గౌహతి: అసోంలోని గౌహతిలోని హాటిగావ్ ప్రాంతంలో 25 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. బసిష్ఠపూర్ బైలేన్లోని ఇంట్లో ఆమె మృతదేహం లభ్యమైంది. మృతురాలిని నూన్మతికి చెందిన రియా తాలూక్దార్గా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త రామానుజన్ గోస్వామి ఆమెను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రామానుజన్ స్వస్థలం గౌరీపూర్ అని తెలిసింది.
పోలీసులు తెలిపిన వివరాల వివరాల ప్రకారం.. రియా ఫ్యాన్సీ బజార్లోని ఏసీ మార్కెట్ ప్రాంతంలో ఉన్న ఓ బొటిక్లో పనిచేసేది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఒక్క సోదరుడు మాత్రమే ఉన్నాడు. సోమవారం రియా, ఆమె భర్త మధ్య ఏదో విషయమై తీవ్ర వాగ్వాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో రామానుజన్ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిని తనిఖీ చేయగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. రియాను అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం ఆమె తలను వేరు చేసి నల్లటి పాలిథిన్ సంచిలో ఉంచి ఫ్రిజ్లో దాచినట్లు తెలియవస్తోంది. అలాగే ఆమె వేళ్లను కూడా వేరుచేసినట్లు సమాచారం.ఈ హత్యకు గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్)కు తరలించారు. భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: మాంసాహారం వండేవారిపై ధీరేంద్ర శాస్త్రి సంచలన వ్యాఖ్యలు


