గ్రామంలో ఉండే ఐదారుగురు పిల్లల చదువుకోసం పదమూడేళ్లుగా అడవిలో ప్రయాణిస్తున్నాడు. మిథారీ నివసించే కాలే గ్రామం నుంచి కవల్తేక్ ధంగర్వాడా 28 కిలోమీటర్లు. అడవిలోకి వెళ్లే ముందు మిథారీ తన వాహనాన్ని అక్కడే ఆపివేసి 5 కిలోమీటర్ల నడక దారిలో వెళ్తాడు. వర్షం పడితే ఈ మార్గమంతా పూర్తి జారుడుగా ఉంటుంది.
అందుకే మిథారీ డబుల్ రెయిన్ కోట్, హెల్మెట్ వంటి రక్షణ పరికరాలతో ప్రయాణిస్తాడు. అంతేకాకుండా ఈ మార్గంలో చిరుత పులులు, ఎలుగుబంట్లు, విష సర్పాలు అడుగడుగునా ఎదురవుతుంటాయి. అయినా అతను వెనక్కి తగ్గడు. అడవిలో నడుస్తున్నప్పుడు పాటలు పాడుతూ లేదా శబ్దాలు చేస్తూ వెళ్తుంటాడు. పట్టణాల్లోని పిల్లలతో సమానంగా ఈ పేద పిల్లలు కూడా చదువుకోవాలన్నదే తన కోరిక అని ఈ ఉపాధ్యాయుడు చెబుతుంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రతిరోజూ అడవి బాట పడుతున్న ఈ ఉపాధ్యాయుడు ఎంతో మంది టీచర్లకు ఆదర్శం.
(చదవండి: క్యాట్లో మంచి స్కోర్ చేసినా..సైన్యంలోకి! కానీ చివరికి..)


