కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాలతోపాటు అస్సాంలోని నాగావ్ లోక్సభ నియోజకవర్గానికి అక్టోబర్ ఆరో తేదీన ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఈ ఐదు అసెంబ్లీ స్థానాల్లో పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్ సైతం ఉంది.
తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీని ప్రస్తుత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేంధు అధికారి ఇదే నియోజకవర్గంలో ఓడించిన విషయం తెల్సిందే. అయితే గెలిచాక ఈ స్థానం నుంచి ఆయన రాజీనామా చేశారు. భవానీపూర్లోనూ సువేంధు పోటీచేయడం తెల్సిందే.
అన్ని నియోజకవర్గాలకు అక్టోబర్ 9వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2024లో నాగావ్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ప్రద్యుత్ బోల్డోలాయ్ తర్వాత రాజీనామాచేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన ఇటీవలి బీజేపీలో చేరి దిస్పూర్ నుంచి గెలిచారు. తమిళనాడులోని మధురాంతకం(ఎస్సీ) అసెంబ్లీ స్థానంలో మరకతం కుమారవేల్, ధరాపురం(ఎస్సీ) నియోజకవర్గంలో పి.సత్యభామ గెలిచారు.
కానీ ఈ ఇద్దరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇటీవల విజయ్ సారథ్యంలోని టీవీకే పారీ్టకి మద్దతు పలికి అన్నాడీఎంకేకు రాజీనామాచేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తట్టంచవాడీ, మంగళం స్థానాల్లో గెలిచిన పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి కేవలం మంగళంకు పరిమితంకావడంతో తట్టంచవాడిలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఖాళీగా ఉన్న మేఘాలయలోని షిల్లాంగ్, పశ్చిమబెంగాల్లోని బసీర్హాట్ లోక్సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ ఖరారుచేయలేదు.


