భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ మహారాష్ట్రలోని ప్రముఖ హిల్ స్టేషన్ లోనావాలాలో సుమారు 3.86 ఎకరాల భూమిని దాదాపు రూ.70 కోట్లకు కొనుగోలు చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్ డేటాను విశ్లేషించిన జాప్కీ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ లావాదేవీ మూడు కన్వేయన్స్ డీడ్ల ద్వారా సెప్టెంబర్ 4న నమోదైంది. మొత్తం విలువ రూ.69.99 కోట్లు. ఈ ఆస్తులను నందన్ ధనంజయ్ మెహతా, వివస్వత్ ధనంజయ్ మెహతాల నుంచి కొనుగోలు చేశారు.
పుణె జిల్లా లోనావాలాలోని హెచ్ వార్డులో నాలుగు సిటీ సర్వే నంబర్లలో మొత్తం 1.68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆస్తులు విస్తరించి ఉన్నాయి. ఇందులో దాదాపు 3.09 ఎకరాలను పూర్తి యాజమాన్య హక్కుతో కొనుగోలు చేయగా, ఈ భూమిపై సుమారు 2,100 చదరపు అడుగుల నిర్మాణం కూడా ఉంది. అదనంగా, మరో రెండు స్థలాల్లో 50% వాటాను కూడా తెందుల్కర్ దక్కించుకున్నారు.
ఈ మూడు డీడ్ల విలువలు వరుసగా రూ.63.69 కోట్లు, రూ.4.56 కోట్లు, రూ.1.75 కోట్లుగా ఉన్నాయి. కొనుగోలుదారు స్టాంప్ డ్యూటీ కింద సుమారు రూ.4.20 కోట్లు చెల్లించారు. మొత్తం లావాదేవీ ఆధారంగా చదరపు అడుగుకు సగటున రూ.4,168 చొప్పున ధర లెక్కించబడింది. ముంబై, పుణె నగరాల సంపన్నుల సెకండ్ హోమ్ డెస్టినేషన్గా మారిన లోనావాలాలో ఇటీవలి కాలంలో ప్రముఖులు భారీగా ఆస్తి కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలోని బాంద్రాలో అత్యంత ఖరీదైన బంగ్లా కలిగిన తెందుల్కర్, తాజా కొనుగోలుతో తన రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పోర్ట్ఫోలియోను మరింత విస్తరించారు.
ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు


