మోదీ ‘దిమాగీ నక్సల్‌’ వ్యాఖ్యలు.. ప్రధానికి సీజేపీ కౌంటర్‌! | CJP Vs PM Modi for Dimagi Naxal remark at SRCC | Sakshi
Sakshi News home page

మోదీ ‘దిమాగీ నక్సల్‌’ వ్యాఖ్యలు.. ప్రధానికి సీజేపీ కౌంటర్‌!

Sep 6 2026 11:14 AM | Updated on Sep 6 2026 11:44 AM

CJP Vs PM Modi for Dimagi Naxal remark at SRCC

ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ (SRCC) వేదికగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. యువత, విద్యార్థుల సమస్యలపై మాట్లాడాల్సిన వేదికపై.. ప్రశ్నించే యువతను ‘దిమాగీ నక్సల్స్‌’ అంటూ ముద్ర వేయడం ఏమిటంటూ సీజేపీ తీవ్రంగా మండిపడింది. విద్య, ఉద్యోగాలు, విద్యార్థుల సంక్షేమంపై ప్రధాని మాట్లాడాల్సిందిపోయి.. విమర్శకులను టార్గెట్‌ చేశారని ఆ పార్టీ నేతలు విమర్శించారు.

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీజేపీ సహ కన్వీనర్‌ సౌరవ్‌ దాస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రముఖ కళాశాలల్లో ఒకటైన SRCCలో యువతను ‘దిమాగీ నక్సల్స్‌’గా పేర్కొనడం ప్రధానమంత్రి చేయగలిగే అత్యంత అవమానకరమైన పని అంటూ విమర్శించారు. ప్రధాని యువతకు ఆశలు కల్పించాలి.. ప్రశ్నలు అడుగుతున్నందుకు వారిని నిందించకూడదు అని దాస్‌ వ్యాఖ్యానించారు. టీచర్స్‌ డే సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు. SRCCలోనే ఉపాధ్యాయులు మెడికల్‌, చైల్డ్‌కేర్‌ లీవ్‌ వంటి అంశాలపై ఆందోళన చేయాల్సి వస్తోందని.. కళాశాలలో మౌలిక వసతుల పరిస్థితి, విద్యార్థులపై పెరుగుతున్న పోటీ ఒత్తిడి వంటి అంశాలను ప్రధాని ప్రస్తావించాల్సిందని విమర్శించారు.

మరోవైపు.. ఆశుతోష్‌ రంకా కూడా ప్రధాని ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. SRCC శతాబ్ది వేడుకల వంటి వేదికపై విద్య, ఉపాధి, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే 20 ఏళ్లలో భారత్‌ ప్రపంచంలో తన స్థానాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలన్న అంశాలపై ప్రధాని మాట్లాడాల్సిందని అన్నారు. కానీ అందుకు బదులుగా ‘దిమాగీ నక్సల్‌’ వ్యాఖ్యలతో రాజకీయ విమర్శలకు దిగారని ఆరోపించారు.

అసలు మోదీ ఏం అన్నారు?
SRCC శతాబ్ది వేడుకల్లో దాదాపు 50 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని మోదీ.. గత నెల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తాను ప్రస్తావించిన ‘దిమాగీ నక్సల్స్‌’ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. తాను ‘దిమాగీ నక్సల్‌’ అంటూ చేసిన వ్యాఖ్యల తర్వాత.. ఆ భావజాలానికి మద్దతిస్తున్నవారు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారని మోదీ అన్నారు. తన వ్యాఖ్యలను విమర్శిస్తున్నవారి తీరును ఉద్దేశిస్తూ.. ప్రజలు కూడా వారి అసలు రంగును గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సీజేపీ విమర్శలకు కారణమయ్యాయి. అయితే మోదీ ప్రసంగంలోని ‘దిమాగీ నక్సల్‌’ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారాయి. విద్యార్థుల సమస్యలపై చర్చ జరగాల్సిన SRCC వేదిక.. మోదీ-విమర్శకుల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement