సాగర్: మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా బండా తహసీల్లో విషపూరిత మద్యం తాగి 10 మంది మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. శనివారం–ఆదివారం మధ్య రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది.
సాగర్ జిల్లా కలెక్టర్ ప్రతిభా పాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ నుంచి మద్యం అక్రమంగా తరలించినట్లు తేలింది. ఇప్పటివరకు అనుమానితులుగా గుర్తించిన వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖకు చెందిన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. మరో అధికారిని జిల్లా నుంచి బదిలీ, చేసి గ్వాలియర్ ప్రధాన కార్యాలయానికి అనుబంధంగా నియమించారు. బండా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్తో పాటు గూగ్రా ఔట్పోస్ట్ ఇన్చార్జిని కూడా సస్పెండ్ చేశారు.
కాగా, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో మద్యం మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జీతూ పట్వారీ ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉమంగ్ సింఘార్ అక్రమ మద్యం వ్యాపారం ఎప్పుడు ఆగుతుందని ప్రశ్నించారు. ఈ విషపూరిత వ్యాపారం ఎవరి అండతో కొనసాగుతోందో ప్రభుత్వం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి


