‘నాకు జన్మ ఇవ్వమని అడిగానా అమ్మా..ఎందుకు పుట్టిన వెంటనే పేగుబంధం తెంచ్చుకొని రోడ్డుపై వదిలేసి వెళ్లావ్’ అంటూ ఒక నవజాత శిశువు మూగరోదన ఇది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును రోడ్డుపై వదిలేసి వెళ్లిన అమానుష ఘటన మహబూబ్నగర్ నగరంలో చోటుచేసుకుంది. రన్నింగ్ ఆటోలోనే ప్రసవం జరిగిన అనంతరం గుర్తుతెలియని మహిళ శిశువును రోడ్డుపై వదిలేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రక్తపు మరకలను గమనించిన వాహనదారులు వాటిని అనుసరించడంతో శిశువు ఆచూకీ లభించింది. సకాలంలో గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది.
నగరంలోని న్యూటౌన్ హెచ్డీఎఫ్సీ సమీపంలో శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గుర్తుతెలియని మహిళ ఆటోలో ప్రసవించిన అనంతరం శిశువును చీరలో చుట్టి కేఎఫ్సీ దుకాణం ఎదుట రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్తున్న వాహనదారులు రోడ్డుపై రక్తపు మరకలను గుర్తించారు. వాటిని అనుసరించగా శిశువు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నవజాత శిశువును మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూలో చికిత్స పొందుతున్నాడు.
సీసీ కెమెరాల్లో రికార్డు
శిశువును ఆటో నుంచి రోడ్డుపై వదిలేస్తున్న దృశ్యాలు సమీపంలోని దుకాణాల సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు పోలీసులు గుర్తించారు. వాటిని పరిశీలిస్తూ శిశువును వదిలేసిన మహిళతో పాటు ఆటో వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డుపై పడివున్న శిశువును వాహనదారులు సకాలంలో గుర్తించకపోయి ఉంటే పరిస్థితి మరింత విషమంగా మారేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ తెలిపారు. శిశువును ఎవరు వదిలేసి వెళ్లారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, సీసీ కెమెరాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.
మహబూబ్నగర్ క్రైం:
చదవండి: చిన్న పిల్లలు ఉన్నారన్నా.. నన్ను బతికించండి!


