వడోదరా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (మంగళవారం) గుజరాత్లోని వడోదరాలో పాల్గొననున్న ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఉచితంగా అందుబాటులో ఉంచిన బుక్మైషోలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన గంటలోపే పూర్తయ్యాయి. మరోవైపు 42 వేల మందికి పైగా వెయిటింగ్ లిస్టులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వడోదరాలోని మహారాజా సయాజీరావు యూనివర్సిటీ (ఎంఎస్యూ) పావిలియన్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగనుంది.
వడోదరా మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) రిజిస్ట్రేషన్ల కోసం ప్రైవేటు టికెటింగ్ వేదికను వినియోగిస్తోంది. కార్యక్రమానికి హాజరయ్యేందుకు నమోదు చేసుకున్న వారికి వారి బుక్మైషో ఖాతాల ద్వారా ఎం-టికెట్ అందుతుంది. అందులోని లైవ్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ప్రవేశం కల్పిస్తారు. రిజిస్ట్రేషన్, ధ్రువీకరణ, ప్రవేశం, సీటింగ్ మొత్తం డిజిటల్ విధానంలోనే నిర్వహించనున్నారు.
ప్రధాని మోదీ వడోదరా పర్యటనలో రూ.35 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాలు చేపట్టనున్నారు. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని మూడు విభాగాలను జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 326 రూట్ కిలోమీటర్ల మేర ఉన్న ఈ మార్గాలను రూ.20,700 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. న్యూ సనంద్ (నార్త్)-న్యూ మకర్పురా, న్యూ ఉమర్గావ్-న్యూ సఫాలే, న్యూ సఫాలే-న్యూ జేఎన్పీటీ మార్గాలు ఇందులో ఉన్నాయి.
జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీతో కొత్త రైలు అనుసంధానం ఎగుమతి, దిగుమతి సరుకు రవాణాను వేగవంతం చేయడంతోపాటు పారిశ్రామిక కేంద్రాలు, నౌకాశ్రయాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గడంతోపాటు ముంబై రైల్వే నెట్వర్క్పై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.
న్యూ సనంద్ (నార్త్), న్యూ మకర్పురా, న్యూ ఉమర్గావ్, న్యూ జేఎన్పీటీ నుంచి సరుకు రవాణా రైలు సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. టాండా రోడ్-వడోదరా ప్రతాప్నగర్ మధ్య రైలును కూడా ప్రారంభిస్తారు. అలాగే ఛోటా ఉదేపూర్-ధర్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జోబట్-టాండా రోడ్ కొత్త రైల్వే లైన్ను జాతికి అంకితం చేయనున్నారు. దీంతో అలీరాజ్పూర్లోని మారుమూల, గిరిజన ప్రాంతాలు విస్తృత రైల్వే నెట్వర్క్తో అనుసంధానమవుతాయి.
మోదీ పర్యటనకు ఒక రోజు ముందు సోమవారం సాయంత్రం గుజరాత్ ఉపముఖ్యమంత్రి హర్ష్ సంఘవి ఆధ్వర్యంలో వడోదరాలో ‘వికసిత్ భారత్ పాదయాత్ర’ నిర్వహించారు. డాండియా బజార్లోని ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ప్రారంభమైన యాత్ర కీర్తి స్తంభం మీదుగా సాగి సూరసాగర్ సరస్సు వద్ద ముగిసింది. మోదీ పర్యటనకు వచ్చిన స్పందనకు అందుబాటులో ఉన్న సామర్థ్యానికి దాదాపు మూడు రెట్లు రిజిస్ట్రేషన్ల డిమాండ్ ఉందని సంఘవి తెలిపారు. ప్రధాన వేదికలో సీట్లు లభించని వారి కోసం ప్రత్యేక ఫ్యాన్ జోన్లను కూడా ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: ఏఐ మరో సంచలనం.. జంతువుల భాష డీకోడ్ చేస్తూ..


