తెలంగాణకు అలర్ట్‌.. కాసేపట్లో ఈ జిల్లాల్లో గట్టి వానలు.. | Telangana Weather Alert Heavy Rains Several Districts for Two Days | Sakshi
Sakshi News home page

తెలంగాణకు అలర్ట్‌.. కాసేపట్లో ఈ జిల్లాల్లో గట్టి వానలు..

Sep 7 2026 7:53 AM | Updated on Sep 7 2026 7:59 AM

Telangana Weather Alert Heavy Rains Several Districts for Two Days

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి వాతావరణం మారిపోయింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు అలర్ట్‌లు జారీ చేయడంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక, ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో మోస్తరు వర్షం కురిసింది.

సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెదురుమదురు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోనూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్‌ ఉంది. దీంతో నగరవాసులు బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మెదక్‌, సిద్దిపేట, జనగామ, కామారెడ్డి, హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు, ఉరుములు, మెరుపులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు పరిస్థితిని బట్టి ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇక మంగళవారం, బుధవారం తెల్లవారుజాము వరకు మరికొన్ని జిల్లాల్లో వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చెదురుమదురు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

ఇదీ చదవండి: ఎల్‌నినో ఎఫెక్ట్‌.. 30 జిల్లాల్లో పాతాళానికి నీరు.. 

మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement