అమెరికా రోగికి విజయవంతంగా మార్పిడి
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ మార్పిడి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు.. అప్పటివరకు డయాలసిస్ తప్పని పరిస్థితి. అవయవం దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న దుస్థితికి పరిష్కారం దిశగా వైద్యరంగంలో మరో కీలక ముందడుగు పడింది. జన్యుమార్పులు చేసిన పంది కిడ్నీని మనిషికి అమర్చి.. ఏకంగా 271 రోజులపాటు డయాలసిస్ అవసరం లేకుండా జీవించేలా చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు... ఆ తర్వాత అదే రోగికి మానవ కిడ్నీని విజయవంతంగా అమర్చారు.
పంది అవయవాన్ని తాత్కాలికంగా ఉపయోగించి, తర్వాత మానవ అవయవానికి మా రడం ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన 66 ఏళ్ల టిమ్ ఆండ్రూస్ దీర్ఘకాలిక కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్నారు. మానవ కిడ్నీ దొరకడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండటంతో 2025 జనవరిలో జన్యుమార్పులు చేసిన పంది కిడ్నీని అమర్చారు. కిడ్నీ వెంటనే పనిచేయడం ప్రారంభించింది.
271 రోజులపాటు డయాలసిస్ లేకుండానే ఆయన జీవించారు. అనంతరం పంది కిడ్నీ పనితీరు దెబ్బతినడంతో దాన్ని తొలగించారు. ఆ తర్వాత మానవ దాత నుంచి కిడ్నీని అమర్చగా అది వెంటనే పనిచేయడం ప్రారంభించింది. ఈ వివరాలు ఇటీవల ది లాన్సెట్లో ప్రచురితమయ్యాయి.
జన్యువుల్లో మార్పులు చేసి...
పంది అవయవాల్లో ఉండే కొన్ని వైరస్ల జన్యు పదార్థం మనిషికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. అందుకే పంది జన్యువుల్లో మార్పులు చేయడంతోపాటు అవయవాన్ని అత్యంత నియంత్రిత పరిస్థితుల్లో పెంచడం, రోగిని క్షుణ్ణంగా పర్యవేక్షించడం వంటి చర్యలు తీసుకున్నారు. శరీరం తిరస్కరించే కొన్ని పదార్థాలను తొలగించడంతోపాటు.. మనిషి శరీరానికి అనుకూలంగా ఉండే ఏడు మానవ జన్యువులను చేర్చారు.


