న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్లో ఆదివారం మధ్యాహ్నం కుప్పకూలిన పేయింగ్ గెస్ట్ (పీజీ) భవన శిథిలాల వద్ద నుంచి ఎయిమ్స్, ఆర్కే పురం పోలీస్స్టేషన్ వరకు ఓ వ్యక్తి పరుగులు తీశాడు. తన మేనల్లుడు సజీవంగా ఉన్నాడేమోనన్న ఆశతో అతడి కోసం ఆరా తీశారు. ఫోన్లోనూ అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అభిషేక్ మేనమామకు భవనం కూలిన విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్నారు. తన మేనల్లుడు నివసించే ప్రాంతమే కావడంతో అక్కడికి వెళ్లినట్లు ఆయన తెలిపారు. తొలుత అదే పీజీనా కాదా అనే విషయంలో స్పష్టత లేకపోయినా.. ఫోన్లో అభిషేక్ అందుబాటులో లేకపోవడంతో వెంటనే అక్కడికి వెళ్లినట్లు చెప్పారు.
అయితే రాత్రి గడిచేకొద్దీ ఆయన ఆశలు సన్నగిల్లాయి. సోమవారం (సెప్టెంబర్ 7) ఉదయం 9 గంటలకు ఘటనాస్థలిలో ఎవరి ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పినట్లు తెలిపారు. సత్య నికేతన్ నుంచి అందరినీ తరలించారని, సమాచారం కోసం ఎయిమ్స్ లేదా ఆర్కే పురం పోలీస్స్టేషన్కు వెళ్లాలని సూచించారని కన్నీటి పర్యంతమవుతూ చెప్పాడు. అభిషేక్ ఢిల్లీ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్లో మూడో సంవత్సరం విద్యార్థి. అభిషేక్ తెలివైనవాడని మేనమామ తెలిపారు. అభిషేక్ కుటుంబ సభ్యులే కాకుండా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు కూడా తమ పిల్లల సమాచారం కోసం ఎయిమ్స్, సమీపంలోని పోలీస్స్టేషన్లకు పరుగులు తీశారు. సెప్టెంబర్ 6న సత్య నికేతన్లో ఐదు అంతస్తుల భవనం కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ భవనంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ విద్యార్థులు ఉంటున్నారు. ఘటన జరిగిన 24 గంటల తర్వాత భవనం యజమాని హరిరామ్ గుప్తా, ఆయన భార్య ఉర్మిలా గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. వారి కుమారుడు మహేశ్ గుప్తాను రెండు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.
ఇది కూడా చదవండి: Climate Risk Alert: డేంజర్ జోన్లో హైదరాబాద్!


